Corona: వారంలో తగ్గుతుంది

కొవిడ్‌ రోగులకు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీల’ రూపంలో ఆధునిక వైద్యం బాధితులకు భరోసానిస్తోంది.

Updated : 28 May 2021 07:54 IST

గరిష్ఠంగా పది రోజులు
కొవిడ్‌ రోగులకు అందుబాటులోకి మరో చికిత్స

మోనోక్లోనల్‌ యాంటీబాడీలతో మెరుగైన ఫలితాలు
ఒక్క ఇంజక్షన్‌ సరిపోతుంది
ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌

కొవిడ్‌ రోగులకు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీల’ రూపంలో ఆధునిక వైద్యం బాధితులకు భరోసానిస్తోంది. మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని వెల్లడవడంతో.. భారత ప్రభుత్వం తాజాగా ఈ చికిత్సకు అనుమతించింది. 2 లక్షల డోసులను దిగుమతి చేసుకోవడానికి ఒక ప్రైవేటు ఔషధ సంస్థకు పచ్చజెండా ఊపింది. దీంతో ఎక్కడో అమెరికాలో అనుసరిస్తున్న చికిత్స ఇప్పుడు మన దేశంలోనే కాదు.. మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ చికిత్సను పొందడం ద్వారా 7-10 రోజుల్లో వైరస్‌ శరీరం నుంచి మటుమాయమవుతుంది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇవ్వడం ద్వారా ముప్పు తీవ్రత ఎక్కువ ఉన్న వారికి అధిక ప్రయోజనం చేకూరుతుందనీ, అలా అని విచ్చలవిడిగా వినియోగిస్తే ఔషధ నిల్వలకు కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్‌, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు.  మోనోక్లోనల్‌ చికిత్స తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గురువారం ‘జూమ్‌’ మాధ్యమం ద్వారా ఆయన విలేకరులకు ఈ చికిత్స పద్ధతుల గురించి వివరించారు.
ఏమిటీ ఈ యాంటీబాడీలు..
‘‘శరీరంలో చాలా రకాల యాంటీబాడీలుంటాయి. వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేసేవి కొన్నే ఉంటాయి. అటువంటి వాటిలో ‘టసిరిబిమాబ్‌, ఇమిడెవిమాబ్‌’ అనే రెండు రకాలున్నాయి. వాటిని సేకరించి కొత్త యాంటీబాడీలను వృద్ధి చేస్తారు. ఇలా ప్రత్యేకంగా ఒకట్రెండు రకాలను మాత్రమే సేకరించి వృద్ధి చేసే విధానాన్ని మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ అంటారు. ఈ రెండూ ఇంజక్షన్ల రూపంలో లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఒకే మోతాదులో శరీరంలోకి ఐవీ ద్వారా ఎక్కిస్తారు. దీని ధర ప్రస్తుతం సుమారు 70వేల వరకూ ఉంటుంది. ప్లాస్మాథెరపీలో చాలా రకాల యాంటీబాడీలుంటాయి. కానీ మోనోక్లోనల్‌లో రెండే రకాలుంటాయి. 5 ఎంఎల్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీలు ఇస్తే.. 5 లీటర్ల ప్లాస్మా ఇచ్చిన దానితో సమానం.
నాడు ట్రంప్‌ తీసుకున్నది ఈ చికిత్సే
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొవిడ్‌ బారిన పడినప్పుడు మోనోక్లోనల్‌ యాంటీబాడీలనే ఎక్కించారు. రెండు రోజుల్లోనే ట్రంప్‌ కోలుకున్నారు. వీటిని ఎవరికి పడితే వారికి ఇవ్వొద్దు. తగిన సమయంలో ఇవ్వడం ద్వారా వైరస్‌ లోడ్‌ గణనీయంగా తగ్గిపోతుంది.

ఎప్పుడు ఇవ్వాలంటే...
వైరస్‌ లక్షణాలు కనిపించిన 3-7 రోజుల్లోపు ఈ ఇంజక్షన్‌ ఇవ్వాలి. దీని ద్వారా 7-10 రోజుల్లో వైరస్‌ శరీరం నుంచి మటుమాయమవుతుంది.
వైరస్‌ సోకిన 10 రోజుల తర్వాత ఇస్తే అంత సానుకూల ప్రభావం ఉండదు. ఎందుకంటే అప్పటికే శరీరంలో వైరస్‌ లోడ్‌ బాగా పెరిగిపోయి ఉంటుంది.
ఇంజక్షన్‌ ఇవ్వాలంటే ముందు తప్పనిసరిగా ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేయించాలి.
అందులో ‘సైకిల్‌ త్రెషోల్డ్‌(సీటీ)’ విలువను ప్రామాణికంగా తీసుకోవాలి.
ఎన్ని సైకిల్స్‌లో వైరస్‌ను గుర్తించారనేది ముఖ్యం. ఉదాహరణకు 15 సైకిల్స్‌లో వైరస్‌ను గుర్తిస్తే.. వైరల్‌ లోడ్‌ ఎక్కువగా ఉందని అర్థం.
అదే 30 సైకిల్స్‌లో వైరస్‌ను నిర్ధారిస్తే.. వారిలో లోడ్‌ తక్కువగా ఉందని తెలుస్తుంది.
15 సీటీ వ్యాల్యూ ఉన్నవారికి వారం తర్వాత 30కి తగ్గితే.. అప్పుడు ఆ ఇంజక్షన్‌ బాగా పనిచేసినట్లుగా గుర్తిస్తారు.

ఎవరికి ఇవ్వొద్దంటే...
ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్‌ సాయంతో.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి..
బహుళ అవయవాలు దెబ్బతిన్నవారికి..
గర్భిణులకు కూడా ఇవ్వకూడదు.
పనిచేసేదిలా...
మోనోక్లోనల్‌ చికిత్స పొందినవారిలో 70-80 శాతం మంది 3-4 రోజుల్లో కోలుకుంటారు. వారం రోజుల్లో పూర్తిగా నయమవుతుంది. ఈ ఔషధాన్ని పొందినవారి ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లదు. ఈ యాంటీబాడీలు శరీరంలోకి వెళ్లిన తర్వాత.. కొవిడ్‌ స్పైక్‌ ప్రోటీన్‌కు.. శరీర కణాలకు మధ్య ఇవి అడ్డు గోడగా నిలుస్తాయి. ఫలితంగా వైరస్‌ శరీర అంతర్భాగంలోకి ప్రవేశించలేదు. వైరస్‌ తన సంఖ్యను పెంచుకునే అవకాశం సన్నగిల్లుతుంది’’ అని డా. నాగేశ్వరరెడ్డి తెలిపారు.

ఎవరికి ఎక్కువ మేలు?
65 ఏళ్లు దాటిన వారికి..
స్థూలకాయులకు అంటే ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ 35 కంటే ఎక్కువగా ఉన్నవారికి..
దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి పీడితులకు..
ఎంతోకాలంగా మధుమేహానికి చికిత్స పొందుతున్నవారికి..
రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలను వినియోగిస్తున్నవారికి.. ఉదాహరణకు క్యాన్సర్‌ రోగులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారికి.
55 ఏళ్లు దాటి అధిక రక్తపోటు, గుండెజబ్బు ఉన్న బాధితులకు..
క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌, ఆస్తమాతో బాధపడుతున్నవారికి..
పై దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముప్పు తీవ్రత ఉంటే 12 ఏళ్లు దాటిన వారికి..
బాలింతలకు కూడా..

ఏఐజీలో అధ్యయనం
వివిధ రకాల ఉత్పరివర్తన వైరస్‌లపై ఈ కొత్త చికిత్స ప్రభావం చూపుతోందని పలు అధ్యయనాల్లో వెల్లడైనట్టు డా.నాగేశ్వరరెడ్డి తెలిపారు. ‘‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ భారత్‌లోని డబుల్‌ మ్యూటెంట్‌ వైరస్‌పై ఈ ఔషధ ప్రభావం గురించి మరింత కూలంకషంగా అధ్యయనం చేపట్టింది. ఎందుకంటే మన దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 60-70 శాతం వరకూ ఈ రకం వైరస్‌తో వ్యాప్తి చెందినవే. 100 మందిని ఎంపిక చేసి, వారిపై ఈ అధ్యయనాన్ని నిర్వహిస్తున్నాం. నాలుగు వారాల్లో ఫలితాలు వెల్లడవుతాయి. ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. అలాగే ఈ మోనోక్లోనల్‌ యాంటీబాడీల ఉత్పత్తిని ఏఐజీలోనూ ప్రారంభించాం. అయితే ఇంకా అది కమర్షియల్‌గా బయటకు రాలేదు. పరిశోధన దశలోనే ఉంది’’ అని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని