CM KCR: నేడు దిల్లీలో కేసీఆర్‌ దీక్ష

తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ ఉద్యమిస్తున్న తెరాస మరింత ఒత్తిడి పెంచేందుకు దేశ రాజధానిలో దీక్షకు సిద్ధమైంది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెరాస దిల్లీలో తొలిసారి సమరశంఖం పూరించనుంది. తెలంగాణభవన్‌లో సోమవారం ‘రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో దీన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు...

Updated : 11 Apr 2022 05:35 IST

వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్‌
నిరసనలో పాల్గొననున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు
భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ మద్దతు  
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తర్వాత దేశ రాజధానిలో తొలిసారి తెరాస సమరశంఖం

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ ఉద్యమిస్తున్న తెరాస మరింత ఒత్తిడి పెంచేందుకు దేశ రాజధానిలో దీక్షకు సిద్ధమైంది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెరాస దిల్లీలో తొలిసారి సమరశంఖం పూరించనుంది. తెలంగాణభవన్‌లో సోమవారం ‘రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో దీన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతుబంధు సమితి, మండల పరిషత్‌, పురపాలక సంఘాల అధ్యక్షులు, అన్ని కార్పొరేషన్ల ఛైర్మన్లు, తెరాస రాష్ట్రకార్యవర్గ ప్రతినిధులు పాల్గొంటారు. దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం రాత్రికి దిల్లీ చేరుకున్నారు. దీక్ష రోజంతా కొనసాగించాలని తొలుత భావించారు.

72 ఏళ్లలో ఏప్రిల్‌ తొలి పదిహేను రోజుల్లో ఎన్నడూ లేనంత వేడి దిల్లీలో శనివారం నమోదైందని భారతీయ వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించడంతో పాటు వడగాలుల తీవ్రత ఉంటుందని హెచ్చరించడంతో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగించాలని నిర్ణయించారు. దీక్ష ఏర్పాట్లపై దిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్‌ తన నివాసంలో ఆదివారం రాత్రి మంత్రులు, ముఖ్యనేతలతో సమీక్షించారు.

హిందీ, ఇంగ్లిషు భాషల్లో ఫ్లెక్సీలు

సమస్య తీవ్రతను దేశం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్న తెరాస నేతలు దీక్షకు భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ సహా పలువురు రైతు నేతలను ఆహ్వానించారు. టికాయిత్‌ ఇప్పటికే మద్దతు ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ధాన్యం దీక్షను ప్రతిబింబించేలా వేదిక ఎదుట వడ్ల కుప్పను పోయనున్నారు. దానికి ఇరువైపులా సాగు కష్టాలను తెలిపేలా నాగళ్లతో రైతులు నిల్చోనున్నారు. మరోవైపు దీక్షలో కూర్చొనే వారు ఎండ బారిన పడకుండా టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌ పరిసరాలను తెరాస జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో గులాబీమయం చేశారు. దిల్లీ వాసులకు అర్థమయ్యేలా హిందీ, ఇంగ్లిషు భాషల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

వేదికపై కొందరికే అవకాశం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలుత భవన్‌ ఆవరణలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం వేదికపైకి చేరుకుంటారు. వేదికపై ముఖ్యమంత్రితో పాటు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, వ్యవసాయ, పౌరసరఫరాల మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు కిసాన్‌నేత రాకేశ్‌ టికాయిత్‌ తదితరులు కొద్దిమందే ఉంటారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆది నుంచి తెలంగాణకు చేస్తున్న సహాయ నిరాకరణ, వడ్ల కొనుగోలు వ్యవహారంలో కేంద్రం రాజకీయాలు చేస్తోందంటూ సీఎం విమర్శలు గుప్పించనున్నారు.


చిన్న చూపు చూస్తేకేంద్రానికే నష్టం
మంత్రి నిరంజన్‌రెడ్డి

తెరాస నిరసన దీక్షను చిన్నచూపు చూస్తే కేంద్ర ప్రభుత్వానికే నష్టమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతును చిన్న చూపు చూసిన ప్రభుత్వాలు బాగుపడలేదన్నారు. దేశవ్యాప్తంగా పంటల సేకరణకు ఒకే విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. దీక్ష ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతులు వడ్లు పండిస్తారు కనుక వాటినే కొనాలని..బియ్యంతో వారికి సంబంధం లేదన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ పంట కొనుగోలులో కేంద్రం విఫలమైందని విమర్శించారు. కేంద్ర నిర్ణయంతో దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని