ఉద్యోగార్థులకు ఫీజుల భారం

ప్రభుత్వ ఉద్యోగాలకు కోటి ఆశలతో సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజులు భారంగా మారాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ).. పేదలు, రిజర్వుడు అభ్యర్థుల నుంచి కేవలం ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేస్తుంటే, నియామక బోర్డులు అధికఫీజులు

Published : 21 May 2022 05:27 IST

కమిషన్లో తక్కువ.. బోర్డుల్లో ఎక్కువ
నిర్వహణ ఖర్చులకు నిధుల కొరతే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాలకు కోటి ఆశలతో సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజులు భారంగా మారాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ).. పేదలు, రిజర్వుడు అభ్యర్థుల నుంచి కేవలం ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేస్తుంటే, నియామక బోర్డులు అధికఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటుగా కోచింగ్‌ తీసుకోలేక లైబ్రరీల్లో, మొబైల్‌ డేటాతో యూట్యూబ్‌ పాఠాలు వింటూ చాలీచాలని భోజనంతో నెట్టుకొస్తున్న అభ్యర్థులకు ఈ ఫీజులు భారంగా మారుతున్నాయి. ప్రభుత్వం సత్వర ఉద్యోగ నియామకాల కోసం వివిధ బోర్డుల్ని ఏర్పాటు చేసింది. కానీ వీటికి నిధులు, వసతులు, తగినంత మంది సిబ్బంది లేరు. దీంతో ఇవి ప్రశ్నపత్రం తయారీ సహా అన్ని ప్రక్రియలను యూనివర్సిటీలు, ఇతర ఏజెన్సీలకు అప్పగిస్తున్నాయి. ఆ ఖర్చుల భారాన్ని నిరుద్యోగులపై వేస్తున్నాయి. ‘పోలీసు నియామక బోర్డు వ్యయంలో కేవలం 5 శాతమే ప్రభుత్వం నుంచి వస్తోంది. మిగతా 95 శాతాన్ని ఫీజులు, ఇతర మార్గాల్లో సర్దుబాటు చేస్తున్నాం’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. ‘గురుకులాల్లో నియామకాలకు గ్రాంట్లు తక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం నియామక ఖర్చులను సర్దుబాటు చేస్తే ఫీజులు తగ్గించేందుకు వీలుంటుంది’ అని గురుకుల బోర్డు వర్గాలు వెల్లడించాయి.

ఉదాహరణకు ఇలా...
ఒక అభ్యర్థి డిగ్రీ, పీజీతో పాటు బీఈడీ అర్హతలు కలిగి ఉంటే ఆ అభ్యర్థికి ఫీజుల రూపంలో భారం ఇలా ఉండనుంది. ఇలాంటి అభ్యర్థికి పోలీసు ఉద్యోగాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌, రవాణా, ఎక్సైజ్‌ పోస్టులు, గురుకులాల్లో పీజీటీ, టీజీటీ, జూనియర్‌ లెక్చరర్‌, పాఠశాల విద్యాశాఖలో స్కూల్‌ అసిస్టెంట్‌ (రెండు పోస్టులు), ఎస్జీటీ, గ్రూప్‌-1, 2, 3, 4 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుంది. ఈ లెక్కన ఫీజులను లెక్కిస్తే కానిస్టేబుల్‌, ఎస్సై, రవాణా, ఎక్సైజ్‌ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రూ.3050 అవుతుంది. గురుకులాల్లో (గతంలో ఫీజు ప్రకారం) రూ.1200 చొప్పున 3 రకాల పోస్టులకు రూ.3600 అవుతుంది. విద్యాశాఖ పోస్టులను గతంలో టీఎస్‌పీఎస్సీ భర్తీ చేసింది. కమిషన్‌ వసూలు చేసిన ఫీజులను పరిగణనలోకి తీసుకుంటే రూ.200 చొప్పున మూడు పోస్టులకు రూ.600, గ్రూప్స్‌ పోస్టులకు రూ.800 ఖర్చు అవుతుంది. మొత్తం కలిపితే రూ.8050 అవుతుంది. పాఠశాల విద్యాశాఖ పోస్టులను డీఎస్సీకి అప్పగిస్తే ఈ భారం మరింత పెరుగుతుంది.

పోలీసు పరీక్ష ఒకటే.. ప్రతి పోస్టుకూ ఫీజు
ప్రస్తుతం పోలీసు నియామకబోర్డు ఆరు రకాల పోస్టులకు ప్రకటన ఇచ్చింది. వీటన్నిటికీ ప్రిలిమినరీ పరీక్ష ఒకటే. కానీ ప్రతి పోస్టుకూ దరఖాస్తు చేయాలంటే రూ.800 ఫీజుగా బోర్డు నిర్ణయించింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే రెండో పోస్టు దరఖాస్తు ఫీజులో రూ.50 తగ్గింపు ఇస్తోంది. అంటే ఆరు రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే రూ.4550 చెల్లించాలి.

టీఎస్‌పీఎస్సీ ఫీజులు కొంత నయం
టీఎస్‌పీఎస్సీకి ఏటా ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అందుతున్నాయి. దీంతో కమిషన్‌ పేదవర్గాలకు ఉచిత దరఖాస్తుకు అవకాశం కల్పిస్తోంది. పరీక్ష ఫీజు రూ.150గా ఉంది. పేదలు, రిజర్వుడు కేటగిరీల వారికి పరీక్ష ఫీజు మినహాయింపు ఉంది. ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200 చెల్లిస్తే చాలు. ఒకే పరీక్షతో వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి ఒకే దరఖాస్తు, ఒకటే ఫీజు కింద అనుమతించి, ఆప్షన్ల వారీగా పోస్టులు కేటాయించింది. కానీ ఈ పద్ధతి బోర్డుల్లో అమలు కావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని