పోస్టాఫీసుల్లో ఉచితంగా టీకా రిజిస్ట్రేషన్‌

కొవిడ్‌ టీకా రిజిస్ట్రేషన్‌లో ఇబ్బంది పడుతున్నారా? స్మార్ట్‌ ఫోన్‌ లేదా? అయితే.. సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్తే సరిపోతుంది.

Published : 31 May 2021 02:46 IST

ఆధార్‌ కార్డు, ఫోన్‌ తీసుకెళ్లాలి

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ టీకా రిజిస్ట్రేషన్‌లో ఇబ్బంది పడుతున్నారా? స్మార్ట్‌ ఫోన్‌ లేదా? అయితే.. సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్తే సరిపోతుంది. టీకా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, స్లాట్‌ బుకింగ్‌ చేసుకునేవారికి సహకరించాలని తపాలా శాఖ నిర్ణయించింది. ఈ సేవలను ఎలాంటి రుసుములు లేకుండా ఉచితంగా అందించాలని తెలంగాణ తపాలా సర్కిల్‌ నిర్ణయించింది.
కొవిడ్‌ టీకా తీసుకోవాలంటే కొవిన్‌ పోర్టల్‌లో పేరు రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ తర్వాత టీకా కేంద్రాన్ని ఎంపిక చేసుకుని స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే అందులో చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లోనూ అందరికీ స్మార్ట్‌ఫోన్లు లేకపోగా.. కొందరు అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పోస్టాఫీసుల్లో వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌ సేవలను కేంద్రం అనుమతించింది. తొలుత ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఈ సేవల్ని దేశవ్యాప్తంగా విస్తరించారు. తెలంగాణలోని 36 హెడ్‌ పోస్టాఫీస్‌లు, 643 సబ్‌ పోస్టాఫీస్‌లు, 810 బ్రాంచ్‌ పోస్టాఫీసుల్లో సోమవారం నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పోస్టాఫీసులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తున్నాయి. టీకా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనుకునేవారు తమ వెంట ఆధార్‌ కార్డు, ఫోన్‌ (స్మార్ట్‌ ఫోనే అవసరం లేదు) తీసుకెళ్లాలి. దానికి వచ్చే ఓటీపీని నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. టీకా రిజిస్ట్రేషన్‌ సేవలు ఉచితంగా అందిస్తున్నామని పోస్టుమాస్టర్‌ జనరల్‌ పి.విద్యాసాగర్‌రెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు. కొవిడ్‌ లక్షణాలున్నవారు పోస్టాఫీసులకు రావొద్దని, విధిగా మాస్క్‌ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని తపాలా శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.వెంకటరామిరెడ్డి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని