Yadadri: యాదాద్రిలో శివాలయ ఉద్ఘాటనకు వేళాయె

యాదాద్రి అభివృద్ధిలో భాగంగా కొండపై అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ ఉద్ఘాటనకు స్మార్త ఆగమ శాస్త్రరీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహణలో

Updated : 25 Apr 2022 06:00 IST

నేడు మహాక్రతువు
హాజరు కానున్న సీఎం కేసీఆర్‌

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి అభివృద్ధిలో భాగంగా కొండపై అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ ఉద్ఘాటనకు స్మార్త ఆగమ శాస్త్రరీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహణలో ఆచారపర్వాలు అయిదు రోజులుగా కొనసాగుతున్నాయి. సోమవారం మహాక్రతువు నిర్వహణకు అంతా సిద్ధమైందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు సోమవారం ఉదయం సీఎం కేసీఆర్‌ వస్తున్నట్లు ఆలయ ఈవో గీత వెల్లడించారు. ఉద్ఘాటన పర్వాలు పూర్తయ్యాక పార్వతీ పరమేశ్వరుల నిజరూపాల దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు. ఆదివారం ఉదయం శివాలయం చెంత యాగశాలలో ద్వారతోరణం, శత రుద్రాభిషేకం, మహారుద్ర పురశ్చరణ, మూలమంత్రానుష్ఠానం, వేద హవనం, అధివాస హోమం నిర్వహించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు రుద్ర హవనం, ప్రాసాద స్నపనం, కూర్మశిల, బ్రహ్మశిల, పిండికా స్థాపనం, శయ్యాధివాసం, పుష్పాధివాసంతోపాటు ప్రాసాదాధివాసం పర్వాలను శాస్త్రోక్తంగా కొనసాగించారు. ఈ పర్వాలతో స్ఫటిక లింగ ప్రతిష్ఠాపనకు రంగం సిద్ధమైంది. స్వర్ణ కలశాల ప్రతిష్ఠాపన, మహాకుంభాభిషేక మహోత్సవం సోమవారం నిర్వహించనున్నారు. రంగంపేట(రాంపురం) ఆశ్రమ పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి నేతృత్వంలో ఆయా విశిష్టపర్వాలు కొనసాగుతాయని ఈవో గీత వెల్లడించారు. ఆదివారం యాదాద్రి క్షేత్ర సందర్శనకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరవడంతో సందడి నెలకొంది. దైవదర్శనాలు, ప్రసాదాల కొనుగోలుకు భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని