అప్పుడే.. అప్పులు

విద్యుత్‌ సంస్థల రుణాలకు సంబంధించి.. కేంద్రం తాజా షరతు విధించింది. కొత్త రుణాలతో పాటు, ఇప్పటికే మంజూరైన వాటి నిధులు విడుదల చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వమే నేరుగా రిజర్వుబ్యాంకు (ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వంతో ‘త్రైపాక్షిక ఒప్పందం’ చేసుకోవాలని

Published : 25 May 2022 05:38 IST

కేంద్రం, ఆర్‌బీఐలతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం తప్పనిసరంటూ ఆర్‌ఈసీ లేఖ
విద్యుత్‌ సంస్థల పాత, కొత్త రుణాలకు తాజా మెలిక
విద్యుత్కేంద్రాలకు రూ. 200 కోట్ల విడుదల నిలిపివేత
ఇది వివక్షాపూరితం, అసంబద్ధం: తెలంగాణ జెన్‌కో ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ సంస్థల రుణాలకు సంబంధించి.. కేంద్రం తాజా షరతు విధించింది. కొత్త రుణాలతో పాటు, ఇప్పటికే మంజూరైన వాటి నిధులు విడుదల చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వమే నేరుగా రిజర్వుబ్యాంకు (ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వంతో ‘త్రైపాక్షిక ఒప్పందం’ చేసుకోవాలని ‘గ్రామీణ విద్యుదీకరణ సంస్థ’ (ఆర్‌ఈసీ) రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. ఈ ఒప్పందం చేయలేదని తెలంగాణ జెన్‌కోకు ఇప్పటికే రూ.200 కోట్ల దాకా నిధుల విడుదలను ఆర్‌ఈసీ నిలిపివేసింది. దీనివల్ల విద్యుత్కేంద్రాల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందని జెన్‌కో ఆందోళన చెందుతోంది. ఆర్‌ఈసీ లేఖకు జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఘాటుగా ప్రత్యుత్తరమిచ్చారు. త్రైపాక్షిక ఒప్పందానికి జెన్‌కో అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఆయన రాసిన లేఖలో ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
* గతంలో ఒప్పందం చేసుకున్న ప్రకారం యాదాద్రి, కొత్తగూడెం 7వ దశ విద్యుత్కేంద్రాల నిర్మాణం కోసం ఆర్‌ఈసీ రూ.25,652 కోట్ల రుణాలను జెన్‌కోకు మంజూరు చేసింది. ఇందులో రూ.18,690 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది.
* ఈ రుణం కోసం తన స్థిర, చరాస్తులన్నింటినీ ఆర్‌ఈసీకి తాకట్టు పెట్టి జెన్‌కో పూచీకత్తు ఇచ్చింది. జాతీయ బ్యాంకుల నుంచి జెన్‌కో ఎన్నో రుణాలు తీసుకుంటున్నా ఏ బ్యాంకూ ఇలా కఠిన నిబంధనలు విధించి ఆస్తులను తాకట్టు పెట్టుకోలేదు. పైగా ఈ రుణాలను నేరుగా జెన్‌కో బ్యాంకు ఖాతాలో వేయకుండా విద్యుత్కేంద్రాల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక ఖాతా తెరిపించాలనే నిబంధన సైతం ఆర్‌ఈసీ పెట్టింది.
* రుణరాయితీ కిస్తీలను జెన్‌కో పక్కాగా చెల్లిస్తోంది. ఇలా జెన్‌కో పారదర్శకతతో వ్యవహరిస్తున్నా త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటేనే రుణాల మిగిలిన సొమ్ము విడుదల చేస్తామనడం తెలంగాణపై చూపుతున్న వివక్షకు నిదర్శనం. ఇది అసంబద్ధం. గతంలో ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ నిబంధన పెట్టనందున అది చెల్లదు.
* ఆర్‌ఈసీ, జెన్‌కో అనేవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వాణిజ్య సంస్థలు. వ్యాపారం కోసం వాణిజ్య సంస్థలు తీసుకునే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదు. ఒప్పందం కుదిరి.. రుణ నిధులు సగం విడుదలయ్యాక రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేస్తూ త్రైపాక్షిక ఒప్పందం చేయాలనడం సరికాదు’ అని సీఎండీ ప్రభాకరరావు తన లేఖలో పేర్కొన్నారు.

ఇప్పుడేం చేయాలి?
ఆర్‌ఈసీ నిధులు విడుదల చేయకుండా.. త్రైపాక్షిక ఒప్పందం కోసం పట్టుబడితే ఏం చేయాలనే దానిపై జెన్‌కో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది. గతంలో తీసుకున్న రుణ కిస్తీల చెల్లింపులు ఆపేసి.. రుణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు కోర్టుకెళ్లి ఆర్‌ఈసీని నిలదీస్తే ఎలా ఉంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు.
* త్రైపాక్షిక ఒప్పందానికి అంగీకరిస్తే.. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏ రుణం తీసుకున్నా ఇలాగే ఆర్‌బీఐ, కేంద్రంతో ఒప్పందం చేయాలని అడుగుతారు. దీనివల్ల ఆయా సంస్థల అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకున్నట్లవుతుందని ప్రభుత్వ వర్గాలు   ఆందోళన చెందుతున్నాయి.
* ప్రభుత్వరంగ సంస్థల రుణాలను రాష్ట్రప్రభుత్వ ఖాతాలో చూపాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాల వల్ల భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పెరిగిపోయినట్లు చూపి అదనంగా ఇవ్వకుండా అడ్డుకునే ప్రమాదముందని సీనియర్‌ అధికారి ఒకరు వివరించారు. దీనివల్ల రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధుల సేకరణ చాలా కష్టంగా మారుతుందని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని