KTR: ఉపగ్రహాల తయారీ ఇక్కడే

ఇప్పటికే ఐటీ, ఔషధాలు, వైమానిక ఉత్పత్తుల్లో తనదైన ముద్ర చాటుకున్న తెలంగాణ ఇకపై ఉపగ్రహాలు, రాకెట్లు, ఇతర అంతరిక్ష ఉత్పత్తుల తయారీలోనూ ముందంజ వేయనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి

Updated : 19 Apr 2022 05:37 IST

అంతరిక్ష సాంకేతిక విధానం ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్

మెటావర్స్‌ విధానంలో కార్యక్రమం

పాల్గొన్న నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌, ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇప్పటికే ఐటీ, ఔషధాలు, వైమానిక ఉత్పత్తుల్లో తనదైన ముద్ర చాటుకున్న తెలంగాణ ఇకపై ఉపగ్రహాలు, రాకెట్లు, ఇతర అంతరిక్ష ఉత్పత్తుల తయారీలోనూ ముందంజ వేయనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఇప్పటికే 14 రంగాల్లో తెలంగాణ పురోగమించిందని, తమ తదుపరి ప్రాధాన్యరంగం అంతరిక్ష సాంకేతికత అని పేర్కొన్నారు. 2026 నాటికి స్పేస్‌టెక్‌లో భారత్‌ వాటా 558 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని, అందులో మెజారిటీ వాటాను తెలంగాణ దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం మెటావర్స్‌ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌, ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ పాల్గొన్నారు. ఇంకా ఇన్‌స్పేస్‌ ఛైర్మన్‌ పవన్‌ గోయెంకా, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ..‘‘అంతరిక్ష సాంకేతికతలో అగ్రస్థానం పొందేందుకు తెలంగాణకు అన్ని అనుకూలతలున్నాయి. ఈ రంగంపై సమగ్ర అధ్యయనం, అవసరాలు, సాంకేతికత వంటి అంశాలను పరిశీలించి అత్యుత్తమ విధానం రూపొందించాం. ప్రపంచస్థాయి పారిశ్రామిక సంస్థలను ఆకర్షించడం ద్వారా దేశంలోని అంతరిక్ష సాంకేతికతల పురోగతితో పాటు చక్కటి పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని పేర్కొన్నారు. అమితాబ్‌ కాంత్‌ మాట్లాడుతూ.. వైమానిక సాంకేతికతలో తెలంగాణ ముందడుగు వేయడం సంతోషకరమన్నారు. సోమనాథ్‌ మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశ్రమ నుంచి ఆవిష్కరణలు రావాలని, వివిధ సమస్యలకు సాంకేతికలతో పరిష్కారాలు చూపాలన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని పవన్‌ గోయెంకా తెలిపారు. కేటీఆర్‌ బ్లాక్‌ఛైన్‌ ఆధారిత నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌(ఎన్‌ఎఫ్‌టీ)లను విడుదల చేశారు.

ఏమిటీ మెటావర్స్‌

మెటావర్స్‌ విధానంలో మనుషులు కాకుండా వారిని పోలిన రూపాలు తెరపైకి వస్తాయి. కార్యక్రమంలో పాల్గొనేవారి 360 డిగ్రీల ఫొటోలు, వీడియోల ఆధారంగా వారి సారూప్యతతో ఆ రూపాలను కంప్యూటర్‌ తెరపై ప్రదర్శిస్తారు. వారే ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభూతి కలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని