Telangana: స్టడీ సర్కిళ్లలో డిజిటల్‌ శిక్షణ

రాష్ట్రంలో 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద అభ్యర్థులను సన్నద్ధం చేసేలా ఉచిత శిక్షణ అందించేందుకు స్టడీసర్కిళ్లు సిద్ధమవుతున్నాయి. వీలైనంత ఎక్కువమందికి శిక్షణ అందించేందుకు 

Updated : 20 Mar 2022 05:27 IST

ఆన్‌లైన్‌ పాఠాలు, వీడియోలు, మాక్‌ టెస్టులు
ఏప్రిల్‌ నుంచి తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద అభ్యర్థులను సన్నద్ధం చేసేలా ఉచిత శిక్షణ అందించేందుకు స్టడీసర్కిళ్లు సిద్ధమవుతున్నాయి. వీలైనంత ఎక్కువమందికి శిక్షణ అందించేందుకు  ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖలు ఏర్పాట్లు చేశాయి. ఉద్యోగ ప్రకటనల మేరకు స్వల్పకాలిక శిక్షణ కోర్సులు ఏప్రిల్‌ నుంచి ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యాయి. ఒక్కో స్టడీసర్కిల్‌లో 100 మందికే అవకాశమున్నప్పటికీ, డిజిటల్‌ వనరుల ద్వారా వీలైనంత ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వనున్నాయి. యూట్యూబ్‌ ఛానెళ్లు, వీడియో పాఠాలు, ఆన్‌లైన్‌ శిక్షణతో మరింతమందికి పాఠాలు చేరువ చేయనున్నాయి. శిక్షణ సంస్థలకు వెళ్లలేని పేద అభ్యర్థులకు ఈ అవకాశం ఉపయోగకరమని సంక్షేమాధికారులు తెలిపారు.

‘‘రాష్ట్రంలోని 11 స్టడీ సర్కిళ్ల పరిధిలో 1100 మందికి, ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో 150 మందికి శిక్షణ ఏప్రిల్‌తో ముగియనుంది. పోలీసు విభాగంలో 18 వేల పోస్టులు ఉండటంతో 3 వేల మందికి ప్రత్యేక శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు పోలీసుశాఖ సహకారం తీసుకుంటున్నాం. అభ్యర్థులకు వసతితో పాటు కొలువు దక్కేలా కఠిన శిక్షణ అందిస్తాం. జిల్లా కేంద్రాల్లో కనీసం 100 మందికి డేస్కాలర్‌ విధానంలో జూనియర్‌, డిగ్రీ కళాశాలల్ని గుర్తించి అక్కడ రోజూ శిక్షణ అందిస్తాం. మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తాం’’ అని ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఆర్‌.వేణుగోపాలరావు తెలిపారు.

స్టయిపెండ్‌ ఇచ్చి ఉచిత శిక్షణ

ఐటీడీఏల పరిధిలో మూడు, మన్ననూరు(మహబూబ్‌నగర్‌), హైదరాబాద్‌లలో ఒక్కోటి చొప్పున ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాలున్నాయి. 10 వేల మందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ పూర్తయింది. ఉద్యోగ నోటిఫికేషన్లు దృష్టిలో పెట్టుకుని గతంలోనే ప్రాథమిక పరీక్ష నిర్వహించి గ్రూప్స్‌, డీఎస్సీ, పోలీసు ఉద్యోగాల శిక్షణకు 615 మందిని ఆ శాఖ ఎంపిక చేసింది. పోలీసు కొలువుల కోసం 300 మందికి స్పోర్ట్స్‌ స్కూల్‌లో శిక్షణ నడుస్తోంది. నల్గొండ, నిజామాబాద్‌ యువజన శిక్షణ కేంద్రాల్లో తరగతులతో పాటు వసతి గృహాలు, పాఠశాలల్లో నోటిఫికేషన్లకు అనుగుణంగా తరగతులు నిర్వహించనుంది. ‘‘డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు శిక్షణ ఇస్తాం. స్వల్పకాలిక కోర్సులుంటాయి. వసతికి అవకాశం లేని ప్రాంతాల్లో అభ్యర్థులకు స్టయిపెండ్‌ ఇస్తాం’’ అని ఎస్టీ స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ వి.సముజ్వల తెలిపారు.

లక్ష మందికి అవకాశం కల్పించేలా...

దాదాపు లక్ష మందికి శిక్షణను చేరువ చేయాలని బీసీ స్టడీసర్కిల్‌ నిర్ణయించింది. టెలిగ్రాం, యూట్యూబ్‌ ఛానెళ్లతో వీడియో పాఠాలు అందుబాటులో ఉంచుతుంది. రోజూ మాక్‌టెస్టులు నిర్వహించనుంది. 119 నియోజకవర్గాల పరిధిలో అధ్యయన కేంద్రాలు తెరిచి 50 వేల మంది బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ప్రస్తుతం 12 కేంద్రాల్లో మూణ్నెల్ల ఫౌండేషన్‌ కోర్సు కొనసాగుతోంది. శిక్షణార్థులకు స్టయిపెండ్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ‘‘మంత్రి కమలాకర్‌, కార్యదర్శి వెంకటేశంల సహకారంతో బీసీ స్టడీసర్కిల్‌ ద్వారా శిక్షణ పొందే విద్యార్థుల కోసం ప్రత్యేక టెలిగ్రాం, యూట్యూబ్‌ ఛానెళ్లు సిద్ధం చేశాం. టెలిగ్రాం ఛానెల్‌లో రోజూ 100 ప్రశ్నలు ఇస్తున్నాం. ఈఛానెల్‌ 2 వేల మందికి అందుబాటులో ఉంది. 10 వేల మందికి విస్తరిస్తాం’’ అని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ అలోక్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని