BJP: యాత్రలో ఉద్రిక్తత

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం వేములలో అంబేడ్కర్‌ కాంస్య విగ్రహానికి సంజయ్‌

Updated : 19 Apr 2022 05:34 IST

సంజయ్‌ పాదయాత్రలో నిరసనకు తెరాస కార్యకర్తల యత్నం

గ్యాస్‌, పెట్రో ధరలు తగ్గించాలంటూ నినాదాలు

ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

యాత్ర చేసి తీరుతాం: సంజయ్‌

ఈనాడు డిజిటల్‌-మహబూబ్‌నగర్‌, న్యూస్‌టుడే-ఇటిక్యాల, ఉండవల్లి, మానవపాడు: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం వేములలో అంబేడ్కర్‌ కాంస్య విగ్రహానికి సంజయ్‌ పూలమాల వేసి, భాజపా జెండాను ఆవిష్కరించారు. ‘జనం గోస- భాజపా భరోసా’ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం పాదయాత్రను తిరిగి కొనసాగిస్తుండగా.. వేముల ఉన్నత పాఠశాల వద్ద కొందరు తెరాస కార్యకర్తలు యాత్రకు నిరసన తెలిపే యత్నం చేశారు. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలను తగ్గించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తెరాస కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి అక్కడి నుంచి పంపించివేశారు. బట్లదిన్నె గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద తెరాస కార్యకర్తలు మరోసారి నిరసన తెలిపేందుకు యత్నించారు. ఈ సందర్భంగా భాజపా, తెరాస కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడికి యత్నించారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తమ పార్టీ శ్రేణులకు సర్దిచెప్పి వెనక్కి పంపించారు. అప్పటికే కొందరు దాడులు చేసుకోవడంతో అయిజ మండలానికి చెందిన తెరాస కార్యకర్త అంజి తలకు గాయం కాగా, ఇరు పార్టీలకు చెందిన కొందరు నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. భాజపాకు చెందిన అయిదు, తెరాసకు చెందిన ఒక వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. వేముల గ్రామంలో భాజపా ఫ్లెక్సీలను తెరాస కార్యకర్తలు తొలగించి దహనం చేశారు. గ్రామంలో బైఠాయించి పెట్రోల్‌, డీజిల్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఒకవైపు భాజపా నేతలు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయగా.. మరోవైపు డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని తెరాస నేతలు నినదించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌, అదనపు ఎస్పీ రాములునాయక్‌, డీఎస్పీ రంగస్వామి పాదయాత్ర శిబిరాన్ని సందర్శించారు. పాదయాత్రకు బందోబస్తు పెంచారు.

స్పందన ఓర్వలేకనే దాడులు: డీకే అరుణ

యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటం ఓర్వలేకనే తెరాస నేతలు దాడులు చేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. రౌడీషీటర్లు, ఇసుక, మైనింగ్‌ మాఫియాను రెచ్చగొట్టి యాత్రను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. బట్లదిన్నె శివారులోని పాదయాత్ర శిబిరం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. యాత్రను అడ్డుకునేందుకు యత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్‌ చేశారు.

ప్రజల్లోకి వస్తే దాడులు చేస్తారా: ఈటల

బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై దాడిని ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు అవాంఛనీయమన్నారు. సీఎం ఎలాగూ ఫాంహౌస్‌ దాటి బయటికి రారని, ప్రతిపక్ష నాయకులు సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల్లోకి వస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

సమస్యలు విన్నవిస్తే దౌర్జన్యం చేస్తారా? - అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

ప్రజలు సమస్యలను విన్నవిస్తే దౌర్జన్యంగా కొట్టడం అమానుషమని, ప్రశాంతంగా ఉన్న నడిగడ్డలో హింసను ప్రేరేపించేలా దాడి చేయడం ఏమిటని అలంపూర్‌ ఎమ్మెల్యే డా.అబ్రహాం ప్రశ్నించారు. సోమవారం ఆయన మాట్లాడారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమై అయిదు రోజులైందని.. నాలుగు రోజుల్లో చాలామంది ప్రజలు తమ కష్టాలను చెప్పుకొనేందుకు వస్తే వారిని నెట్టేసి బెదిరించారన్నారు. వేముల గ్రామంలో చాలామంది ప్రజలు, తెరాస కార్యకర్తలు తమ సమస్యలు వివరించడానికి.. నిత్యావసరాలు, వంటగ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలని బండి సంజయ్‌ దృష్టికి తీసుకొస్తే అమానుషంగా దాడి చేశారని ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర అంటే ప్రజలపై యుద్ధం చేయడమా అని ప్రశ్నించారు. వారి వాహనాలను వారే ధ్వంసం చేసుకుని తెరాస నాయకులపై నెట్టేశారన్నారు. కులమతాల మధ్య చిచ్చు రేపుతూ రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించడం సమంజసం కాదని పేర్కొన్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన గూండాలతో తిరుగుతున్న బండి సంజయ్‌ది ప్రజావంచన యాత్ర అని విమర్శించారు. అలంపూర్‌లో అభివృద్ధిని చూసి మాట్లాడాలని.. నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.


దాడులకు భయపడం: సంజయ్‌

‘ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం పోరాడటమే తప్పా? మాపై రాళ్ల దాడులు చేస్తారా’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. తెరాస నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని, బరాబర్‌ ప్రజా సంగ్రామ యాత్ర చేసి తీరుతామని స్పష్టంచేశారు. ఇటిక్యాల మండలం ఉదండాపూర్‌, వేముల గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ పాదయాత్ర చేస్తానంటే తాము వద్దనడం లేదని.. ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు తన ప్రభుత్వం చేసిన ఘనకార్యాలుంటే చెప్పుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో ప్రజలకు తెలియజేయడానికే యాత్ర చేపట్టామన్నారు. అలంపూర్‌ నియోజకవర్గంలో కల్తీ పత్తి, మిర్చి విత్తనాలు, కల్తీ కల్లు, కల్తీ నాయకులు తప్ప ప్రజలకు ఏమీ దొరకదన్నారు. ఈ ప్రాంత పత్తి రైతులు నష్టపోతే శాస్త్రవేత్తలు పంటలను పరిశీలించి.. నకిలీ విత్తనాలే కారణమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారన్నారు. ‘రైతులే తప్పు చేశారు. అధికంగా రసాయన మందులు వాడటం వల్ల పంట నష్టం జరిగిందని నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు’ అని సంజయ్‌ ఆరోపించారు. నకిలీ విత్తనాలను తెరాస నేతలే అమ్ముతున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని