Telangana News: గోదాముల గోస

పంటలు మార్కెట్లకు వస్తుండటంతో గోదాముల కోసం హైరానా మొదలైంది. మరో నెలరోజుల్లో రైతులు 78 లక్షల టన్నుల ధాన్యం, 20 లక్షల టన్నుల మొక్కజొన్నలు, 2 నుంచి 4 లక్షల టన్నుల ఇతర పంటలను అమ్మకానికి తెస్తారని మార్కెటింగ్‌శాఖ అంచనా. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 20.18 లక్షల టన్నుల నిల్వలకే

Updated : 09 Apr 2022 06:36 IST

మార్కెట్లకు రానున్న దాదాపు కోటి టన్నుల ధాన్యం, మక్కలు

ప్రస్తుతం 20 లక్షల టన్నుల నిల్వకే అవకాశం

ఈనాడు - హైదరాబాద్‌

పంటలు మార్కెట్లకు వస్తుండటంతో గోదాముల కోసం హైరానా మొదలైంది. మరో నెలరోజుల్లో రైతులు 78 లక్షల టన్నుల ధాన్యం, 20 లక్షల టన్నుల మొక్కజొన్నలు, 2 నుంచి 4 లక్షల టన్నుల ఇతర పంటలను అమ్మకానికి తెస్తారని మార్కెటింగ్‌శాఖ అంచనా. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 20.18 లక్షల టన్నుల నిల్వలకే గోదాముల్లో ఖాళీ ఉంది. మిగిలిన పంటలను ఎక్కడ నిల్వ చేయాలనేదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది గిడ్డంగుల్లో ఖాళీల్లేక ఫంక్షన్‌హాళ్లలో పంటలు నిల్వ చేసి పరదాలు కప్పి ఉంచారు. అప్పుడు కరోనా కారణంగా పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు లేవు. పంటల నిల్వకు ఉపయోగించుకున్నారు. కానీ ఈ నెల, వచ్చే నెల వేలాది పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు ఉన్నాయి. ఫంక్షన్‌హాళ్లను వాటి యజమానులు పంటల నిల్వకు ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

నిల్వ సామర్థ్యం పెరిగినా...
రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో మొత్తం 39 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములే ఉండేవి. ప్రస్తుతం 72.64 లక్షల టన్నులకు పెరిగినా ఇంకా చోటు చాలడం లేదు. వీటిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు ఉన్న సొంత గోదాముల నిల్వ సామర్థ్యం 6.93 లక్షల టన్నులే. అది తీసుకున్న ఇతర సంస్థలవి కూడా కలిపితే మొత్తం సామర్థ్యం 29.50 లక్షల టన్నులు. ఇక మిగతావి ప్రైవేటు, ఇతర సంస్థలకు చెందినవి. ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పర్యవేక్షణలో ఉన్నవాటిలో ఖాళీ లేదు. మూడు లక్షల టన్నుల సామర్థ్యంతో కొత్తవాటి నిర్మాణం పూర్తవగా వాటిని ఈ నెలలోనే అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ కృషిచేస్తోంది. ఇవి కాకుండా ప్రైవేటు, ఇతర సంస్థలకు చెందిన వాటిల్లో మరో 17 లక్షల టన్నుల నిల్వకు మాత్రమే చోటు ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా మార్కెట్లకు వచ్చే వరిధాన్యం, దాన్ని మరపట్టిస్తే వచ్చే బియ్యం, మొక్కజొన్నలు, సెనగలు, వేరుసెనగలు ఎక్కడ నిల్వ చేయాలనేది సమస్యగా మారింది.

పెరిగిన సాగు విస్తీర్ణం.. దిగుబడులు
సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడులు పెరగడం వల్ల గిడ్డంగుల కొరత తీవ్రంగా ఉంది. గతేడాది కొన్న బియ్యంలో 11.31 లక్షల టన్నులను ‘భారత ఆహార సంస్థ’(ఎఫ్‌సీఐ) ఇంకా గోదాముల్లోనే ఉంచింది.వీటిని ఎప్పుడు ఇతర రాష్ట్రాలకు తరలిస్తారనేది తెలియడం లేదు. ఖాళీ అయితే ఆ మేరకు ఉపయోగించుకోడానికి వీలుంటుంది. మరోవైపు రేషన్‌కార్డులపై పంపిణీకి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మరో 17.32 లక్షల టన్నుల బియ్యంను గోదాముల్లో నిల్వ చేసింది. ఇవి రోజుకు కొంత చొప్పున గ్రామాలకు వెళుతున్నాయి. ఎంత ప్రయత్నించినా కోటి టన్నుల పంటల నిల్వకు చోటు దక్కడం కష్టమని అధికారులే చెబుతున్నారు. దీనికితోడు జూన్‌ నుంచి ప్రారంభమయ్యే పంటల సీజన్‌ కోసం అత్యవసర వినియోగం కోటా కింద 5 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయడానికి రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య గిడ్డంగులను వెదుకుతోంది. ప్రైవేటు వ్యాపారులకు మరో 5 లక్షల టన్నుల ఎరువుల నిల్వకు గోదాములు కావాలి. రాష్ట్రంలో కనీసం కోటి టన్నుల నిల్వ సామర్థ్యమున్నవి అవసరమని, అవి లేకనే ఏటా నిల్వలకు సమస్యలు ఎదురవుతున్నాయని సీనియర్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. గతేడాది ఫంక్షన్‌హాళ్లలో నిల్వ చేసిన మొక్కజొన్నలు వర్షాలకు తడిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని