Telangana: అమ్మో.. ఇంత ఖర్చా?

ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న నమ్మకంతో ఆదిలాబాద్‌కు చెందిన ఒక అభ్యర్థి శిక్షణ కోసం హైదరాబాద్‌ వచ్చారు. ఊర్లో తండ్రి రెండెకరాల కౌలు రైతు. ఫీజు, ఖర్చుల వివరాలు తెలుసుకున్న ఆ అభ్యర్థి...

Updated : 16 Feb 2022 05:41 IST

పోటీ పరీక్షల శిక్షణ కోసం నగరానికి నిరుద్యోగులు 

ఫీజులు చూసి బెంబేలు

ప్రత్యామ్నాయాల వైపు చూపు

ఈనాడు - హైదరాబాద్‌

ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న నమ్మకంతో ఆదిలాబాద్‌కు చెందిన ఒక అభ్యర్థి శిక్షణ కోసం హైదరాబాద్‌ వచ్చారు. ఊర్లో తండ్రి రెండెకరాల కౌలు రైతు. ఫీజు, ఖర్చుల వివరాలు తెలుసుకున్న ఆ అభ్యర్థి అవాక్కయ్యారు. భరించే స్థితి లేకపోవడంతో  లైబ్రరీలో చదువుకుంటున్న వారిని అడిగి కొన్ని పుస్తకాలు కొనుగోలు చేసి ఊరెళ్లిపోయారు.

రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడొస్తాయో కానీ, శిక్షణ కోసం ఉద్యోగార్థుల ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. కరోనాకు ముందుతో పోల్చితే ప్రైవేటు శిక్షణ సంస్థలు, వసతి గృహాల ఫీజులు దాదాపు రెట్టింపయ్యాయి.పేరున్న శిక్షణ సంస్థల్లో గ్రూప్‌-1 కోచింగ్‌కు రూ.60వేలు- లక్ష చెల్లించాల్సి వస్తోంది. త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న ఆశతో గ్రూప్‌-1, 2, 3, 4 శిక్షణ కోసం గ్రామాల నుంచి యువత హైదరాబాద్‌కు వస్తున్నారు. కరోనాతో ఓవైపు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అప్పులు చేసి కొలువుల ఆశతో శిక్షణ కేంద్రాల వైపు వెళ్తున్నారు. గ్రూప్‌-1 శిక్షణ, వసతి, పుస్తకాలు తదితర వాటి కోసం సగటున ఒక్కో అభ్యర్థి ఏడాదికి రూ.2.50-3 లక్షల వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది. సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నవారికి ఈ ఖర్చు రెండింతలవుతోంది. వీటిని భరించలేని కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ ఇంటికి వెళ్లిపోతున్నారు. కరోనాకు ముందు గ్రూప్‌-1, 2 ఫీజులు తక్కువగా ఉండేవి. మధ్యస్థాయి శిక్షణ సంస్థలు గ్రూప్‌-1కు రూ.35 వేలు, గ్రూప్‌-2కు రూ.15 వేల వరకు తీసుకునేవి. ప్రస్తుతం గ్రూప్‌-2కు రూ.25 వేలవరకు తీసుకుంటున్నాయి. కరోనాకు ముందు నెలకు రూ.4-5 వేలు ఉండే మెస్‌ ఛార్జీలు  రూ.8-12 వేలయ్యాయి. ఉదాహరణకు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పరీక్ష కోసం శిక్షణ సంస్థల్లో మూడేళ్ల క్రితం రూ.16వేల ఫీజు ఉండేది. ఇటీవల రూ.25-40 వేలకు పెరిగిందని ఆ పరీక్షకు శిక్షణ పొందిన అభ్యర్థి రాజు వెల్లడించారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు స్టడీరూమ్‌ పేరిట నెలకు రూ.1,500-2,000 వసూలు చేసే సంస్థలూ వెలిశాయి. మహమ్మారితో పోటీపరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను వదిలిపెట్టడం లేదు. ఇదే సమయంలో ప్రత్యక్ష తరగతుల కన్నా, ఆన్‌లైన్‌ కోచింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ మేరకు శిక్షణ సంస్థలు ప్రత్యేక యాప్‌లు రూపొందించాయి. ఫీజులూ భారీగానే ఉంటున్నాయి. గ్రూప్‌-1 కోసం కొన్ని సంస్థలు రూ.50 వేలు వసూలు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ పాఠాలతో పాటు స్టడీమెటీరియల్‌ ఇస్తామని చెబుతున్నాయి. గ్రూప్‌-2 కోసం రూ.5-8 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ ఫీజుల్లో ఎలాంటి రాయితీలివ్వడం లేదు.

ప్రత్యామ్నాయాల వైపు చూపు

* ఫీజులు, ఖర్చులు పెరగడంతో అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.గతంలో కొందరు అభ్యర్థులు గ్రూప్‌-1, 2 కోసం సమగ్రంగా రాసుకున్న నోట్స్‌ను అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లోని కొన్ని జిరాక్స్‌ కేంద్రాలు విక్రయిస్తున్నాయి.గ్రూప్‌-2 అన్ని సబ్జెక్టుల నోట్స్‌కు రూ.1,800-2,000 వరకు వసూలు చేస్తున్నాయి. 

* తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా ఉన్నప్పటికీ.. అప్‌డేటెడ్‌ వెర్షన్లతో రావడం లేదు. దీంతో అభ్యర్థులు పాతపుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. అప్‌డేటెడ్‌ సమాచారం కోసం దినపత్రికలు, యూట్యూబ్‌ను ఆశ్రయిస్తున్నారు. రిఫరెన్స్‌ పుస్తకాల కోసం రూ.4-5వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది.

* యూట్యూబ్‌లో కొందరు నిపుణులు గ్రూప్‌-1, 2 సబ్జెక్టులు, చరిత్ర, కరెంట్‌ అఫైర్స్‌ తదితర సమాచారాన్ని వీడియోల రూపంలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వాటిని కొందరు వినియోగించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని