Telangana News: దారిలేని బడికి రాలేం..టీసీలు ఇవ్వండి: తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల ధర్నా

దారిలేని బడికి రాలేమంటూ విద్యార్థులు మూకుమ్మడిగా టీసీలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇచ్చేవరకూ తల్లిదండ్రులతో కలిసి అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. నారాయణపేట జిల్లాలో జరిగిందీ ఘటన. దామరగిద్ద మండలం

Updated : 24 Nov 2022 14:23 IST

పాఠశాల వద్దే వంటావార్పు

దామరగిద్ద, న్యూస్‌టుడే: దారిలేని బడికి రాలేమంటూ విద్యార్థులు మూకుమ్మడిగా టీసీలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇచ్చేవరకూ తల్లిదండ్రులతో కలిసి అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. నారాయణపేట జిల్లాలో జరిగిందీ ఘటన. దామరగిద్ద మండలం ఉలిగుండం గ్రామ విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న విఠలాపూర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. దారి లేకపోవడంతో పొలాల గుండా రాకపోకలు సాగించేవారు. కొన్నేళ్ల కిందట రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఉలిగుండం నుంచి గ్రామ శివారు వరకు కిలోమీటరు దూరం రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఆ దశలో విఠలాపూర్‌ గ్రామ నాయకులు అడ్డుచెప్పారు. తమ పొలాల గుండా రోడ్డు వేయడానికి వీల్లేదని తేల్చిచెప్పడంతో పనులు అసంపూర్తిగా ఆగాయి.

పలుమార్లు ధర్నా చేసినా...

రోడ్డు పనులు పూర్తిచేసి రవాణా సదుపాయం కల్పించాలంటూ ఉలిగుండం విద్యార్థులు పలుమార్లు ధర్నాలు చేశారు. ఈ నెల 16న కూడా తల్లిదండ్రులతో కలిసి పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దారిలేని బడికి రాలేమని, టీసీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రెండ్రోజుల సమయం ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడు కోరిన మీదట ధర్నా విరమించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం మరోసారి విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల వద్ద ధర్నా చేపట్టారు. టీసీలు ఇవ్వాల్సిందేనని కోరుతూ 58 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇచ్చేవరకు వెళ్లబోమంటూ మధ్యాహ్నం అక్కడే వంట చేసుకుని తిన్నారు. ప్రధానోపాధ్యాయుడు బసిరెడ్డి సమస్యను జిల్లా విద్యాశాఖ అధికారి లియాఖత్‌ అలీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చెప్పినా వారు వినకపోవడంతో ఉపాధ్యాయులు టీసీలు ఇచ్చేందుకే సిద్ధపడ్డారు. ‘రాత్రి 8.30 గంటల సమయానికి 35 టీసీలు రాశామని, మంగళవారం ఉదయానికి అన్నీ పూర్తిచేసి ఇచ్చేస్తామని’ ప్రధానోపాధ్యాయుడు ‘న్యూస్‌టుడే’కి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని