ఆదిలాబాద్‌లో పత్తి.. నిజామాబాద్‌లో వరి

ప్రాంతాలవారీగా భూములు, వాతావరణం ఆధారంగా పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ తాజాగా నిర్ణయించింది. వచ్చే నెల ఎనిమిదో తేదీకల్లా నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి రానున్నాయని వాతావరణశాఖ

Published : 19 May 2022 03:07 IST

ప్రాంతాలవారీగా పంటల కాలనీలు
భూములు, వాతావరణం ఆధారంగా విభజన
వానాకాలం సీజన్‌కు వ్యవసాయశాఖ ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంతాలవారీగా భూములు, వాతావరణం ఆధారంగా పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ తాజాగా నిర్ణయించింది. వచ్చే నెల ఎనిమిదో తేదీకల్లా నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి రానున్నాయని వాతావరణశాఖ ప్రకటించినందున వానాకాలం (ఖరీఫ్‌) పంటల సీజన్‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రకారం 2020 వానాకాలంలో ఏ గ్రామంలో ఏ పంట 40 శాతం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వేశారనే సమాచారం ఆధారంగా ఈ సీజన్లో ‘పంటల కాలనీలు’ ఏర్పాటు చేస్తారు. ఆ గ్రామంలో అదే పంట సాగును ప్రోత్సహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,533 గ్రామాల్లో 2,615 పంటల కాలనీలు ఏర్పాటు చేయవచ్చని తేలింది. వీటిలో అత్యధికంగా పత్తి పంటను 6362 గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్నందున వీటిని 1332 కాలనీలుగా విభజించి ఈ సీజన్‌లో పత్తి సాగును ప్రోత్సహిస్తారు. దీని తరువాత వరి పంట 5097 గ్రామాల్లో 1052 కాలనీల్లో సాగు చేయడానికి అవకాశమున్నట్లు తేలింది. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 695 గ్రామాలను 102 కాలనీలుగా విభజించి పత్తిసాగు చేయిస్తారు. దీని తరువాత భద్రాద్రి జిల్లాలో 624 గ్రామాలు.. 40 కాలనీల్లో పత్తి ఉంటుంది. వరి పంట నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 435 గ్రామాలు 99 కాలనీల్లో, ములుగులో 393 గ్రామాలు.. 22 కాలనీల్లో సాగు చేయాలని లక్ష్యం. పత్తి అత్యధికంగా సాగయ్యే ఆదిలాబాద్‌లో వరి పంట దాదాపు లేనట్టే అన్నట్లుగా కేవలం నాలుగు గ్రామాల్లో ఒక కాలనీకే పరిమితమవడం గమనార్హం. పత్తి తరువాత కందిని ప్రోత్సహించాలని నిర్ణయించినా అది 2020 నాటి సాగు లెక్కలను బట్టి చూస్తే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే అధికంగా ఉన్నందున అక్కడే కాలనీలుంటాయని తేలింది. అప్పట్లో ఇక్కడి భూముల్లో 40 శాతం మేర అంటే సుమారు 5 లక్షల ఎకరాల్లో మాత్రమే కంది సాగైంది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పత్తి తరువాత కందిని ప్రోత్సహించాలని యోచిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నూరు శాతంతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ కలిపి సుమారు 15 -20 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయించాలన్నది లక్ష్యం.

75 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు

2020 వానాకాలంలో 53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినందున ఆ వివరాల ఆధారంగా పంటల కాలనీలను నిర్ణయించారు. వరి విత్తనాల ధరపై గతంలో క్వింటాకు రూ.వెయ్యి వరకూ రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా భరించేది. కానీ ఈ సీజన్‌లో వరి సహా ఏ పంటలకూ రాయితీ ఇవ్వకూడదని నిర్ణయించింది. పత్తి 70 నుంచి 75 లక్షల ఎకరాల్లో వేయించాలనుకుంటున్నారు. పత్తి ధర క్వింటాకు రూ.14 వేలు పలుకుతున్నందున రైతులు కూడా మొగ్గు చూపుతున్నారని అంచనా. దానికి అత్యధికంగా కాలనీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌, ఆగ్రోస్‌ ఎండీ కె.రాములు చెప్పారు. పత్తి వేసే రైతులకు యంత్ర పరికరాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఒక ఎకరంలో అత్యధికంగా పత్తి మొక్కలు నాటే (హై డెన్సిటీ) విధానాన్ని వీలైనన్ని ఎకరాల్లో ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. ఈ పద్ధతిలో సాగుచేసే పత్తి చెట్ల నుంచి దూదిని పంటకాలం మొత్తానికి కలిపి ఒకసారి మాత్రమే తీసే యంత్రాలను సైతం అందుబాటులోకి తెస్తామన్నారు. దీనివల్ల పత్తి సాగు ఒక కోతతో పూర్తవుతుందని, ఆ భూమిలో రెండో పంట వేసుకునేందుకు అవకాశముంటుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని