OXYGEN CONCENTRATOR: భారీగా తగ్గిన ఆక్సిజన్‌ ధరలు

కొవిడ్‌ బాధితులకు ఊరట కలిగించే పరిణామమిది. ఏప్రిల్‌ మధ్య నుంచి విపరీతంగా పెరిగిన మెడికల్‌ ఆక్సిజన్‌, కాన్సన్‌ట్రేటర్ల ధరలు గణనీయంగా దిగివచ్చాయి.

Updated : 30 Aug 2022 11:33 IST

రూ. 2-3వేల నుంచి రూ.600కు
కొన్ని ఆసుపత్రుల్లో ఇంకా అధిక ఛార్జీలే
(ఈనాడు వాణిజ్య విభాగం)

కొవిడ్‌ బాధితులకు ఊరట కలిగించే పరిణామమిది. ఏప్రిల్‌ మధ్య నుంచి విపరీతంగా పెరిగిన మెడికల్‌ ఆక్సిజన్‌, కాన్సన్‌ట్రేటర్ల ధరలు గణనీయంగా దిగివచ్చాయి. కేసులు తగ్గుముఖం పట్టడం, ఆక్సిజన్‌ అందుబాటు సదుపాయాలు మెరుగవ్వడం ఇందుకు కారణమని చెబుతున్నారు. పెద్ద సిలిండర్‌ రీఫిల్లింగ్‌ ధర రూ.2,000-3,000 నుంచి రూ.600కు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల ధర రూ.60,000-70,000 నుంచి రూ.15,000-25,000కు తగ్గాయి.
కొవిడ్‌ మహమ్మారి మొదటిదశ కంటే రెండో దశలో బాధితులకు ఆక్సిజన్‌ అవసరాలు బాగా పెరిగాయి.  ఆసుపత్రులకు సిలిండర్లలో సరఫరా అయ్యే మెడికల్‌ ఆక్సిజన్‌ ధరతో పాటు, ఇంటి వద్ద స్వల్ప స్థాయిలో ఆక్సిజన్‌ వినియోగించుకునేందుకు దోహదపడే కాన్సన్‌ట్రేటర్ల ధరలూ కొన్నిరెట్ల మేర ఎక్కువయ్యాయి. ఆక్సిజన్‌ శాచురేషన్‌ (ఎస్‌పీఓ2) స్థాయులు 90 కంటే తగ్గిన వారికి కనీసం నిమిషానికి 5 లీటర్ల సామర్థ్యంతో మెడికల్‌ ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి. ఈ సదుపాయం ఉన్న పడక కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు రూ.20,000-30,000 కూడా వసూలు చేశారు. వాస్తవానికి ఏప్రిల్‌ మొదటివారం వరకు 150 క్యూబిక్‌ మీటర్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ఉండే పెద్ద సిలిండర్‌ను నింపి ఇచ్చేందుకు తయారీ సంస్థలు రూ.350 మాత్రమే తీసుకునేవి. గిరాకీ పెరిగి పోవడంతో ఏప్రిల్‌ మధ్య నుంచి రూ.600 తీసుకోవడం ప్రారంభించాయి. అదేనెల 20 కల్లా రూ.1,000కు, మే మొదటి వారానికల్లా రూ.2,500-3,000కు కూడా ఈ ధర ఎగబాకింది. అదీ అవసరానికి లభ్యం కాక ఎందరో ప్రాణాలు కోల్పోయారు.

గిరాకీ తగ్గి...
కేసులు తగ్గుముఖం పడుతుండటానికి తోడు... విశాఖ ఉక్కు, మేఘా ఇంజినీరింగ్‌ వంటి సంస్థలు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నాయి. ఆక్సిజన్‌ సరఫరాకు కావాల్సిన ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ ట్యాంకర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్రైవేటు సంస్థలు కూడా రీఫిల్లింగ్‌ ఛార్జీలను తగ్గిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రులలో వినియోగించే పెద్ద సిలిండర్‌ రీఫిల్లింగ్‌కు హైదరాబాద్‌లో కనిష్ఠంగా రూ.600, గరిష్ఠంగా రూ.1000 వసూలు చేస్తున్నారు.

100 నుంచి 30 సిలిండర్లకు..
ఈ నెల మొదటి వారంలో ఆక్సిజన్‌ పడకలు, బైపాప్‌-వెంటిలేటర్లతో కూడిన 30 పడకలున్న ఆసుపత్రికి రోజుకు 100 వరకు పెద్ద ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరమయ్యేవి. ఇప్పుడు సిలిండర్ల అవసరాలు కూడా రోజుకు 30-40 శాతానికి తగ్గిపోయాయని హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి నిర్వాహకుడు తెలిపారు. అయితే ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌ ఛార్జీలపై అవగాహన లేనివారి నుంచి తయారీ సంస్థలు కొంత అధికంగా వసూలు చేస్తుండగా, రోగుల నుంచి ఆసుపత్రుల వారు కూడా ఇంకా ఎక్కువ మొత్తాల్లోనే ఆక్సిజన్‌ ఛార్జీలు వసూలు చేస్తుండటం గమనార్హం.

ఎన్ని గంటలకు ఎంత అవసరం...
ఒక రోగికి నిమిషానికి 5 లీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్‌ నిరంతరాయంగా అందిస్తే పెద్ద సిలిండరు 10-12 గంటల పాటు వస్తుంది. అదే 2 లీటర్ల సామర్థ్యంతో అందిస్తే 18-24 గంటల పాటు ఆక్సిజన్‌ సరఫరా చేయొచ్చు.

కాన్సన్‌ట్రేటర్లు రూ.15,000 నుంచే..

ఆసుపత్రిలో ఆక్సిజన్‌తో చికిత్స పొంది, ఇంటికి వచ్చిన తరవాత కూడా శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న వారికి కాన్సన్‌ట్రేటర్లు ఉపయోగపడుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 7 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ ధర రూ.32,000, 9 ఎల్‌పీఎం ఉన్నది రూ.36,000 చొప్పున విక్రయించారు. ఏప్రిల్‌ నుంచి ఈనెల మధ్యవరకు వీటి ధరలు రూ.65,000-70,000గా ఉంది. అగ్రశ్రేణి కంపెనీలవైతే రూ.లక్షకు పైగా కూడా విక్రయించారు. ఇప్పుడు గిరాకీ తగ్గడం, విదేశాల నుంచి వ్యక్తిగత అవసరాలు, విరాళంగా ఇచ్చేందుకు దిగుమతి చేసుకునే వాటిపై సుంకాలు రద్దు చేయడం లాంటి పరిణామాలతో మళ్లీ ధరలు దిగివచ్చాయి. ఇంటెక్స్‌, మైక్రోటెక్‌, మ్యాన్‌కైండ్‌, డెకెన్‌మౌంట్‌ వంటి దేశీయ సంస్థలు 5 లీటర్ల సామర్థ్యం కలిగిన కాన్సన్‌ట్రేటర్లను రూ.15,000కే విక్రయిస్తూ ఏడాది వారంటీ కూడా ఇస్తున్నాయి. 7 ఎల్‌పీఎంవి అయితే రూ.25,000, 9 లీటర్లవి రూ.35,000, మెడికల్‌ గ్రేడ్‌ 93 శాతం ఆక్సిజన్‌ను 5ఎల్‌పీఎం స్థాయిలో అందించేవి రూ.55,000కు లభిస్తున్నాయి. మే మొదటి వారంలో దీన్ని రూ.1,50,000 వరకు విక్రయించారు. దేశీయంగా కొన్ని కంపెనీలు భారీ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్నందున భవిష్యత్తులో చైనా ఉత్పత్తులపై ఆధారపడాల్సిన బాధ ఉండదని బ్లూలైన్‌ ఆల్కలైన్‌ సొల్యూషన్స్‌ అధినేత కలిశెట్టి నాయుడు తెలిపారు. విక్రయానంతర సేవలూ లభిస్తాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని