Telangana: ఇల్లు ఇరకాటం

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల వారికి కేంద్ర ప్రభుత్వ పథకం నుంచి కొత్త ఇళ్ల మంజూరు నిలిచిపోగా గతంలో మంజూరైన వాటిలో కేంద్ర వాటా నిధుల విషయమూ ప్రశ్నార్థకంగా మారింది. మార్గదర్శకాలు

Updated : 24 Apr 2022 05:43 IST

‘గ్రామీణ్‌’ ఇళ్ల నిధులకు గ్రహణం!

పెండింగ్‌లో రెండో విడత కేంద్ర వాటా

మొదటి విడత రూ.190.79 కోట్లు వెనక్కివ్వాలని లేఖ!

లబ్ధిదారుల నిబంధనలు మార్చాలని కోరుతున్న రాష్ట్ర సర్కార్‌

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల వారికి కేంద్ర ప్రభుత్వ పథకం నుంచి కొత్త ఇళ్ల మంజూరు నిలిచిపోగా గతంలో మంజూరైన వాటిలో కేంద్ర వాటా నిధుల విషయమూ ప్రశ్నార్థకంగా మారింది. మార్గదర్శకాలు పాటించడం లేదంటూ రెండో విడత నిధులు నిలిపివేసిన కేంద్రం తాము మొదటి విడతగా ఇచ్చిన నిధుల్ని వెనక్కివ్వాలంటూ లేఖలు రాస్తోంది. 2011 నాటి వివరాల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉండాలనడం సరికాదని, ఈ విధానాన్ని మార్చాలని రాష్ట్రం కోరుతోంది. తాము ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను పరిశీలించి అర్హులా? కాదా? చూడాలని కేంద్రానికి రాష్ట్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం రెండు పడక గదుల ఇళ్లను పూర్తి సబ్సిడీతో నిర్మిస్తోంది. మరోవైపు కేంద్రప్రభుత్వం పట్టణ ప్రాంత, గ్రామీణ పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన అర్బన్‌, గ్రామీణ్‌ పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్ర సర్కార్‌ కేంద్ర పథకాల్ని కలిపి రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తోంది. కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇళ్ల లక్ష్యంలో భాగంగా 2016-17లో తెలంగాణకు పీఎంఏవై-గ్రామీణ్‌ పథకం కింద 50,959 ఇళ్లు మంజూరు చేసింది.

20-30 శాతం మందే సరిపోలారు
సాంఘిక, ఆర్థిక కులగణన-2011 (సోషియో ఎకనమిక్‌ క్యాస్ట్‌ సెన్సస్‌-సెక్‌) ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 14 వేల రెండు పడకగదుల ఇళ్లను పంపిణీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే, ఇతర పద్ధతుల్లో లబ్ధిదారులను గుర్తిస్తోంది. కేంద్రం మాత్రం.. లబ్ధిదారుల జాబితాను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని, 2011 సెక్‌ డేటాలో ఉన్న పేదలనే ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇళ్లు పంపిణీ చేసిన వారి వివరాలను.. కేంద్రప్రభుత్వం 2011 సెక్‌ డేటాతో పోల్చి చూస్తే 20-30 శాతం మంది లబ్ధిదారులే సరిపోలినట్లు రాష్ట్ర గృహనిర్మాణశాఖ గుర్తించింది. ఎప్పుడో పదేళ్ల కిందటి డేటా ఆధారంగా కాకుండా తాజా పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రం ఇటీవల జరిగిన సమావేశంలో స్పష్టం చేసింది. ‘మేం ఎంపిక చేసిన జాబితాను విచారించండి. మీ నిబంధనల ప్రకారం లేకుంటే తీసేయండి’ అని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. తొలి విడత నిధులకు సంబంధించి.. వినియోగ ధ్రువపత్రం (యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌) ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లేదని.. 2011 సెక్‌ డేటా ప్రకారం అయితే 70-80 శాతం ఇళ్లకు నిధులు వచ్చే పరిస్థితి లేదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ వర్గాలు చెబుతున్నాయి. 2017 నుంచి ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లను కేంద్రం మంజూరు చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని