Booster dose: 6 నెలల తర్వాత బూస్టర్‌ మేలు

కరోనా టీకా రెండో డోసు వేయించుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్‌ డోసు పొందడం మేలని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ను తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. తాము రూపొందిస్తున్న నాసికా టీకా (నాసల్‌ వ్యాక్సిన్‌) బూస్టర్‌ డోస్‌గా చక్కగా పనిచేస్తుందని, దానివల్ల వైరస్‌ వ్యాప్తి నిరోధం సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం నాసికా టీకా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

Updated : 11 Nov 2021 12:09 IST

నాసికా టీకాతో వైరస్‌ వ్యాప్తి నిరోధం సాధ్యం

దీనిని రెండో డోసుగా అందించాలని యోచిస్తున్నాం

కరోనా సోకిన వారికి, మొదటి మోతాదు పొందిన వారికి అది ఉత్తమం

కొవాగ్జిన్‌పై వ్యతిరేక ప్రచారం మమ్మల్ని బాధించింది

‘టైమ్స్‌ నౌ’ సదస్సులో భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల

ఈనాడు, దిల్లీ: కరోనా టీకా రెండో డోసు వేయించుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్‌ డోసు పొందడం మేలని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ను తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. తాము రూపొందిస్తున్న నాసికా టీకా (నాసల్‌ వ్యాక్సిన్‌) బూస్టర్‌ డోస్‌గా చక్కగా పనిచేస్తుందని, దానివల్ల వైరస్‌ వ్యాప్తి నిరోధం సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం నాసికా టీకా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కొవాగ్జిన్‌ తీసుకున్నవారిలో ఆరు నెలల తర్వాత కూడా టీ సెల్‌ స్పందన కనిపిస్తోందని, ఇది అమెరికాలో అందించే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల కంటే మేలైన పనితీరు కనబరుస్తోందని పేర్కొన్నారు. ‘ఇండియా-గ్లోబల్‌ వ్యాక్సిన్‌ ఇంజిన్‌’ అన్న అంశంపై టైమ్స్‌నౌ ఛానల్‌ బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని వివిధ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..

పారదర్శకత, నిజాయితీతో ఆటలో గెలిచాం

మేం తయారు చేస్తున్న వ్యాక్సిన్లలో అయిదింటికి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గుర్తింపు ఉంది. ఆ ప్రక్రియ ఎలా సాగుతుందన్నది మాకు తెలుసు. కొన్ని ప్రసార మాధ్యమాలే వ్యతిరేకంగా రాశాయి. అలాంటి వాటివల్ల అనుమతుల ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. పారదర్శకంగా, నిజాయితీగా ఉండటంవల్ల చివరకు ఆటలో గెలిచాం. ప్రధానమంత్రి కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వెంటనే అది మోదీ, భాజపా వ్యాక్సిన్‌ అని కొందరు ప్రచారం మొదలుపెట్టారు. శాస్త్రవేత్తలుగా మేం రాజకీయాలను అర్థం చేసుకోలేం. మాపై చేసిన ప్రచారం మమ్మల్ని బాధించడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే స్టార్టప్స్‌కి అడ్డంకిగా తయారైంది. ఎవరైనా మిగతావిషయాలపై రాజకీయాలు చేయొచ్చు కానీ వైద్య ఆరోగ్యంపై మాత్రం కాదు.

ఎవరూ మాలాంటి పరీక్షలను ఎదుర్కోలేదు

దేశంలో చేసిన ప్రతికూల ప్రచారం డబ్ల్యూహెచ్‌ఓనీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. తాము చేస్తున్నది తప్పా, ఒప్పా అని నిర్ధరించుకునేందుకు వారు ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చూసి సూక్ష్మంగా పరిశీలించాల్సి వచ్చింది. మాలాంటి పరీక్షలను ఎవ్వరూ ఎదుర్కోలేదు. చివరికి మేమే నెగ్గాం. ఎక్కువ మంది సవాళ్లు విసరడం మాకే మేలు చేసింది. మిగతావారి కంటే ఉత్తమంగా నిలవడానికి దోహదపడింది.

అప్పుడు మాస్కుల అవసరం ఉండదు

తొలి డోసు కొవాగ్జిన్‌, రెండో డోసు కింద నాసికా టీకా ఇచ్చే విషయం గురించి ఆలోచిస్తున్నాం. రెండో డోసు నాసికా వ్యాక్సిన్‌ ఇస్తే వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి వీలుంటుంది. అప్పుడు మాస్కులు వాడాల్సిన అవసరం ఉండదు. సూది మందు రూపంలో ఇచ్చే టీకాతో ఊపిరితిత్తుల పైభాగానికి రక్షణ ఉండదు కనుక మాస్క్‌ ధరించాలి. నాసికా వ్యాక్సిన్‌ ఆ భాగానికీ రక్షణ కల్పిస్తుంది. నాసికా టీకాను వైరస్‌ సోకని వ్యక్తికి ఇస్తే అది సరిగా పనిచేయదు. కానీ ఇన్‌ఫెక్షన్‌కు గురైన వ్యక్తికి గానీ, తొలి డోసు తీసుకున్న వ్యక్తికి గానీ ఇస్తే అది బాగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఈ రోగనిరోధకశక్తి (ఇమ్యునాలజీ)ని ప్రపంచంలో తొలిసారి కనుగొన్న సంస్థ మాదే. ఇప్పటికే ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారు రెండు డోసుల కొవాగ్జిన్‌ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ నాసికా వ్యాక్సిన్‌ ఒక్క డోసు తీసుకుంటే సరిపోతుంది. కరోనాను నిరోధించాలంటే నాసికా టీకా తప్ప ఇంకో మార్గం లేదు. మేం దీని రెండో దశ పరీక్షలు పూర్తిచేశాం. ఫలితాల విశ్లేషణ జరుగుతోంది. 3-4 నెలల్లో దాన్ని ఆశించవచ్చు.

మాకు మంచి చరిత్ర ఉంది

మేం ఇదివరకే కొవాగ్జిన్‌ కంటే ఉత్తమమైన, ప్రపంచంలో మొట్టమొదటి టైఫాయిడ్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను రూపొందించాం. దురదృష్టవశాత్తు దాని గురించి మీడియా పట్టించుకోలేదు. ఉత్తమ వ్యాక్సిన్ల రూపకల్పనలో మాకు మంచి చరిత్ర ఉంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో గర్భిణులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చింది భారత్‌లోనే. అందులో దాదాపు పది లక్షల మందికి కొవాగ్జిన్‌ ఇచ్చారు. గర్భిణులకు ఈ వ్యాక్సిన్‌ సురక్షితమని తేలింది. డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం క్లినికల్‌ మోడ్‌లో ఈ విషయాన్ని నిరూపించాల్సిందిగా సూచిస్తోంది. మరో రెండుమూడు నెలల్లో ఆ పని పూర్తిచేస్తాం. మాది ఉత్తమమైన సైన్స్‌ అని మరోసారి నిరూపించుకుంటాం.

పిల్లల టీకాపై కేంద్రం త్వరగా నిర్ణయించాలి

2 నుంచి 18 ఏళ్ల వారిలో క్లినికల్‌ పరీక్షలు నిర్వహించిన ఏకైక వ్యాక్సిన్‌ ప్రపంచంలో మాదే. వివరాలను ఔషధ నియంత్రణ జనరల్‌ ఆమోదం కోసం పంపాం. భారతీయ సంస్థ అనుమతులు ఇచ్చేంతవరకూ పిల్లల టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతిచ్చే అవకాశం లేదు. మూడేళ్లకుపైగా వయసున్న పిల్లలకు టీకా అనుమతుల కోసం చైనా దరఖాస్తు చేసుకొంది. ఈ విషయంలో మాకు పోటీ ఎదురవుతోంది. ప్రపంచ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అవి వచ్చిన రెండు మూడు నెలల్లోనే మొత్తం పిల్లలకు అందించడం సాధ్యం కాదు. అనుమతులు ఆలస్యం చేస్తే మిగతా ప్రపంచ దేశాలకు వెళ్లే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం మేం ఏటా 100 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకున్నాం. మూడు ప్రభుత్వరంగ సంస్థలు, ఒక ప్రైవేటు సంస్థతో వ్యాక్సిన్‌ ఉత్పత్తి కోసం ఒప్పందం చేసుకున్నాం. మేం ఆశించిన స్థాయికి వారు చేరుకోలేదు.

అది మాకిచ్చిన గౌరవంగా భావిస్తున్నాం 

దేశ ప్రధాని మా వ్యాక్సిన్‌ తీసుకోవడం మాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం. భారతీయ శాస్త్రవేత్తలపై, స్టార్టప్స్‌పై ఉన్న నమ్మకానికి అది అద్దంపట్టింది. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మేం ఏ ప్రక్రియనూ తగ్గించలేదు. ఏ నిబంధనా ఉల్లంఘించలేదు. ఆ పనిచేసి ఉంటే నేను జైలుకు వెళ్లి ఉండేవాన్ని. భారతీయ చట్టాలను 100% అనుసరించాం. ఇక్కడ వేగం పుంజుకొన్నది అనుమతుల ప్రక్రియ మాత్రమే. ఇదివరకు నాలుగైదునెలలు పట్టే అనుమతులు ఇప్పుడు నాలుగైదు రోజుల్లోనే వచ్చాయి. వ్యాక్సిన్‌ తయారీ సంస్థలను ప్రధానమంత్రి సందర్శించడం.. నియంత్రణ వ్యవస్థ పనితీరులో మార్పు రావడానికి దోహదం చేసింది.

త్వరలో జికా వైరస్‌కు వ్యాక్సిన్‌

కరోనా వ్యాక్సిన్‌ తీసుకొని ఆరు నెలలు గడిచిన వారిని పరీక్షించి వారిలో టీసెల్‌ మెమరీ ఉందా? లేదా? అని పరిశీలించినప్పుడు అవి అందరిలో కనిపించాయి. తర్వాత వారికి వ్యాక్సిన్‌ ఇచ్చి చూసినప్పుడు బూస్టింగ్‌ ప్రభావం కనిపించింది. టీసెల్‌ స్పందన చాలా ముఖ్యం. కొవాగ్జిన్‌ వల్ల అది దీర్ఘకాలం ఉంటుంది. జికా వైరస్‌కు 2014లోనే వ్యాక్సిన్‌ కనుగొన్నాం. ఇప్పటికే మొదటిదశ ట్రయల్స్‌ పూర్తయ్యాయి. ఇంకా రెండు ట్రయల్స్‌ జరగాల్సి ఉంది. త్వరలో సిద్ధం చేస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని