కొన్నాళ్లు ఇల్లు... మరికొన్నాళ్లు ఆఫీసు!

కరోనా పరిణామాల నేపథ్యంలో ఐటీ పని విధానంలో భారీగా మార్పులు రానున్నాయి. మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టినా, గరిష్ఠంగా 50-60 శాతం మంది ఉద్యోగులనే కార్యాలయాలకు రప్పించాలని కంపెనీలు భావిస్తున్నాయి. మిగతావారిని హైబ్రిడ్‌ విధానంలో కొనసాగాలని

Updated : 06 Mar 2022 06:04 IST

 హైబ్రిడ్‌ విధానానికే ఐటీ కంపెనీల ప్రాధాన్యం
 టైర్‌-2 నగరాల్లో శాటిలైట్‌ కార్యాలయాలు
 నాస్కామ్‌-మైక్రోసాఫ్ట్‌ అధ్యయనంలో వెల్లడి

కరోనా పరిణామాల నేపథ్యంలో ఐటీ పని విధానంలో భారీగా మార్పులు రానున్నాయి. మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టినా, గరిష్ఠంగా 50-60 శాతం మంది ఉద్యోగులనే కార్యాలయాలకు రప్పించాలని కంపెనీలు భావిస్తున్నాయి. మిగతావారిని హైబ్రిడ్‌ విధానంలో కొనసాగాలని నగరంలోని ఐటీ సంస్థలు సందేశాలు పంపుతున్నాయి. వారంలో కొన్ని రోజులు కార్యాలయంలోనూ, మరికొన్ని రోజులు ఇంటి నుంచి పని చేసే ప్రక్రియను హైబ్రిడ్‌ విధానం అంటారు. ప్రస్తుతం 38 శాతం కంపెనీలు 50 శాతం ఉద్యోగులు, మరో 36 శాతం కంపెనీలు 75 శాతం మంది ఉద్యోగులకు రిమోట్‌ వర్క్‌ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు ‘నాస్కామ్‌-మైక్రోసాఫ్ట్‌’ అధ్యయనంలో వెల్లడైంది. ఐటీ సంస్థలు తమ కార్యాలయాలను టైర్‌-2, 3 నగరాలకు విస్తరించాలనుకుంటున్నాయి. టైర్‌-2 నగరాల్లో శాటిలైట్‌ కార్యాలయాలు ఏర్పాటు చేసి, గ్రామీణ ప్రాంతాల్లోనూ నిపుణుల్ని నియమించుకోవాలని భావిస్తున్నాయి.

పెరుగుతున్న మానసిక ఒత్తిడి

హైబ్రిడ్‌ విధానంతో ఉద్యోగులపై మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఉద్యోగాలు వదులుకున్న వారిలో 25% మంది ఇదే కారణం చెబుతున్నారు. గత ఏడాది కాలంగా ఒత్తిడి పెరిగిందని 79% మంది ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో ఐటీ సంస్థలన్నీ ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నాయి. కొవిడ్‌ సోకితే 3వారాల సెలవు ఇస్తున్నాయి. సిక్‌ లీవులను వెల్‌నెస్‌ లీవులుగా మార్చి, అపరిమిత వినియోగానికి అవకాశమిస్తున్నాయి. వీటిలో కొన్నిటిని అవసరమైన తోటి ఉద్యోగులకు వితరణ చేసేందుకూ వీలు కల్పిస్తున్నాయి.


భవిష్యత్తు పని, నియామకాలు ఇలా..

* రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌(ఆర్‌పీఏ), కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌తో పనివిధానం పూర్తిగా మారిపోతుంది. ఏఐ వినియోగం భారీగా పెరగడంతో 2025 నాటికి ఈ టెక్నాలజీ దాదాపు 2 కోట్ల ఉద్యోగాలను సృష్టించనుంది. ఆర్‌పీఏ వినియోగం వచ్చే ఏడాదికి 57 శాతానికి పెరగనుంది. అలాగే మిగతా దేశాలతో పోల్చితే భారత్‌లో క్లౌడ్‌ వినియోగం 1.4 రెట్లు ఎక్కువగా ఉంది.

* ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు, పదోన్నతులన్నీ వర్చువల్‌ విధానంలో ఉంటాయి. ఏఐ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో అభ్యర్థి రెజ్యూమెలను తనిఖీ చేస్తున్నారు. వీడియో స్ట్రీమింగ్‌ ద్వారా అభ్యర్థి భావోద్వేగాలు, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారు.

* 2021 తొలి తొమ్మిది నెలల్లో టాప్‌-5 ఐటీ కంపెనీలు 1.7 లక్షల మందిని నియమించుకున్నాయి. దేశీయ కంపెనీలు 54 శాతం మందిని, విదేశీ కంపెనీలు 49 శాతం మందిని వర్చువల్‌ విధానంలో నియమించుకున్నాయి.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని