TS Exams 2022: వారంలో పోలీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామని.. కేంద్రంలో ఉన్న 15 లక్షల పైగా ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌

Published : 19 Apr 2022 05:56 IST

మంత్రి హరీశ్‌రావు వెల్లడి

పటాన్‌చెరు అర్బన్‌-న్యూస్‌టుడే, ఈనాడు-సంగారెడ్డి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామని.. కేంద్రంలో ఉన్న 15 లక్షల పైగా ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. పటాన్‌చెరు జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సౌజన్యంతో ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. పోలీస్‌, అగ్నిమాపక, అటవీ శాఖల్లో 20 వేల ఉద్యోగాలున్నాయని, వీటికి సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్‌ వస్తుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 91 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు కేంద్రం ఉద్యోగాలను భర్తీ చేయకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. ధరలు పెంచడంతో పాటు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నందుకు పాదయాత్ర చేస్తున్నారా అని సంజయ్‌ను ప్రశ్నించారు. ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీ, బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిలను ఖాళీల భర్తీపై ప్రశ్నించాలన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో రూ.50 లక్షలు వెచ్చించి 90 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి, స్టడీ మెటీరియల్‌ అందించనున్నారని తెలిపారు. అనంతరం పటాన్‌చెరు ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య శిబిరాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. పటాన్‌చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు. వైద్యసేవల విషయంలో కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్‌ ర్యాంకింగ్‌లలో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యధిక ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, టీఎస్‌ఎంఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని