Water Dispute: ముదురుతున్న వివాదం

కృష్ణా జలవివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రాజెక్టులన్నీ పోలీసు పహారాలోకి వెళ్లాయి. జూరాల మొదలుకొని పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. నాగార్జునసాగర్‌ వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కోరేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ అధికారులను తెలంగాణ పోలీసులు అనుమతించలేదు.

Updated : 02 Jul 2021 10:38 IST

జూరాల నుంచి పులిచింతల వరకు ప్రాజెక్టులపై పహారా
రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని కోరుతున్న తెలంగాణ
విద్యుదుత్పత్తి నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్‌ వినతి
ఈనాడు - హైదరాబాద్‌
న్యూస్‌టుడే యంత్రాంగం

కృష్ణా జలవివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రాజెక్టులన్నీ పోలీసు పహారాలోకి వెళ్లాయి. జూరాల మొదలుకొని పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. నాగార్జునసాగర్‌ వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కోరేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ అధికారులను తెలంగాణ పోలీసులు అనుమతించలేదు. పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ ఆ ప్రాజెక్టు ఎస్‌.ఇ  తెలంగాణ జెన్‌కో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. జూరాల డ్యాంపైకి తెలంగాణ రాకపోకలు నిలిపివేయగా, ఆర్డీఎస్‌ కుడికాలువ వద్ద ఆంధ్రప్రదేశ్‌ పోలీసు బలగాలను మోహరించింది. ఈ పనులను నిలిపివేయాలని తెలంగాణ కోరింది. శ్రీశైలం వద్ద రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించగా, పోతిరెడ్డిపాడు వద్ద పోలీసులను పెంచి ఆంధ్రప్రదేశ్‌ ఎవరినీ అనుమతించడం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఆయా జిల్లాల ఎస్పీలు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జూరాల నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని తెలంగాణ గట్టిగా కోరుతోంది. అయితే 841 అడుగుల దిగువన ఉన్నప్పుడు నీటిని తీసుకోవడానికి అవకాశం లేదంటూ రాయలసీమ ప్రాజెక్టును కొనసాగించడానికి ఏపీ ప్రయత్నిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో కృష్ణాపై కొత్త బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టడంతోపాటు పూర్తి స్థాయిలో జల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని నిర్ణయించి అమలు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలు పరస్పరం బోర్డుకు ఫిర్యాదులు చేసుకొంటూనే ఇంకోవైపు విద్యుదుత్పత్తి, ఆయకట్టుకు నీటివిడుదల, నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. వీటికి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జూరాల డ్యాంపై రాకపోకల నిషేధం
జూరాలలో పూర్తి స్థాయి నీటినిల్వ 9.66 టీఎంసీలు కాగా, 7.86 టీఎంసీలు ఉన్నాయి.  21,877 క్యూసెక్కుల నీరొస్తుండగా, 20,986 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. గురువారం మధ్యాహ్నానికి జూరాలలోకి ప్రవాహం తగ్గింది. జూరాల డ్యాంపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. ప్రభుత్వ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో మక్తల్‌, నారాయణపేట, ఆత్మకూరు తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి ఇబ్బంది ఏర్పడింది. డ్యాం వద్ద, జలవిద్యుత్తు కేంద్రం వద్ద ప్రత్యేక పోలీసులను నియమించారు.

శ్రీశైలం వద్ద రెండు రాష్ట్రాల భద్రత
శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 43.55 టీఎంసీలు ఉన్నాయి. కనీస నీటిమట్టం 834 అడుగులు కాగా, 823.40 అడుగుల మట్టం ఉంది. జూరాలలో విద్యుదుత్పత్తి, స్థానికంగా కురిసే వర్షాలతో కలిపి బుధవారం ఉదయం ఆరుగంటల నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 30,610 క్యూసెక్కులు శ్రీశైలంలోకి రాగా, ఈ మొత్తం నీటిని బయటకు వదిలారు. విద్యుదుత్పత్తితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కుల నీటిని వదిలారు. అయితే గురువారం మధ్యాహ్నం మూడుగంటలకు జూరాల నుంచి 6,282 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 4446 క్యూసెక్కులు రాగా, శ్రీశైలం డ్యాం వద్ద 21 వేల క్యూసెక్కులు నమోదైంది. అయితే బయటకు మాత్రం 28,252 క్యూసెక్కుల నీటిని వదలడంతో శ్రీశైలంలో నీటిమట్టం కొంత తగ్గింది. జూరాల నుంచి విడుదల తగ్గడంతో శ్రీశైలంలోకి ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణ 12.928 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసింది. మరోవైపు డ్యాం వద్ద రెండు రాష్ట్రాలు పోలీసుభద్రత పెంచాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ పోలీసుభద్రతను పెంచినట్లు తెలిసింది.

ఏపీ అధికారులను అనుమతించని పోలీసులు
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 176.06 టీఎంసీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా, 534 అడుగుల మట్టం ఉంది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తితో  24 గంటల్లో సరాసరిన 27,533 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరింది. సాగర్‌ నుంచి 32,190 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. ఇక్కడ పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కోరేందుకు  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీటిపారుదల, పోలీసు, రెవిన్యూ అధికారులు యత్నించగా తెలంగాణ పోలీసులు అనుమతించలేదు. జెన్‌కో సీఈని కలిసి వినతిపత్రం ఇవ్వాలని కోరగా, కలిసి వినతిపత్రం తీసుకునేందుకు అంగీకరించకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ అధికారులు వెనుదిరిగారు. సాగర్‌ డ్యాంపై తెలంగాణ పోలీసులు మోహరించారు.

పులిచింతలలో విద్యుదుత్పత్తి నిలపాలని జెన్‌కో ఎస్‌ఈకి వినతి
పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా గురువారం ఉదయానికి 20.36 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తిద్వారా విడుదల చేస్తున్న నీటితో ఈ ప్రాజెక్టులోకి 24 గంటల్లో సరాసరిన 37,140 క్యూసెక్కులు వచ్చాయి. ఈ ప్రాజెక్టు వద్ద 120 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. ప్రాజెక్టు ఆంధ్ర పర్యవేక్షణలో ఉండగా, ఇక్కడి విద్యుదుత్పత్తి తెలంగాణ జెన్‌కోకు సంబంధించినది. ఒక్కొక్కటి 30 మెగావాట్లతో 4 యూనిట్లు ఉండగా,  ఒక్కొక్క దాంట్లో 15 మెగావాట్ల చొప్పున విద్యుదుత్పత్తి చేసి 3,229 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజిలో పూర్తి స్థాయి మట్టం ఉందని, ఇంకా డెల్టాకు నీటిని విడుదల చేయనందున పులిచింతలలో విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేసే నీటిని వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి విద్యుదుత్పత్తి నిలిపివేయాలని పులిచింతల ఎస్‌.ఇ. జెన్‌కో ఎస్‌.ఇని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు మోహరించారు. మరోవైపు పులిచింతలలో విద్యుదుత్పత్తి నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. కృష్ణా డెల్టా అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా విద్యుదుత్పత్తి చేస్తే నీటిని సముద్రంలోకి వృథాగా వదలాల్సి వస్తుందని, నాగార్జునసాగర్‌, పులిచింతలలో విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేసే నీటిని తెలంగాణ వాటా కింద జమచేయాలని కూడా కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని