రిజర్వాయర్ల నిర్వహణపై సమావేశాన్ని వాయిదా వేయండి

కృష్ణా బేసిన్‌లో రిజర్వాయర్ల నిర్వహణపై చర్చించడానికి ఏర్పాటైన కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరగా, అందుకు బోర్డు అంగీకరించలేదు. వివిధ అంశాలపై చర్చించేందుకు నిర్ణీత గడువులు పెట్టుకున్నందున ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20నే జరుగుతుందని స్పష్టం చేసింది.

Published : 20 May 2022 06:06 IST

తెలంగాణ లేఖ.. కుదరదన్న కృష్ణా బోర్డు

ఈనాడు హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లో రిజర్వాయర్ల నిర్వహణపై చర్చించడానికి ఏర్పాటైన కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరగా, అందుకు బోర్డు అంగీకరించలేదు. వివిధ అంశాలపై చర్చించేందుకు నిర్ణీత గడువులు పెట్టుకున్నందున ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20నే జరుగుతుందని స్పష్టం చేసింది. ఇటీవల కృష్ణా నదీ యాజమాన్యబోర్డు సమావేశంలో చర్చించిన మేరకు మూడు అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ) ఏర్పాటైంది. బోర్డు సభ్యుడు రవికుమార్‌ పిళ్లై కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో మరో సభ్యుడు (విద్యుత్తు) ముతుంగ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు మురళీధర్‌, నారాయణరెడ్డి, తెలంగాణ జెన్‌కో డైరెక్టర్‌ వెంకటరాజం, ఆంధ్రప్రదేశ్‌ జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ సుజయ్‌కుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల తదితర ప్రాజెక్టుల్లో విద్యుత్కేంద్రాల నిర్వహణ, ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన రూల్‌కర్వ్‌, మిగులు జలాల లెక్కింపు అంశాలపై ఈ నెల 20న సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం ఇచ్చింది. కానీ రుతపవనాలకు ముందు ప్రాజెక్టులను పరిశీలించాల్సి ఉన్నందున ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌తో సహా అందరూ తీరిక లేకుండా ఉన్నారని, జూన్‌ 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ గురువారం బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. పవర్‌హౌస్‌ల నిర్వహణ విధివిధానాలను 15 రోజుల్లో ఖరారు చేయాలని, రూల్‌కర్వ్‌, మిగులు జలాల వినియోగంపై 30 రోజుల్లోగా నివేదిక సిద్ధం చేయాలని, అందువల్ల వాయిదా వేయడం వీలు కాదని బోర్డు తెలంగాణకు బదులిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సమావేశానికి తెలంగాణ హాజరవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు