అయోమయంలో ట్రంప్‌!

ఎన్నికల్లో తాను ఓటమి పాలైతే అంగీకరించబోనని బయటకు గంభీరంగా చెప్తున్నప్పటికీ.. లోలోపల మాత్రం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ...

Updated : 07 Nov 2020 05:25 IST

సొంత పార్టీలోనే నిరసన గళం

వాషింగ్టన్‌: ఎన్నికల్లో తాను ఓటమి పాలైతే అంగీకరించబోనని బయటకు గంభీరంగా చెప్తున్నప్పటికీ.. లోలోపల మాత్రం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర గందరగోళానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. బైడెన్‌ విజయం సాధించిన అన్నిచోట్లా కోర్టుల్లో దావాలు వేస్తానని ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే- ఈ అంశంపై ట్రంప్‌ న్యాయవాద బృందంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు ఆయన సన్నిహితుడొకరు తెలిపారు. ఓటమి ఎదురైతే హుందాగా అంగీకరించడం మంచిదని కొందరు సూచిస్తుండగా, పోరాటం కొనసాగించాలంటూ మరికొందరు ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. దీంతో ఎటూ తేల్చుకోలేక ట్రంప్‌ అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రతికూల ఫలితం వస్తే.. చిట్టచివరకు ఆయన అంగీకరించే పరిస్థితులు ఉన్నాయని, ఆలోపు మాత్రం కచ్చితంగా పోరాటం కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు.

మరిన్ని దావాల దిశగా..
విస్కాన్సిన్‌లో రీకౌంటింగ్‌ కోరుతూ కోర్టును ఆశ్రయించిన ట్రంప్‌ బృందం మరిన్ని రాష్ట్రాల్లో అదే తరహా దావాలు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పెన్సిల్వేనియా, జార్జియాతోపాటు అరిజోనాలోనూ ఓట్లను మళ్లీ లెక్కించాలని వారు కోర్టును ఆశ్రయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపును నిలిపివేయాలంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ రిపబ్లికన్‌లోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే తాను గెలిచానంటూ చేసిన ప్రకటనపైనా ఆయన సన్నిహితులు కూడా అసంతృప్తి చెందుతున్నారు. ప్రముఖ నాయకులెవరూ ఆయన వాదనతో ఏకీభవిస్తున్నట్టు కనిపించడం లేదు. ఇంతవరకు సహకరించిన వారు, ఎప్పుడూ ఎలాంటి విమర్శలు చేయనివారు సయితం ఆయన వైఖరితో విభేదిస్తున్నారు. ట్రంప్‌ మద్దతుదారుడు, సెనేట్‌ మెజార్టీ పక్ష నేత మిచ్‌ మెక్‌కొనెల్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘‘గెలిచానని చెప్పుకోవడం వేరు..ఓట్ల లెక్కింపు ముగియడం వేరు’’ అని వ్యాఖ్యానించారు. ఫ్లోరిడా సెనేటర్‌ మాకో రుబియో కూడా ట్రంప్‌ వ్యాఖ్యలను తిరస్కరించారు. ‘‘చట్టబద్ధంగా పోలయిన ఓట్లను లెక్కించడానికి రోజుల సమయం తీసుకుంటే అది అవినీతి ఎందుకవుతుంది?’’ అని ప్రశ్నించారు.  న్యూజెర్సీ మాజీ గవర్నర్‌, ట్రంప్‌ మద్దతుదారుడు క్రిస్‌ క్రిస్టీ మాట్లాడుతూ ‘‘ఆయన వాదనకు ఆధారాలు లేవు. పోలయిన ప్రతి ఓటునూ లెక్కించాల్సిందే. ఎన్నికల వ్యవస్థపైనే ఆయన దాడి చేశారు. రాజకీయంగా చెడ్డ నిర్ణయం. సరయిన వ్యూహం కాదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కావు’’ అని అన్నారు.  ఓట్ల లెక్కింపులో అవినీతిపై రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ప్రముఖ ఇండియన్‌-అమెరికన్‌ నాయకురాలు నిక్కీ హేలీ ఎందుకు స్పందించడం లేదని ట్రంప్‌ కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ ప్రశ్నించారు. ‘‘2024 ఆశావహులు గోడ మీది పిల్లిలా కూర్చున్నారు’’ అంటూ ట్వీట్‌ చేశారు.

ప్రజాస్వామ్యంలో సహనం ముఖ్యం: బైడెన్‌

వాషింగ్టన్‌: ఎన్నికల ఫలితాల కోసం ఓపిగ్గా ఎదురుచూడాలని బైడెన్‌ తన మద్దతుదారులను కోరారు. ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడూ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొన్నారు. అమెరికాలో ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగుతున్న వేళ డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో కలిసి ఆయన డెలావర్‌లో గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘అమెరికాలో ఓటు చాలా పవిత్రమైనది. దాని రూపంలోనే ప్రజలు తామేం కోరుకుంటున్నారో తెలియజేస్తుంటారు. ఓటర్ల సంకల్ప బలమే అమెరికా అధ్యక్షుడెవరో నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి బ్యాలెట్‌ను తప్పనిసరిగా లెక్కించాలి. ఇప్పుడు జరుగుతున్నది అదే’’ అని బైడెన్‌ పేర్కొన్నారు. ‘‘ప్రజాస్వామ్యం ఒక్కోసారి వికారంగా కనిపిస్తుంది. కాబట్టి కొన్నిసార్లు సహనంతో ఉండటం చాలా ముఖ్యం. ఆ ఓపిక కారణంగానే 240 ఏళ్లుగా మన దేశంలో పాలనా వ్యవస్థ ప్రపంచమంతా ఈర్ష్య పడేలా మనగలుగుతోంది. ప్రశాంతంగా ఉండండి. కౌంటింగ్‌ పూర్తవుతోంది. ఫలితం త్వరలోనే తేలబోతోంది’’ అని చెప్పారు.

మాట్లాడుతుండగానే కట్‌!

న్యూయార్క్‌: ఎన్నికల్లో పరాజయం అంచున నిల్చున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పలు వార్తా సంస్థలు ఝలక్‌ ఇచ్చాయి! ఆయన ప్రసంగిస్తుండగా మధ్యలోనే మైకులు కట్‌ చేసుకున్నాయి. ఓట్ల లెక్కింపులో తీవ్ర మోసం జరుగుతోందంటూ ట్రంప్‌ పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. శ్వేతసౌధంలో గురువారం మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన.. అవే ఆరోపణలను  పునరావృతం చేశారు. దీంతో ఏబీసీ, సీబీఎస్‌, ఎన్‌బీసీ తదితర వార్తాసంస్థలు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని మధ్యలోనే కట్‌ చేశాయి. ట్రంప్‌ ఆరోపణల్లో వాస్తవం లేదని అవి అభిప్రాయపడ్డాయి. ఫాక్స్‌ న్యూస్‌, సీఎన్‌ఎన్‌ ఛానళ్లు మాత్రం   అధ్యక్షుడి పూర్తి ప్రసంగాన్ని ప్రసారం చేశాయి.


కరోనా పాంతాల్లో ఆయనకే ఆధిక్యం

అమెరికా ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం ఇది! కరోనా వైరసే ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మారింది. దీన్ని అరికట్టడంలో విఫలమయ్యారంటూ ట్రంప్‌పై విమర్శల వాన కురిసింది. ఫలితాలు చూస్తే ఆశ్చర్యం.... వ్యాధి అధికంగా వ్యాపించిన ప్రాంతాల్లోనే ఆయన ఘన విజయం సాధించారు. మొత్తం 376 ప్రాంతాల్లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉండగా అందులో 93 శాతం ప్రాంతాల్లో   ఆయన గెలుపొందారు. డకోటా, మొంటానా, నెబ్రస్కా, విస్కాన్సిన్‌, అయోవా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలన్నీ ఆయన పరమయ్యాయి. వ్యాధి నివారణకు ఆయన గట్టిగా కృషి చేస్తున్నారని మద్దతుదారులు బలంగా   విశ్వసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని