Telangana News: సభ ఆమోదం లేకుండానే ఖర్చులు!

రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన పారదర్శక బడ్జెట్‌ విధానాలను అనుసరించాలని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సూచించింది. శాసనసభ ఆమోదం లేకున్నా భారీ మొత్తంలో వ్యయం జరుగుతోందని

Updated : 16 Mar 2022 04:54 IST

ఆరేళ్లలో రూ.1.32 లక్షల కోట్ల వ్యయం

పద్దుల నిర్వహణపై కచ్చితత్వం లేదు

బడ్జెట్‌ ప్రతిపాదనల్లో వాస్తవికత ఏదీ!

పారదర్శక విధానం పాటించాలి

పేలవంగా అంతర్గత నియంత్రణ వ్యవస్థ

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ నివేదిక

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన పారదర్శక బడ్జెట్‌ విధానాలను అనుసరించాలని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సూచించింది. శాసనసభ ఆమోదం లేకున్నా భారీ మొత్తంలో వ్యయం జరుగుతోందని పేర్కొంది. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో వాస్తవికతలేదని, బడ్జెట్‌ అమలుపై నియంత్రణ, పర్యవేక్షణ తగినంతగాలేదని పేర్కొంది. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ ఆడిట్‌ నివేదికలను మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. అందులోని ముఖ్యాంశాలివి..
బడ్జెట్‌ కేటాయింపులు లేకుండానే వ్యయం చేయడం శాసనసభ అధికారాన్ని తగ్గించినట్లవుతుంది. 2014-15 నుంచి ఆరేళ్లలో అసెంబ్లీ ఆమోదం లేకుండా చేసిన రూ. 1,32,547 కోట్ల వ్యయాన్ని క్రమబద్ధీకరించాల్సి ఉంది. కొన్ని కేటాయింపులకు మించి ఖర్చు చేయగా, అనుబంధ కేటాయింపులకు శాసనసభ ఆమోదం లేకున్నా ఖర్చు చేశారు. కేటాయింపులు, ఖర్చుల మధ్య తేడాలను స్పష్టంగా వివరించలేదు. పేలవమైన అంతర్గత నియంత్రణ వ్యవస్థను ఇది ప్రతిబింబిస్తోంది. పద్దుల నిర్వహణ ఆందోళన రేకెత్తిస్తోంది. భారత ప్రభుత్వ అకౌంటింగ్‌ ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలి. పదేపదే మిగులు ఏర్పడుతున్న శాఖలను హెచ్చరించి వాటి సామర్థ్యానికి అనుగుణంగా బడ్జెట్‌లో మార్పులు చేయాలి. అవసరం లేకున్నా అనుబంధ కేటాయింపులు చేయడం, ఏడాది చివరలో తిరిగి కేటాయించడం వంటివి పరిహరించాలి.  రుణాలపై ఆధారపడకుండా వివిధ అభివృద్ధి పథకాల నిధుల కోసం అదనపు వనరులను సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేయాలి. కేటాయింపులు లేకుండా అధిక వ్యయం విషయంలో శాసనసభలో డిమాండ్లను ప్రవేశపెట్టేలా గవర్నర్‌ చూడాలి. పీడీ అకౌంట్ల నిర్వహణ పారదర్శకంగా లేదు. బడ్జెట్‌ను తగిన రీతిలో విశ్లేషించి అర్థవంతంగా వినియోగ పద్దులను తయారు చేయాలి.

* 2020-21లో పెట్టుబడి వ్యయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ. 16,859 కోట్ల నుంచి రూ. 15,922 కోట్లకు తగ్గింది. నిర్దిష్టమైన రాబడులు లేని సంస్థల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం 2017-18 నుంచి 2019-20 మధ్య చెల్లించింది. వాటిలో మిషన్‌ భగీరథ, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ, జలమండలి, టీఎస్‌ఐఐసీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌, ఎస్సీ, ఎస్టీ సహకార అభివృద్ధి సంస్థలు ఉన్నాయి.

* 198 పీడీ ఖాతాలకు గాను 139 ఖాతాల్లో 2021 మార్చి ఆఖరు నాటికి లావాదేవీలు లేవు. వినియోగంలో లేనివాటిని మూసివేయడంలేదు. 

కేటాయింపుల్లో సగమే ఖర్చు

* రుణమాఫీకి రూ. 6,012 కోట్లు కేటాయించినా రూ. 213 కోట్లే ఖర్చు చేశారు. రెండు పడకల గదుల ఇళ్లకు రూ. 5,000 కోట్లు ఇచ్చినా రూ. 550 కోట్లే వ్యయం అయింది.

* రాష్ట్ర విపత్తు స్పందన నిధిలో 2019-20లో రూ. 1,003 కోట్లు ఉన్నా రూ. 25.8 కోట్లే వ్యయం చేశారు.

* పురపాలక, సామాజిక సంక్షేమం, వ్యవసాయం, నీటి పారుదల శాఖల్లో రూ. 1000 కోట్లు అంతకంటే ఎక్కువ మిగులు ఏర్పడుతోంది. పురపాలకశాఖ, గృహనిర్మాణశాఖ, నీటిపారుదలశాఖ, పరిశ్రమల శాఖలో మూడేళ్లలో సగంకంటే తక్కువ నిధులే ఖర్చయ్యాయి.

* ఎస్సీ, ఎస్టీలకు జనాభా కంటే ఎక్కువ నిధులను కేటాయించారు. ఎస్సీలకు కేటాయించిన నిధుల్లో 21 శాతం, ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో 26 శాతం వ్యయం కాలేదు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి నిధులు 2016-17 నుంచి వినియోగం తక్కువగా ఉంది.

* సాధారణ డిపాజిట్లను చిన్న పద్దు ఖాతాకు బదిలీ చేయడం ఆందోళనకరమైన పరిణామం. రూ. 7,836 కోట్లను ఇలా బదిలీ చేశారు.

* పీడీ ఖాతాల నిధులను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మళ్లించకూడదు. ఏడు ప్రభుత్వ కంపెనీలు/కార్పొరేషన్లలోని పీడీ ఖాతాల్లో జమ చేసిన రూ. 1,075 కోట్లను ప్రభుత్వ పద్దులకు వెలుపల ఉన్న బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఇందులో రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌, మైనార్టీ కార్పొరేషన్‌, క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ ఉన్నాయి,

* ప్రభుత్వ పద్దులు, శాసనసభ పర్యవేక్షణకు వెలుపల ఉండే బ్యాంకు ఖాతాలకు భారీగా నిధులను బదిలీ చేశారు.

* ప్రభుత్వ కంపెనీలు, స్వయంపాలక సంస్థల పద్దుల నిర్వహణలో జాప్యం జవాబుదారీతనాన్ని పలుచన చేస్తోంది.

* ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం వచ్చి ఏడేళ్లయినా క్యాపిటల్‌ పద్దు కింద రూ. 1,51,349 కోట్లు, రుణాలు, అడ్వాన్సుల కింద రూ. 28,099 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సుల కింద రూ. 4,474 కోట్లు, సస్పెన్స్‌ ఖాతా కింద రూ. 238 కోట్లు, అనామతు పద్దు కింద రూ. 310 కోట్ల పంపకం జరగాల్సి ఉంది.

తప్పనిసరి వ్యయాలు పైపైకి

రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరి ఖర్చులు పెరుగుతున్నాయి. వేతనాలు, పింఛన్లపై వ్యయం, వడ్డీల చెల్లింపులు 2015-16 నుంచి పెరుగుతున్నాయి. 2020-21లో రెవెన్యూ వ్యయంలో దాదాపు 54 శాతం తప్పనిసరి ఖర్చులు ఉన్నాయి. రెవెన్యూ రాబడిలో జీతాలు, వేతనాలు 24 శాతం, వడ్డీల చెల్లింపు, పింఛన్లపై వ్యయం 13 శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని