19 వేల పోలీస్‌ కొలువులు!

రాష్ట్ర పోలీస్‌ శాఖలో మరో భారీ నోటిఫికేషన్‌ రాబోతోంది. 19 వేల పైచిలుకు కొలువుల్ని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం వాటి భర్తీ గురించి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Updated : 04 Jul 2021 09:51 IST

భారీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు ప్రకటించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖలో మరో భారీ నోటిఫికేషన్‌ రాబోతోంది. 19 వేల పైచిలుకు కొలువుల్ని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం వాటి భర్తీ గురించి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే తెలంగాణలో పోలీస్‌ కొలువులకు సంబంధించి ఇదే భారీ నోటిఫికేషన్‌ కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014లో తొలిసారి ఇచ్చారు. 2018లో మరోసారి పెద్ద ఎత్తున పోస్టులు ప్రకటించారు. ఆ సమయంలో 1,217 మంది ఎస్సైలు, 16,925 మంది కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. పలు కారణాలతో వీటిలో దాదాపు 3 వేల వరకు బ్యాక్‌లాగ్‌ పోస్టులు మిగిలిపోయాయి. కొంతకాలం క్రితం మరో నోటిఫికేషన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. 33శాతం మహిళలకు కేటాయించనున్నారు. ఈసారి ఎస్సై స్థాయిలో 360(సివిల్‌), 29(ఏఆర్‌), 20(కమ్యూనికేషన్స్‌) పోస్టులుంటున్నట్లు సమాచారం. కానిస్టేబుళ్ల స్థాయిలో 7,700(సివిల్‌), 6,680(ఏఆర్‌), టీఎస్‌ఎస్‌పీ(3,850), 15వ బెటాలియన్‌(560), కమ్యూనికేషన్‌(250).. మొత్తం 19,449 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపారు. వీటన్నింటికీ ఆమోదం లభించే అవకాశమున్నట్లు సమాచారం. కొత్త జోనల్‌ వ్యవస్థను ప్రభుత్వం ఆమోదించడంతో కొలువుల భర్తీకి మార్గం సుగమమైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని