IMF: పొంచి ఉంది పెద్ద ముప్పు

భారత్‌లో సాగుతున్న కొవిడ్‌  రెండో విజృంభణ.. త్వరలో వర్ధమాన దేశాల్లో కరోనా వికృత రూపం దాల్చబోతోందనడానికి నిదర్శనం కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది.  కరోనా తాకిడికి గురికాని ఆఫ్రికాఖండంలోని దేశాలు సహా అల్ప, మధ్యాదాయ దేశాలకు ఇది హెచ్చరిక అని తెలిపింది.

Updated : 23 May 2021 10:17 IST

భారత్‌లో కొవిడ్‌ విజృంభణే దీనికి నిదర్శనం
2021 చివరికి 35% కన్నా తక్కువ మందికే టీకా
ఐఎంఎఫ్‌ నివేదికలో వెల్లడి

వాషింగ్టన్‌: భారత్‌లో సాగుతున్న కొవిడ్‌  రెండో విజృంభణ.. త్వరలో వర్ధమాన దేశాల్లో కరోనా వికృత రూపం దాల్చబోతోందనడానికి నిదర్శనం కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది.  కరోనా తాకిడికి గురికాని ఆఫ్రికాఖండంలోని దేశాలు సహా అల్ప, మధ్యాదాయ దేశాలకు ఇది హెచ్చరిక అని తెలిపింది. ఈ మేరకు ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపినాథ్‌, ఆర్థికవేత్త రుచిర్‌ అగర్వాల్‌లు ఓ నివేదికను వెలువరించారు. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికి 35%కన్నా తక్కువ మందికే టీకా అందుతుందని చెప్పారు. నివేదికలోని ముఖ్యాంశాలివీ..
* బ్రెజిల్‌ విజృంభణ తర్వాత భారత్‌లో కొవిడ్‌ రెండో ఉద్ధృతి చెలరేగడాన్ని బట్టి చూస్తే వర్ధమాన దేశాల్లో మున్ముందు కరోనా విశృంఖలంగా మారొచ్చని అర్థమవుతోంది.
* మొదటి ఉద్ధృతిని భారత్‌లోని ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ బాగానే తట్టుకొంది. ఈసారి మాత్రం రోగుల సంఖ్య పెరగడంతో దీనిపై అమాంతం ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఆక్సిజన్‌, ఆసుపత్రి పడకలు, వైద్య పరిరక్షణ వంటివి దొరక్క అనేకమంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
* ప్రస్తుతం భారత్‌ సాగిస్తున్న టీకా కొనుగోళ్లు, ‘కొవాక్స్‌’ కింద అందుతున్న వ్యాక్సిన్లను పరిగణనలోకి తీసుకుంటే 2022 ప్రథమార్ధం నాటికి దేశ జనాభాలో 25 శాతం మందికే వ్యాక్సిన్‌ అందుతుంది. అదనపు ఉత్పత్తి ద్వారా ఈ లోటును పూడ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
* 60 శాతం మందికి టీకా ఇవ్వాలంటే భారత్‌ అదనంగా దాదాపు 100 కోట్ల డోసులకు తక్షణం ఆర్డర్లు ఇవ్వాలి. టీకా కంపెనీలు అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన పెట్టుబడులకు రాయితీలు ఇవ్వడం, వ్యాక్సిన్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపరుచకోవడం ద్వారా వీటిని సాధించొచ్చు. ఈ దిశగా భారత ప్రభుత్వం టీకా కంపెనీలకు ఇటీవల దాదాపు 60 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం స్వాగతించదగ్గ పరిణామం.
* అయితే భారత అధికారులు మాత్రం ఈ ఏడాది చివరినాటికి 200 కోట్ల డోసులు లభ్యమవుతాయన్న అంచనాల్లో ఉన్నారు. దీన్ని సాధించాలంటే ఉత్పాదక సామర్థ్యం పెంపులో జాప్యం లేకుండా చూడాలి. ముడిపదార్థాల ఎగుమతుల్లో ఆంక్షల తొలగింపునకు అంతర్జాతీయ కసరత్తు జరగాలి.
* టీకా ముడి పదార్థాల ఎగుమతులపై ఆంక్షలను అమెరికా సడలించినప్పటికీ భారత్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. కీలక ముడిపదార్థాలకు ఇంకా కొరత ఉంది. దీన్నిబట్టి అమెరికా తన ఆంక్షలను మరింత సడలించాల్సి ఉందని స్పష్టమవుతోంది.
* భారత్‌లో ప్రస్తుతం టీకా ఉత్పత్తిదారులు ఇవ్వజూపుతున్న ధరలు, దేశంలో యువ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే 18-44 ఏళ్ల మధ్యవారికి వ్యాక్సిన్లు ఇవ్వడానికి అదనంగా అయ్యే ఖర్చు.. జీడీపీలో 0.25 శాతంగానే ఉంటుంది. అందువల్ల కేంద్రీకృతంగానే ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలి.

5వేల కోట్ల డాలర్లతో అంతర్జాతీయ వ్యాక్సినేషన్‌ ప్రణాళిక
ఈ ఏడాది చివరినాటికి ప్రపంచ జనాభాలో కనీసం 40% మందికి, 2022 ప్రథమార్ధం నాటికి 60% మందికి కొవిడ్‌ టీకాలు వేసేలా 5వేల కోట్ల డాలర్లతో అంతర్జాతీయ వ్యాక్సినేషన్‌ ప్రణాళికను ఐఎంఎఫ్‌ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కొవాక్స్‌కు అదనపు గ్రాంట్లు, మిగులు టీకా డోసులను ధనిక దేశాలు విరాళంగా ఇవ్వడం, వ్యాక్సిన్లు, వాటి ముడి పదార్థాలు దేశాల మధ్య రవాణా అయ్యేలా వెసులుబాట్లు ఉండాలని సంస్థ ఎండీ క్రిస్టాలినా జార్జీవా పేర్కొన్నారు. అలాగే కరోనాలో కొత్త రకాలను ఎదుర్కొనేందుకు బూస్టర్‌ డోసులు అవసరమవుతాయని, ఇందుకోసం టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 కోట్ల డోసుల మేర పెంచాలని జి20 కూటమి ఆర్థిక సదస్సులో పేర్కొన్నారు. టీకాల లభ్యత ఉన్న ధనిక దేశాలు, అవి అందుబాటులో లేని పేద దేశాల మధ్య ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు