Telangana: ఉద్యోగనామ సంవత్సరం

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల నియామకాలకు శ్రీకారం చుట్టనుంది. లక్ష కొలువుల భర్తీకి కార్యాచరణ ప్రకటించనుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో పాటు కొత్త పోస్టుల భర్తీ గురించి వెల్లడించనుంది. శాసనసభ వేదికగా

Updated : 09 Mar 2022 05:33 IST

లక్ష ఖాళీల భర్తీ.. కొత్త పోస్టులు కూడా

నేడే నియామకపు క్యాలెండర్‌
అసెంబ్లీలో వెల్లడించనున్న సీఎం
జిల్లాలవారీగా భర్తీ చేసే స్థానిక ఉద్యోగాలు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల నియామకాలకు శ్రీకారం చుట్టనుంది. లక్ష కొలువుల భర్తీకి కార్యాచరణ ప్రకటించనుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో పాటు కొత్త పోస్టుల భర్తీ గురించి వెల్లడించనుంది. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దీనిపై బుధవారం ప్రకటన చేయనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేలా క్యాలెండర్‌ను వెల్లడించనున్నట్లు సమాచారం. వివిధ శాఖల్లోని ఖాళీలతో పాటు ఇప్పటికే మంజూరు చేసిన పోస్టులు, కొత్త పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఉన్నవి, కొత్తగా అనుమతి ఇవ్వాల్సినవి తదితర అంశాలపై పూర్తి సమాచారం సిద్ధం చేసినట్లు తెలిసింది. కొత్త నియామకాలకు ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని 2022-23 బడ్జెట్‌లో రూ. 4,000 కోట్లు కేటాయించింది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో పాటు వివిధ రిక్రూట్‌మెంట్‌ బోర్డులు నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. బడ్జెట్‌ ప్రసంగంలోనే కొలవుల గురించి ప్రకటించాలని మొదట భావించినా ముఖ్యమంత్రే దీనిపై శాసనసభ వేదికగా వెల్లడించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుత ఖాళీలతో పాటు కొత్తగా అవసరమైన పోస్టుల భర్తీని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. పాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు నేపథ్యంలో కొత్త పోస్టుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్త జోనల్‌ విధానం అమలు, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, సర్దుబాటు ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది.

సర్వీస్‌ కమిషన్‌, బోర్డుల ద్వారా..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలతో పాటు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు, గురుకులాల రిక్రూట్‌మెంట్‌ బోర్డు, పంచాయతీరాజ్‌ సర్వీసెస్‌ నియామక బోర్డు, సింగరేణి రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులపై కసరత్తు చేశారు. ప్రాధాన్యక్రమంలో నియామక ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. గ్రూప్‌ 1, 2, 3, 4లతో పాటు గురుకులాల్లో బోధన సిబ్బంది, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా కానిస్టేబుళ్లు, ఇతర నియామకాలపై ప్రకటన చేయనుంది. స్పష్టమైన కాలపరిమితిని నిర్ణయిస్తూ ప్రత్యేక క్యాలెండర్‌ను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.

టీచర్ల రిక్రూట్‌మెంట్‌పైనా స్పష్టత

గురుకులాల్లోనే సుమారు 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పాఠశాల విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసే క్రమంలో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వీలుగా టెట్‌ను నిర్వహించాలనే డిమాండ్‌ చాన్నాళ్లుగా ఉంది. దీంతోపాటు ఇటీవల పాఠశాలల ఫీజులపై నియమించిన కమిటీ కూడా టెట్‌ నిర్వహించాలని సిఫారసు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. 18,000 నుంచి 20,000 ఉపాధాయ పోస్టులు అవసరమని అంచనా. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా హైతుబద్ధీకరణ పూర్తి చేస్తే ఖాళీలపై స్పష్టత వస్తుందని విద్యాశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలవారీగా పోస్టుల వివరాలు

కొత్త జోనల్‌ విధానం అమల్లోకి వచ్చాక స్థానికులకు ఉద్యోగ నియామకాల్లో ఎలా మేలు జరిగిందో స్పష్టం చేసేలా ప్రభుత్వం దృష్టిసారించింది. పోస్టుల భర్తీలో స్థానిక నిరుద్యోగ యువతకు ఎలాంటి న్యాయం జరగనుందో వివరించనుందని తెలిసింది. ఈ నేపథ్యంలో భర్తీ కానున్న స్థానిక ప్రభుత్వ ఉద్యోగాల వివరాలను జిల్లాలవారీగా వెల్లడించనున్నట్లు తెలిసింది.ఋ‘

లక్షకు చేరిన ఖాళీలు..

పదోన్నతులు, జీవో 317 ప్రకారం బదిలీల ప్రక్రియకు ముందు వివిధ శాఖల్లో సుమారు 60,000 పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉందని ఆర్థికశాఖ మంత్రిమండలికి వివరించింది. తర్వాత కొత్త జోనల్‌ విధానం అమల్లోకి రావడం, పదోన్నతులు పూర్తికావడంతో ఖాళీలపై చాలావరకు స్పష్టత వచ్చినట్లు తెలిసింది. సుమారు నెలరోజుల ముందు ప్రభుత్వం చేసిన కసరత్తులో సుమారు 70,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుందని గుర్తించినట్లు సమాచారం. పరిపాలన సంస్కరణలపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శేషాద్రి ఆధ్వర్యంలో నియమించిన కమిటీ కూడా ఉద్యోగ ఖాళీలు, కొత్త నియామకాలు, అదనపు పోస్టులు తదితర అంశాలపై వివరాలను ప్రభుత్వానికి అందించినట్లు తెలిసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సర్కారు దాదాపు లక్ష కొలువుల భర్తీపై ప్రకటనకు సిద్ధమైందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు