బొగ్గు దిగుమతులపై వివాదం

బొగ్గు దిగుమతులపై వివాదం రాజుకుంది. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల అమలు సాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) తాజాగా స్పష్టం చేసింది.

Published : 20 May 2022 05:44 IST

రాష్ట్ర వినియోగంలో 10% దిగుమతి చేసుకోవాల్సిందేనంటున్న కేంద్రం
ఈ నెలాఖరులోగా ఆర్డరివ్వకుంటే మరో 5% కలుపుతామని స్పష్టీకరణ
సింగరేణి ఉండగా విదేశీ బొగ్గు మాకెందుకంటున్న తెలంగాణ జెన్‌కో
రాష్ట్రంలో కేంద్ర ఉత్తర్వుల అమలు ప్రశ్నార్థకమే!

ఈనాడు, హైదరాబాద్‌: బొగ్గు దిగుమతులపై వివాదం రాజుకుంది. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల అమలు సాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) తాజాగా స్పష్టం చేసింది. బొగ్గు వినియోగంలో 10 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందేనని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలకు గతంలో ఉత్తర్వులిచ్చిన కేంద్రం.. ఈ నెలాఖరులోగా వాటికి అనుగుణంగా ఆర్డరివ్వకుంటే వచ్చే నెల నుంచి మరో 5 శాతం అదనంగా తీసుకునేలా పరిమితిని పెంచి జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. దీన్ని రాష్ట్రాల థర్మల్‌ విద్యుదుత్పత్తి సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని హెచ్చరించింది. తెలంగాణ జెన్‌కో పరిధిలోని విద్యుత్కేంద్రాలకు రోజుకు సగటున 50 వేల టన్నుల బొగ్గు అవసరం. ఇందులో 10శాతం లెక్కన 5 వేల టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి జెన్‌కో ఆర్డర్లు ఇవ్వాలి. ఇందుకోసం ముందుగా కొనుగోలుకు టెండర్లు పిలవాలి. కానీ జెన్‌కో ఇలాంటి ప్రయత్నాలేవీ చేయడం లేదు. ఈ క్రమంలో విదేశీబొగ్గు దిగుమతి చేసుకోవాలన్న కేంద్ర ఉత్తర్వులు రాష్ట్రంలో అమలు కావడం ప్రశ్నార్థకమే.

దిగుమతి చేసుకుంటే విద్యుత్కేంద్రాలపై ఆర్థిక భారం

సింగరేణి సంస్థకు సంబంధించి ఉత్పత్తి జరిగే బొగ్గు గనులన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. వీటి నుంచే జెన్‌కో విద్యుత్కేంద్రాలకు బొగ్గు సరఫరా అవుతోంది. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51, కేంద్రానికి 49శాతం వాటాలున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఆదేశాలను సింగరేణి అమలు చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ జెన్‌కో విద్యుత్కేంద్రాలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే తొలుత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. కేంద్ర నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా? లేదా? అనేది ఇంకా తేలలేదు. ఈ నెలాఖరులోగా తేల్చకుంటే వచ్చే నెల నుంచి బొగ్గు సరఫరా తగ్గిస్తామని కేంద్రం ప్రకటించినందున విద్యుదుత్పత్తికి ఆటంకం ఏర్పడవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. విదేశీబొగ్గు తెప్పించుకోకపోతే జూన్‌ నుంచి అక్టోబరు వరకు వాడే బొగ్గులో 15 శాతం విదేశీబొగ్గును కలిపి వినియోగించాలనే నిబంధన పెట్టింది. అదే జరిగితే రోజుకు 7,500 టన్నుల విదేశీ బొగ్గును తెలంగాణ విద్యుత్కేంద్రాలు వాడాలి. ప్రస్తుతం విదేశీబొగ్గు టన్ను ధర రూ.10,700 వరకూ ఉంది. కానీ సింగరేణి బొగ్గును రూ.4 వేలలోపే రాష్ట్ర జెన్‌కో కొనుగోలు చేస్తోంది. బొగ్గును విదేశాల నుంచి నౌకల్లో తెస్తారు. తెలంగాణకు నౌకాశ్రయాలు లేకపోవడంతో ఏపీ లేదా తమిళనాడు, కర్ణాటక తీరాలకు వచ్చే నౌకల నుంచి తెచ్చుకోవాలి. ఈ కారణంగా రవాణావ్యయం సైతం భారీగానే అవుతుంది. ఈ నేపథ్యంలోనే విదేశీబొగ్గును దిగుమతి చేసుకుంటే అదనపు ఆర్థికభారం మోయాల్సి వస్తుందని జెన్‌కో ఆందోళన చెందుతోంది. జెన్‌కో విద్యుత్కేంద్రాలకు అవసరమైన బొగ్గులో 10 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే రోజుకు సుమారు రూ.5 కోట్లు అదనంగా భారం పడుతుందని అంచనా. ఈ క్రమంలోనే విదేశీబొగ్గు కొంటే వచ్చే ఏడాది మళ్లీ కరెంటు ఛార్జీలు పెంచక తప్పదని విద్యుత్‌ పంపిణీ సంస్థలు తెలిపాయి. సింగరేణి బొగ్గునే తీసుకుంటామని, విదేశీబొగ్గు దిగుమతి చేసుకోవాలనే ఆలోచన లేదని తెలంగాణ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ‘ఈనాడు’కు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని