Unseasonal Rains: కల్లాల నిండా కన్నీళ్లే

ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తెస్తున్న రైతులు నష్టపోతున్నారు. తరుగు పేరుతో అధిక ధాన్యం తీసుకుంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఒకవైపు నష్టపరుస్తుంటే మరోవైపు వర్షంలో ధాన్యం రాశులు కొట్టుకుపోతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఎక్కడో గ్రామాల పక్కన పొలాల్లో సరైన సౌకర్యాలు లేనిచోట ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే కాకుండా..

Updated : 17 May 2022 05:51 IST

వ్యవసాయ మార్కెట్లలోనే వడ్లకు రక్షణ కరవు

కొనుగోలు కేంద్రాల్లో వర్షాలకు కొట్టుకుపోయిన పంట

రోజుల తరబడి కొనకపోవడంతో అన్నదాతకు తీరని నష్టం

ఈ పరిస్థితుల్లోనూ తరుగు పేరుతో తీర్మానాలు చేస్తున్నారని రైతుల ఆవేదన

ఈనాడు, హైదరాబాద్‌: ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తెస్తున్న రైతులు నష్టపోతున్నారు. తరుగు పేరుతో అధిక ధాన్యం తీసుకుంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఒకవైపు నష్టపరుస్తుంటే మరోవైపు వర్షంలో ధాన్యం రాశులు కొట్టుకుపోతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఎక్కడో గ్రామాల పక్కన పొలాల్లో సరైన సౌకర్యాలు లేనిచోట ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే కాకుండా.. పక్కా సదుపాయాలతో ఉన్నాయని చెప్పే వ్యవసాయ మార్కెట్లలోనే వర్షపునీటిలో ధాన్యం కొట్టుకుపోతుండటంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని పలువురు వాపోతున్నారు.

రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వారం రోజులుగా రోజూ హెచ్చరిస్తోంది. ‘అసని’ తుపాను వల్ల అక్కడక్కడా వానలు పడ్డాయి. ఆది, సోమవారాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వానల వల్ల ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. రాష్ట్రంలో నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమురంభీం, మెదక్‌, సంగారెడ్డి తదితర జిల్లాల్లో వడ్లు నీటి పాలయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. రైతులు ఆరబోసిన ధాన్యాన్ని కాపాడేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్వాహకులు, అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు.

ఇష్టమొచ్చినట్లు కొనుగోళ్లు

రైసుమిల్లర్లు చెప్పినట్లు వినకపోతే లారీల్లో నుంచి మిల్లుల వద్ద ధాన్యం వెంటనే దింపుకోకుండా ఆలస్యం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా లచ్చపేటలో ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని రైతులు ఇటీవల మిల్లు యాజమాన్యాన్ని నిలదీయడంతో రైసుమిల్లర్లు కుమ్మక్కై 4 రోజులు లారీల్లో నుంచి ధాన్యం దింపకుండా సహాయ నిరాకరణ చేశారు. వారిని అధికారులు బుజ్జగించి తిరిగి కొనుగోళ్లు ప్రారంభించేసరికి అధిక వర్షాలకు ధాన్యం కొట్టుకుపోయి రైతులు నష్టపోయారు. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 100 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిందంటే నష్టతీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

తీర్మానాలు చేసి ఇవ్వాలా...

రైతు అమ్మకానికి తెచ్చే ధాన్యాన్ని 40 కిలోల చొప్పున ఒక్కో బస్తాలో తూకం వేసి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తీసుకోవాలి. కానీ ధాన్యంలో తేమ ఉందనే సాకు చూపుతూ బస్తాకు మరో 2 నుంచి 3 కిలోలు పెంచి 42 లేదా 43 కిలోలు ఇవ్వాలని చెప్పి రైతులను దోచుకుంటున్నారు. ఇలా క్వింటా ధాన్యానికి అయిదారు కిలోలు అదనంగా తరుగు పేరుతో దోచేస్తున్నారు. రైతులు ఎదురు తిరిగితే వారి ధాన్యం 15 రోజులైనా కొనకుండా ఆపేస్తున్నారు. తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు ప్రశ్నించకుండా ఉండేందుకు కొన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు, రైసుమిల్లర్లు ఎత్తులు వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసిన ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు’(ప్యాక్స్‌) లేదా ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) నిర్వాహకులు రైతులను ముందుగానే పిలిచి తాము తరుగు స్వచ్ఛందంగా బస్తాకు 2 లేదా 3 కిలోలు ఇస్తున్నామని, సంఘం తరఫున తీర్మానం చేసి రాసిస్తున్నారు. ఇలా అదనంగా తరుగు ఇవ్వడానికి ముందుకొచ్చేవారివి మాత్రమే కొంటున్నారు. దీనికితోడు లారీలు సరిపోయినన్ని లేకపోవడంతో రవాణాలో జాప్యం జరిగి వర్షాలకు కేంద్రాల్లోనే తడిసిపోతున్నాయి. రైతు ధాన్యం అమ్మినా వాటిని లారీ వచ్చి అందులో లోడింగ్‌ చేసి రైసుమిల్లు వద్దకు తీసుకెళ్లి అన్‌లోడింగ్‌ చేసి అప్పగించేదాకా కొన్నట్లు రశీదులు ఇవ్వడం లేదు. లారీలో వెళ్లి దింపేదాకా రైతులదే బాధ్యతని చెప్పడంతో రోజుల తరబడి ఆలస్యమై వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నారు.


తూకాలు ఆపి ముంచేశారు..!?

ఈ చిత్రంలో రైతు పేరు పోతారవేని వెంకటేశం. ఇది కరీంనగర్‌ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్‌. 10 రోజుల కిందట వరి ధాన్యం 150 క్వింటాళ్లను తెస్తే ఇంతవరకూ కొనలేదని వర్షాలకు తడిసి పాడైందని ఆయన వాపోయారు. వానలు పడే సూచనలున్నా ఆదివారం మార్కెట్‌ మూసివేశారని, అదేరోజు రాత్రి వాన కురవడంతో సోమవారం తూకాలు వేయడం ఆపేశారని, మళ్లీ ఎండలకు ఆరబెట్టి తేమ తగ్గాక కొంటామనిచెప్పారని వాపోయారు.


వ్యవసాయ మార్కెట్‌లోనే ఇలా ఉంటే ఎలా..?

వర్షపునీటిలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఏరుకుంటున్న రైతు దంపతుల పేర్లు బెస్త గంగయ్య, పోచవ్వ. వీరు ఎకరా వరి సాగు చేసి ధాన్యాన్ని అమ్మేందుకు కామారెడ్డి జిల్లా గాంధారి వ్యవసాయ మార్కెట్‌కు తెచ్చారు. వారం నుంచి ఆరబోస్తున్నారు. కొనుగోలులో తీరని జాప్యం కారణంగా ఆదివారం కురిసిన వర్షాలకు నీటిలో ధాన్యం కొట్టుకుపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మకానికి తెచ్చిన 2 లేదా 3 రోజులకైనా కొని ఉంటే తమకు నష్టం తప్పేదన్నారు. ఇదే మార్కెట్‌లో అమ్మేందుకు ధాన్యం తెస్తే 10 రోజులైనా కొనలేదని, దీంతో వర్షాలకు తడిసి కొట్టుకుపోయిందని రైతు ఎన్‌.గంగాధర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని