మహిళలు, పిల్లలపై నేరాల్లో.. సత్వరమే కేసు నమోదు
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ వి.ఎస్.సిర్పుర్కర్ కమిషన్ క్షేత్రస్థాయిలో అమలవుతున్న నేర న్యాయవ్యవస్థ (క్రిమినల్ జస్టిస్ సిస్టమ్)ను పరిశీలించింది. కొన్ని కోణాల్లో న్యాయనిబంధనల విస్మరణ స్పష్టంగా కనిపిస్తున్నట్లు పేర్కొంది.
తమ పరిధి కాదంటూ పోలీసులు తప్పించుకోరాదు
కస్టడీ మరణాలపై జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణ తప్పనిసరి
జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ సిఫార్సులు
ఈనాడు, దిల్లీ: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ వి.ఎస్.సిర్పుర్కర్ కమిషన్ క్షేత్రస్థాయిలో అమలవుతున్న నేర న్యాయవ్యవస్థ (క్రిమినల్ జస్టిస్ సిస్టమ్)ను పరిశీలించింది. కొన్ని కోణాల్లో న్యాయనిబంధనల విస్మరణ స్పష్టంగా కనిపిస్తున్నట్లు పేర్కొంది. శాసన నియమాలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటి అమలులో నిర్లక్ష్యం గోచరిస్తున్నట్లు తెలిపింది. మహిళలు, పిల్లలపై నేరాలు జరిగినట్లు సమాచారం అందగానే కేసు నమోదు చేయాలి.. తప్పితే అధికార పరిధి కాదన్న పేరుతో విస్మరించడానికి వీల్లేదని పేర్కొంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఇలాంటి సమాచారం అందుకున్న పోలీసుస్టేషన్లు కేసు నమోదు చేయడానికి తప్పితే, దర్యాప్తు జరపడానికి వీల్లేదంది. మహిళలు, చిన్నారులపై నేరాలు జరిగినప్పుడు ఏ పోలీసులైనా వెంటనే రంగంలోకి దిగి తమ పరిధి కాని ప్రాంతాల్లోనైనా దర్యాప్తు జరపాలంది. తర్వాత ఎఫ్ఐఆర్, దర్యాప్తు వివరాలను సంబంధిత స్టేషన్కు అప్పగించాలంది. దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఈ కింది సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని సిర్పుర్కర్ కమిషన్ పేర్కొంది.
దిశ కేసులో ఆ నిబంధన ఉల్లంఘన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్లోని 409(3)వ ఆర్డర్ ప్రకారం గుర్తించదగ్గ నేరాలకు సంబంధించిన సమాచారం అందితే అది తమ పోలీసుస్టేషన్ పరిధిలోకి రాని ప్రాంతమైనప్పటికీ తప్పనిసరిగా ఆ విషయాన్ని నమోదు చేయాలి. పరిధి పేరుచెప్పి నిరాకరించకూడదు. నమోదు తర్వాత ఎఫ్ఐఆర్ను సంబంధిత పోలీసుస్టేషన్కు పంపాలి. అయితే దిశ కేసులో 409(3) ఆర్డర్ను అనుసరించలేదు. ఇకమీదట ఈ ఆర్డర్ను తప్పక అనుసరించాలి.
కేసుల దర్యాప్తు విభాగాన్ని ‘లా అండ్ ఆర్డర్’ నుంచి వేరుచేయాలి
పోలీసుల్లో దర్యాప్తు, శాంతిభద్రతల విభాగాలను వేరుచేయాలని ఇప్పటికే పలు కమిషన్లు సిఫార్సులు చేశాయి. వాటిని ఈ కమిషన్ ఆమోదిస్తోంది. దీనివల్ల నేరాల దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది.
అరెస్ట్ సమయంలో రాజ్యాంగ, చట్టబద్ధ నిబంధనలు పాటించాలి
ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎన్నో ఉత్తర్వులిచ్చింది. ఒక వ్యక్తిని పట్టుకోవడానికి, అరెస్ట్ చేయడానికి మధ్య స్పష్టమైన తేడా చూపాలి. కానీ పోలీసుల వద్ద తేడా కనిపించడంలేదు. ఒక వ్యక్తిని వారు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నా అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా భావించి ఆ సమయంలో తీసుకోవాల్సిన రాజ్యాంగ, చట్టబద్ధమైన నిబంధనలన్నీ డాక్యుమెంటేషన్ చేయాలి.
దర్యాప్తు ప్రక్రియ వీడియో రికార్డింగ్
దర్యాప్తు ప్రక్రియతో సంబంధం ఉన్న వ్యక్తుల అరెస్ట్, నోటీసుల జారీ, నేరం జరిగిన ప్రాంతం పరిశీలన, పంచనామా, ఫోరెన్సిక్ పరీక్ష, నేరానికి ఉపయోగించిన వస్తువుల స్వాధీనం, నేరం జరిగిన ప్రాంతం స్వభావం అన్నింటినీ వీడియో రికార్డు చేయాలి.
బాడీవోర్న్, డ్యాష్ కెమెరాలు..
ప్రజలు, అనుమానితులతో సంభాషించేటప్పుడు, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు వివరాలు రికార్డవ్వడానికి వీలుగా పోలీసుల సిబ్బందికి బాడీవోర్న్ కెమెరాలు ఇవ్వాలి. పోలీసు వాహనాల డ్యాష్బోర్డులపైనా కెమెరాలు ఏర్పాటుచేయాలి. దానివల్ల ఆ చుట్టుపక్కల దృశ్యాలు రికార్డు చేయడానికి వీలవుతుంది.
సీసీటీవీ దృశ్యాల సేకరణ...
నేరాలకు సంబంధించిన అంశాలను దర్యాప్తు చేసేటప్పుడు దానితో ముడిపడిన ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాలను తప్పనిసరిగా సేకరించి నిక్షిప్తం చేయాలి.
సాక్షుల స్టేట్మెంట్ల ఆడియో, వీడియో రికార్డింగ్
సీఆర్పీసీ సెక్షన్ 161, 164, 176 (1-ఎ)కింద సాక్షులిచ్చే అన్ని స్టేట్మెంట్లనూ తప్పనిసరిగా ఆడియో, వీడియోల రూపంలో రికార్డుచేసి భద్రపరచాలి.
నిందితులకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ రిమాండ్ విధించకూడదు
జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బాధ్యతలు నిర్వర్తించేందుకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (కలెక్టర్, ఆర్డీవో లాంటివారు)ను ఇన్ఛార్జిగా నియమించే విధానాన్ని పరిహరించాలి. వారు రిమాండ్ విధించరాదు. ఒకవేళ ఎక్కడైనా సీఆర్పీసీ సెక్షన్ 167(2-ఎ కింద) ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ను పిలవాల్సిన అసాధారణ పరిస్థితులు తలెత్తితే సదరు వ్యక్తికి సంబంధిత న్యాయనిబంధనలపై అవగాహన ఉందా.. అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
పోలీసు కస్టడీకి అప్పగించేటప్పుడు నిందితుల హాజరు
సీఆర్పీసీ సెక్షన్ 167(2)నిబంధనల కింద నిందితుల పోలీసు కస్టడీ కోసం దరఖాస్తు చేసినప్పుడు, దానిపై విచారణ జరిపిన ప్రతిసారీ తప్పనిసరిగా నిందితులను తమ ముందు హాజరుపరిచేలా మెజిస్ట్రేట్.. పోలీసులను ఆదేశించాలి.
నిందితులు జైళ్లలో ఉన్నప్పుడు నోటీసుల జారీ
పోలీసులు కోర్టుల్లో రిమాండ్ దరఖాస్తు దాఖలు చేయడానికి ముందే జైళ్లలో ఉన్న నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు చెబితే దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. పోలీసులు దాఖలు చేసిన దరఖాస్తు విచారణ తేదీని దృష్టిలో ఉంచుకొని స్పష్టమైన తేదీతో తాజా నోటీసులిచ్చేలా కోర్టు ఉత్తర్వులివ్వాలి. ఆరోజు నిందితులను తప్పనిసరిగా కోర్టు ఎదుట హాజరుపరిచేలా ఆదేశించాలి.
సీఆర్పీసీ సెక్షన్ 176(1-ఎ) కింద మెజిస్టీరియల్ విచారణ
పోలీసు కస్టడీలో మరణం సంభవిస్తే సీఆర్పీసీ సెక్షన్ 176(1-ఎ) ప్రకారం దానిపై తప్పనిసరిగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మాత్రమే విచారణ జరపాలి. కస్టడీ మరణం ఏ కోర్టు పరిధిలోకి వస్తే ఆ మెజిస్ట్రేట్కు తక్షణం సమాచారమివ్వాలి. ఎలక్ట్రానిక్ విధానంలో, ఫోన్ ద్వారా.., భౌతికంగా సమాచారం చేరవేయాలి. వెంటనే మెజిస్ట్రేట్ ఆ విషయాన్ని జిల్లా ముఖ్య సెషన్స్ జడ్జికి చెప్పి తక్షణం కస్టడీ మరణం జరిగిన చోటుకు వెళ్లి విచారణ చేపట్టాలి. అప్పటివరకు భౌతికకాయంతో పాటు, సంఘటన స్థలంలో మార్పులు చేయకూడదు. కస్టడీ మరణాలపై విచారణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (కలెక్టర్లాంటివారు)లకు అప్పగించకూడదు.
సమాచారాన్ని బయటపెట్టరాదు
ఏదైనా నేరానికి సంబంధించిన దర్యాప్తు పూర్తయి, తుది నివేదిక కోర్టులకు సమర్పించేంత వరకూ పోలీసు అధికారులు విలేకర్ల సమావేశాల్లో మాట్లాడరాదు. దర్యాప్తు వివరాలను పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలపాలి. అయితే తాము సేకరించిన సమాచారాన్ని బయటపెట్టకూడదు.
అబద్ధపు సాక్ష్యాలపై...
తప్పుడు సాక్షులను ప్రాసిక్యూట్ చేసే విధానం ఇప్పుడు సంక్లిష్టంగా ఉంది. అందువల్ల వారిపై చర్యలు తీసుకోవడం ఆశించినంతగా సాధ్యం కావడంలేదు. ఇలాంటివారిపై చర్యలు తీసుకొనే నిబంధనలను సులభతరం చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు