Telangana News: భర్త మరణం తరువాత మాతృత్వం!

తల్లి కావాలని తపించిన ఓ మహిళ.. భర్త మరణించిన 11 నెలలకు ఆధునిక వైద్య విధానంతో మాతృత్వాన్ని పొందింది. 2013లో పెళ్లయిన మంచిర్యాలకు చెందిన ఓ జంటకు ఏడేళ్లయినా పిల్లలు పుట్టలేదు. వీరు వరంగల్‌లోని ఒయాసిస్‌ సంతాన

Updated : 08 Apr 2022 07:11 IST

భద్రపరచిన భాగస్వామి వీర్యంతో ఐవీఎఫ్‌ పద్ధతిలో సాఫల్యం

మగబిడ్డకు జన్మనిచ్చిన మంచిర్యాల మహిళ

కాశీబుగ్గ(వరంగల్‌), న్యూస్‌టుడే: తల్లి కావాలని తపించిన ఓ మహిళ.. భర్త మరణించిన 11 నెలలకు ఆధునిక వైద్య విధానంతో మాతృత్వాన్ని పొందింది. 2013లో పెళ్లయిన మంచిర్యాలకు చెందిన ఓ జంటకు ఏడేళ్లయినా పిల్లలు పుట్టలేదు. వీరు వరంగల్‌లోని ఒయాసిస్‌ సంతాన సాఫల్య కేంద్రంలో 2020 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఆ ఏడాది మార్చిలో అక్కడి వైద్యులు పరీక్షల నిమిత్తం భార్యాభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి భద్రపరిచారు. కరోనాతో 2021లో భర్త చనిపోయారు. పిల్లలు కావాలన్న కోరిక తీరకుండానే జీవిత భాగస్వామి మరణించడంతో 32 ఏళ్ల ఆ మహిళ కుంగిపోయారు. మరోపెళ్లి చేసుకోకుండా అత్తమామలతో ఉంటున్నారు. ఆసుపత్రిలో భద్రపరచిన భర్త వీర్యం ద్వారా బిడ్డను కని మాతృత్వపు మధురిమలను చవిచూడాలని భావించారు. అదే విషయాన్ని అత్తమామలకు వివరించారు. వారి అంగీకారంతో వైద్యనిపుణులను సంప్రదించారు. న్యాయపర ఇబ్బందులు ఎదురవకుండా ఆమె హైకోర్టుకు వెళ్లారు. కోర్టు సైతం యువతి ఇష్టానికి వదిలేయడంతో దంపతుల నుంచి సేకరించి భద్రపరచిన వీర్యం, అండాల ద్వారా ఆగస్టు 2021లో ఆసుపత్రి నిపుణులు ఐవీఎఫ్‌ చికిత్స ప్రారంభించారు. అది సఫలం కావడంతో ఈ ఏడాది మార్చి 22న పండంటి మగబిడ్డకు మహిళ జన్మనిచ్చారు. ఆసుపత్రి క్లినికల్‌ హెడ్‌ డాక్టర్‌ జలగం కావ్యారావు మాట్లాడుతూ 16 రోజుల బాబును చూపిస్తూ తల్లి కావాలన్న ఆ స్త్రీ పడిన తపన, ఆమెకు అండగా నిలిచిన అత్తమామల గొప్పతనాన్నివివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని