KTR: కేటీఆర్‌ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దు..!

రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ను సిటీ సివిల్‌కోర్టు రెండో అదనపు న్యాయస్థానం చీఫ్‌ జడ్జి ప్రభాకర్‌రావు శుక్రవారం ఆదేశించారు.

Updated : 11 Jun 2022 07:03 IST

బండి సంజయ్‌ను ఆదేశించిన రెండో అదనపు న్యాయస్థానం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ను సిటీ సివిల్‌కోర్టు రెండో అదనపు న్యాయస్థానం చీఫ్‌ జడ్జి ప్రభాకర్‌రావు శుక్రవారం ఆదేశించారు. కేటీఆర్‌ను కించపరిచేలా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో, పబ్లిక్‌ లేదా ప్రైవేటు వేదికలు, సామాజిక మాధ్యమాలు, సమావేశాలు, ముఖాముఖిల్లో మాట్లాడటం కాని, ప్రచురించడం కాని చేయొద్దంటూ బండి సంజయ్‌తో పాటు ఆయన అనుచరులను ఆదేశించారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశంలో మే 11న ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్‌ ఆరోపణలు చేయగా.. ఆధారాలు చూపించాలని.. 48 గంటల్లో స్పందించకపోతే  పరువునష్టం దావా వేస్తానని మంత్రి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మే 13న మంత్రి కేటీఆర్‌ తరఫున ఆయన న్యాయవాది బండి సంజయ్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశంలో దురుద్దేశపూర్వకంగా తన క్లయింట్‌ పేరు ఆపాదించే ప్రయత్నం చేశారంటూ కేటీఆర్‌ తరఫు న్యాయవాది మోహిత్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఈ అంశంపై విచారించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలంటూ బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని