
Disha Encounter Case: ఇక హైకోర్టులో విచారణ
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం
కమిషన్ నివేదికను గోప్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి
బహిరంగ విచారణ జరిగాక దాపరికమెందుకన్న ధర్మాసనం
‘కేసును హైకోర్టుకు బదిలీ చేస్తున్నాం. కమిషన్ కార్యాలయం తమ నివేదిక ప్రతుల(సాఫ్ట్ కాపీలు)ను పిటిషనర్లకు, ప్రతివాదులకు పంపించాలి. నివేదికలోని ఏ అంశంపైనైనా తమకు అభ్యంతరాలుంటే ప్రతివాదులు, పిటిషనర్లు హైకోర్టుకు చెప్పుకొనే అవకాశం ఇస్తున్నాం. హైకోర్టు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను హైకోర్టుకు పంపుతాం’
- సుప్రీంకోర్టు ధర్మాసనం
ఈనాడు, దిల్లీ: దిశ హత్యాచారం అనంతరం జరిగిన ఎన్కౌంటర్ కేసులో విచారణ ఇకపై తెలంగాణ హైకోర్టులోనే జరుగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇక్కడ విచారణ చేపట్టబోమని.. మిగతా అంశాలు హైకోర్టు చూసుకుంటుందని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. ఎన్కౌంటర్పై జస్టిస్ వి.ఎస్.సిర్పుర్కర్ కమిషన్ సమర్పించిన తుది నివేదికపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. హైదరాబాద్ శివార్లలో దిశ హత్యాచారం ఘటన అనంతరం నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై న్యాయవాదులు జి.ఎస్.మణి తదితరులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు దీనిపై విచారణకు జస్టిస్ సిర్పుర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ను నియమించిన విషయమూ విదితమే. శుక్రవారం విచారణ సందర్భంగా కమిషన్ నివేదికను సీల్డు కవరులో ఉంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీన్ని తిరస్కరించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.. ‘కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నేరానికి పాల్పడిన వారిపై హైకోర్టు విచారణ చేపడుతుంది’ అన్నారు. దయచేసి నివేదికను తిరిగి సీల్ చేయాలని శ్యామ్ దివాన్ అభ్యర్థించారు. ‘బహిరంగంగా విచారణ చేపట్టిన తర్వాత గోప్యత ఏముంది? మీరు కోరితే నేను బయటకు చదివి వినిపిస్తా. రోజువారీగా ఈ కేసును మేం విచారించలేం. తర్వాత ఏం చర్యలు తీసుకోవాలనేదే ఇక్కడ ప్రశ్న. ఈ అంశంపై హైకోర్టు విచారణ చేపడుతుంది. పిటిషన్దారులకు, ప్రతివాదులకు నివేదిక ప్రతులు అందజేస్తాం’ అని సీజేఐ తెలిపారు. ఈ అంశం ట్రయల్ కోర్టుకు వెళ్లేముందు విచారణలపై ఏ ప్రభావమూ పడకూడదని భావిస్తున్నామని శ్యామ్ దివాన్ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు కమిటీని నియమించిన తర్వాత నివేదిక ఏ విధంగానైనా రావచ్చని... దానికి కోర్టు ఏం చేస్తుందని సీజేఐ ప్రశ్నించారు. సీల్డు కవరులో నివేదికలు ఉంచాలని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని శ్యామ్ దివాన్ గుర్తుచేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలకు అది వర్తిస్తుందని.. ఇది ఎన్కౌంటర్ కేసని సీజేఐ బదులిచ్చారు. నివేదికను బహిర్గతం చేస్తే అది న్యాయపాలనపై ప్రభావం చూపుతుందని శ్యామ్ దివాన్ అన్నారు. న్యాయస్థానం ఆ నివేదికను ఎందుకు పబ్లిక్డొమైన్లో పెట్టకూడదని జస్టిస్ హిమా కోహ్లి ప్రశ్నించారు. బహిరంగ విచారణ తర్వాత అందులో గోప్యత ఏముందని ప్రశ్నించిన సీజేఐ.. దేశంలో ఎటువంటి దారుణమైన పరిణామాలు నెలకొన్నాయో తాము చూస్తున్నామన్నారు. నివేదిక ఆధారంగా జాతీయ అంశాలను ధర్మాసనం స్పృశించినందున నివేదికను తిరిగి సీల్ చేసి హైకోర్టుకు పంపాలని.. లేని పక్షంలో వేసవి సెలవులయ్యే వరకు పక్కన పెట్టి.. తర్వాత దాన్ని గోప్యంగా ఉంచాలో, బహిర్గతం చేయాలో నిర్ణయించాలని శ్యామ్ దివాన్ కోరారు. ఈ దశలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ జోక్యం చేసుకున్నారు. మణిపుర్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం కింద సైన్యం చేసిన హత్యలకు సంబంధించిన నివేదికలను బహిర్గతం చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించిందన్నారు. కమిషన్ బహిరంగ విచారణ చేపట్టి.. ఆ వివరాలు నమోదు చేసిందనే విషయం గుర్తించాలని కోరారు. మీరు వాయిదా కోరుకుంటే అది వేరే అంశమని, మీ క్లయింట్ను (రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు) అడిగి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని శ్యామ్ దివాన్కు సీజేఐ సూచించారు. పది నిమిషాల పాటు విచారణను వాయిదా వేశారు. తర్వాత కేసు విచారణ పునఃప్రారంభమైంది. విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టాలని.. లేకుంటే నివేదికను బహిర్గతం చేయొద్దని మరోసారి శ్యామ్ దివాన్ అభ్యర్థించారు. దీన్ని తిరస్కరించిన ధర్మాసనం.. కేసు విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.
* విచారణ మధ్యలో పది నిమిషాల వాయిదా అనంతరం పిటిషన్ వేసిన న్యాయవాది జి.ఎస్.మణి కల్పించుకొని తాను ఇక్కడే ఉన్నానని తెలిపారు. అప్పటికీ శ్యామ్ దివాన్ కోర్టు హాల్లోకి రాలేదు. ‘మీరు అంత కంగారు పడాల్సిన పని లేదు. ప్రచారం కోసం మీరు అనేక రిట్ పిటిషన్లు వేస్తారనే విషయం తెలుసు’ అంటూ మణిని సీజేఐ మందలించారు.
* ఈ కేసు విచారణ సందర్భంగా.. ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్గా వ్యవహరించిన సజ్జనార్, కేసుతో సంబంధం ఉన్న ఇతర పోలీసు అధికారులు సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (06-07-2022)
-
India News
IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
Crime News
Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
-
General News
Harsh Goenka: బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో గోయెంకా, శిందే.. అసలు విషయం ఏంటంటే..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
- బడి మాయమైంది!
- PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
- IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!