సంక్షిప్త వార్తలు

ప్రభుత్వ భూములను ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకుని క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసిన వారిలో అర్హుల గుర్తింపునకు ప్రభుత్వం ప్రత్యేక బృందాల ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం జిల్లా

Updated : 20 May 2022 05:40 IST

టీహబ్‌తో ఫాల్కన్‌ ఎక్స్‌ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: సిలికాన్‌ వ్యాలీలో జరిగే ‘గ్లోబల్‌ స్టార్టప్‌ ఎమర్షన్‌ ప్రోగ్రాం’ కోసం అమెరికాకు చెందిన ఫాల్కన్‌ ఎక్స్‌ సంస్థతో టీహబ్‌ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్‌లోని స్టార్టప్‌ వ్యవస్థాపకులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించేందుకు, తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వీలు కలగనుంది. ఐదు వారాల ప్రాజెక్టులో భాగంగా కొత్త మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు అవకాశాలు ఉంటాయని టీహబ్‌ సీఈవో ఎం.ఎస్‌.ఆర్‌. తెలిపారు. సిలికాన్‌ వ్యాలీకి చెందిన 40 మంది వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, నిపుణులు సూచనలు, సలహాలు ఇస్తారని చెప్పారు. టెక్నాలజీ డేతో ముగిసే కార్యక్రమంలో 100 మంది పెట్టుబడిదారులు, పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని ఫాల్కన్‌ ఎక్స్‌ సీఈవో మురళి చీరాల తెలిపారు. తొలిమూడు స్థానాల్లో నిలిచిన స్టార్టప్‌లకు ఫాల్కన్‌ ఎక్స్‌ సంస్థ నుంచి లక్ష అమెరికా డాలర్ల వ్యూహాత్మక నిధులు అందుతాయన్నారు.


‘క్రమబద్ధీకరణ’ అర్హుల గుర్తింపునకు ప్రత్యేక బృందాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ భూములను ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకుని క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసిన వారిలో అర్హుల గుర్తింపునకు ప్రభుత్వం ప్రత్యేక బృందాల ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మండలానికో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. జీవో ఎంఎస్‌.58 కింద అంటే 125 చదరపు గజాల విస్తీర్ణం లోపు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న పేదల దరఖాస్తులను ఈ బృందాలు పరిశీలించనన్నాయి. విచారణ పూర్తయ్యాకా ఆ నివేదికలను రెవెన్యూ డివిజనల్‌ అధికారి పరిశీలించి అర్హుల తుది జాబితాను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిరుపేదలకు పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది.


 

26న తెలంగాణ సారస్వత పరిషత్తు పురస్కారాల ప్రదానం

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలంగాణ సారస్వత పరిషత్తు 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నలుగురు సాహితీవేత్తలు డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఆచార్య బన్న అయిలయ్య, డా.కాంచనపల్లి గోవర్ధనరాజు, డా.షాజహానాలకు పురస్కారాలను ప్రకటించారు. వీటిని ఈ నెల 26 సాయంత్రం పరిషత్తులో జరిగే ఉత్సవాల్లో ప్రదానం చేయనున్నట్టు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, సాహితీవేత్త డా.ముదిగంటి సుజాతారెడ్డి విశిష్ట అతిథులుగా హాజరు కానున్నారు.  


రాష్ట్ర పండగగా భాగ్యరెడ్డివర్మ జయంతి

ఈనాడు,హైదరాబాద్‌: దళితుల అభివృద్ధికి విశేష కృషి చేసిన భాగ్యరెడ్డివర్మ జయంతిని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించింది. దీన్ని ఈ నెల 22న అధికారికంగా నిర్వహించాలని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో వర్మ జయంతి ఉత్సవాలను జరపాలని ఆదేశించింది. దీనికయ్యే ఖర్చును దళిత సంక్షేమ, అభివృద్ధి శాఖ నుంచి వెచ్చించాలని సూచించింది.


డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి ఫార్మా డి అభ్యర్థులు అర్హులే

ఈనాడు, హైదరాబాద్‌: డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి ఫార్మా డి పూర్తి చేసిన అభ్యర్థులను కూడా అర్హులుగా పరిగణిస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఇప్పటి వరకూ ఈ ఉద్యోగానికి డిగ్రీ ఇన్‌ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌, మెడిసిన్‌ ఇన్‌ స్పెషలైజేషన్‌ ఇన్‌ క్లినికల్‌ ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ పూర్తి చేసిన వారు అర్హులుగా ఉన్నారు.


కళాకారులు జూన్‌ 14లోగా దరఖాస్తు చేసుకోవాలి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆరోగ్యం, సంక్షేమం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర కళాబృందాలు, జిల్లాలకు చెందిన కళాకారులు జూన్‌ 14లోగా హైదరాబాద్‌ రీజినల్‌ ఔట్‌రీచ్‌ బ్యూరో(ఆర్‌వోబీ)కు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్‌ శ్రుతిపాటిల్‌ తెలిపారు.  


ద.మ.రైల్వేకి ఐదు పతకాలు

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ విభాగాల్లో గత సంవత్సరం పనితీరుకు గాను దక్షిణ మధ్య రైల్వేకి ఐదు జాతీయ స్థాయి పతకాలు లభించాయి. భువనేశ్వర్‌లోని రైల్‌ ఆడిటోరియంలో మే 28న జరిగే కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ అందించనున్నారు. సెక్యూరిటీ షీల్డ్‌, సమగ్ర ఆరోగ్య సంరక్షణ షీల్డ్‌ (పశ్చిమ మధ్య రైల్వేతో సంయుక్తంగా), సివిల్‌ ఇంజినీరింగ్‌ షీల్డ్‌ (పశ్చిమ, మధ్య రెల్వేలతో కలిసి), స్పోర్ట్స్‌ షీల్డ్‌ (పశ్చిమ రైల్వేతో కలిసి), సివిల్‌ ఇంజినీరింగ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ షీల్డ్‌(నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వేతో సంయుక్తంగా)లు సాధించింది. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందిని జోన్‌ ఇంఛార్జి జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అభినందించారు.


‘ఈట్‌ రైట్‌ స్టేషన్‌’గా విశాఖ

ఈనాడు, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు మరో గుర్తింపు లభించింది. రైల్వే ప్రయాణికులకు శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారం అందించే స్టేషన్‌గా ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) గుర్తించింది. ‘ఈట్‌ రైట్‌ స్టేషన్‌’గా ధ్రువీకరించింది. దేశ మొత్తం మీద ఈ విభాగంలో 7 ఎంపికవగా... విశాఖ స్టేషన్‌ చోటు సంపాదించింది.


ట్రిపుల్‌ ఐటీలో రెండు పద్ధతుల్లో ఎంఎస్‌ఐటీ కోర్సు

ఈనాడు, హైదరాబాద్‌: మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఎంఎస్‌ఐటీ) కోర్సును రెండు పద్ధతుల్లో అందించనున్నట్లు గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ ప్రకటించింది. ఇకపై ఆన్‌లైన్‌, ఆన్‌ క్యాంపస్‌ (ప్రత్యక్ష పద్ధతి)లో బోధించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంజినీరింగ్‌ విద్యను పూర్తి చేసిన విద్యార్థుల నైపుణ్యాలను సానబెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఈ కోర్సును డిజైన్‌ చేశారు. ఇందులో విద్యార్థులు తమకు నచ్చినపుడు పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుంది. 3 సెమిస్టర్లు తరగతి గది బోధన, నాలుగో సెమిస్టర్‌ పరిశ్రమలలో ఇంటర్న్‌షిప్‌ ఉండేలా రూపొందించారు. ఈ కోర్సు ఆన్‌లైన్‌లో చేసేందుకు రూ.2 లక్షలు, ప్రత్యక్షంగా చదివేందుకు రూ.3 లక్షలుగా నిర్దేశించారు. మరిన్ని వివరాలకు ‌్ర్ర్ర.్ఝ(i్మ.్చ‘.i- వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.


పారిశుద్ధ్యానికి దళితబంధు వాహనాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పరిశుభ్ర పట్టణాల నేపథ్యంలో పారిశుద్ధ్యం, సెప్టిక్‌ట్యాంకులను శుభ్రపరిచేందుకు వాహనాల కొనుగోలుపై కార్యాచరణను రూపొందించాలని పురపాలకశాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఆ శాఖ కమిషనర్లను గురువారం ఆదేశించారు. దళితబంధు లేదా ఎన్‌ఎస్‌ఎఫ్‌కేడీసీ ద్వారా లబ్ధిదారులు వాహనాలు కొని వినియోగించడంపై దృష్టి సారించాలని తెలిపారు. వివిధ వాహనాల సమీకరణకు జూన్‌ 30, జులై 31, ఆగస్టు 15 తేదీలను తుదిగడువుగా నిర్దేశించారు.


ఆర్టీసీ బస్సుల కొనుగోలు టెండర్ల గడువు పొడిగింపు

నూతన బస్సులు కొనుగోలు చేసేందుకు ఆహ్వానించిన టెండరు గడువును  తెలంగాణ ఆర్టీసీ ఈ నెల 28 వరకు పొడిగించింది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో దశలవారీగా నూతన బస్సులను సమకూర్చుకోవాలని నిర్ణయించి.. తొలిదశలో 1,016 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.


కొత్తగా 47 కరోనా కేసులు

రాష్ట్రంలో గురువారం కొత్తగా 47 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,92,757కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 12,458 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 36 మందికి పాజిటివ్‌ వచ్చింది. మరో 34మంది కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 7,88,250గా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని