అన్నదాతకు అప్పుల తిప్పలు

వ్యవసాయానికి పెట్టుబడి అంతకంతకూ పెరుగుతోంది. సాగు భారంగా మారుతోంది. అన్నదాతకు అండగా నిలవాల్సిన బ్యాంకులు నిర్దేశించుకున్న మేర రుణాలు

Published : 06 Sep 2021 02:42 IST

గమ్యం చేరని బ్యాంకుల రుణ లక్ష్యం

అమలు కాని ప్రణాళికలు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయానికి పెట్టుబడి అంతకంతకూ పెరుగుతోంది. సాగు భారంగా మారుతోంది. అన్నదాతకు అండగా నిలవాల్సిన బ్యాంకులు నిర్దేశించుకున్న మేర రుణాలు అందించలేకపోతున్నాయి. రాష్ట్రంలో సాగు పెరుగుతూ, రుణాలు పొందుతున్న రైతుల సంఖ్య వృద్ధిచెందుతున్నా రుణమొత్తాలు మాత్రం నామమాత్రంగానే పెరుగుతున్నాయి. నాబార్డ్‌ నిర్దేశిస్తున్న రుణ ప్రణాళిక అమలు కావడం లేదు. సాగు రుణాలను పెంచాల్సిన అవసరాన్ని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేస్తున్నా రుణ ప్రణాళిక అమల్లో ఉదాసీనత కనిపిస్తోంది. అప్పులు సకాలంలో అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట రుణాల్లో భారీగా కోత పడుతుండటంతో కర్షకులపై అప్పుల భారం పెరుగుతోంది. ప్రభుత్వం నుంచి ‘రైతుబంధు’ అందుతున్నా.. బ్యాంకులు పూర్తి స్థాయిలో రుణ ప్రణాళికను అమలు చేస్తేనే అన్నదాతలకు పెట్టుబడి తోడ్పాటు లభిస్తుంది.  రాష్ట్రంలో ఐదేళ్లుగా వ్యవసాయానికి అందుతున్న రుణాలు, ఆర్‌బీఐ లక్ష్యాలు సహా రుణ ప్రణాళిక అమలుపై రాష్ట్ర సాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) ఉపకమిటీ విశ్లేషించింది. ఆర్‌బీఐ కూడా రాష్ట్రంలో వ్యవసాయ రంగం సహా ప్రాధాన్య రంగాలకు రుణాలు అందుతున్న తీరును సమీక్షించి తమ నిర్దేశిత బెంచ్‌ మార్క్‌ నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రతి జిల్లాలోనూ ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు వ్యవసాయ, ప్రాధాన్య రంగాలకు రుణాలను అందించడంపై దృష్టిసారించాలని బ్యాంకులను ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ ఆదేశించింది.


నిర్దేశించిన మేర బ్యాంకులు రుణాలివ్వడం లేవు: ఆర్‌బీఐ

ప్రాధాన్య రంగాలకు ఇచ్చే రుణాల్లో 84 శాతం లక్ష్యం చేరుకోగా, వ్యవసాయ రుణాలు మాత్రం లక్ష్యంలో 77.21 శాతŸమే చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. రాష్ట్రంలో గతఆర్థిక సంవత్సరంలో మొత్తం రుణాల్లో ప్రాధాన్య రంగాలకు 40 శాతం ఉండాలని నిర్దేశించగా 36.55 శాతంగానే ఉంది. వ్యవసాయ రుణాల వాటాను 18 శాతంగా నిర్దేశించగా 16.74 శాతంగా ఉంది. బలహీనవర్గాలకు కనీసం పది శాతం ఇవ్వాలని నిబంధనలు స్పష్టం చేస్తుండగా 9.87శాతం లోపే ఉందని ఆర్‌బీఐ వివరించింది. సూక్ష్మ పరిశ్రమలకు 7.5 శాతం రుణాలు ఇవ్వాల్సి ఉండగా 4.52 శాతంగానే ఉందని పేర్కొంది. చిన్న, సన్నకారు రైతులకు 8% రుణాలను నిర్దేశించగా 8.55 శాతం ఇచ్చారని తెలిపింది. 2021-22 నుంచి చిన్న, సన్నకారు రైతులకు ఇచ్చే రుణాలను 9 శాతానికి, బలహీనవర్గాలకు 11 శాతానికి పెంచామని.. ఈ మేరకు రుణ మొత్తాలను నిర్దేశించుకోవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కొవిడ్‌ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రుణాలు తక్కువ మొత్తంలో అందాయి. పంట రుణాలతో పాటు, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ లక్ష్యంలో సుమారు 20 శాతానికి పైగా కోతపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని