Telangana News: రాత్రి పోస్టింగ్‌.. ఉదయాన్నే తూచ్‌!

పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో చేరేందుకు అధికారిణి బయలుదేరారు. గమ్యస్థానం చేరుకోకముందే  వెనక్కి వచ్చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఫోన్‌ వచ్చింది. దాంతో వెనుదిరగక

Updated : 26 Jun 2022 08:49 IST

పెద్దపల్లి డీసీపీగా సాయిశ్రీని నియమిస్తూ ఉత్తర్వులు

విధుల్లో చేరకముందే వెనక్కి రావాలంటూ ఆదేశాలు

రాజకీయ అభ్యంతరాలే కారణమా?

ఈనాడు, హైదరాబాద్‌: పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో చేరేందుకు అధికారిణి బయలుదేరారు. గమ్యస్థానం చేరుకోకముందే  వెనక్కి వచ్చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఫోన్‌ వచ్చింది. దాంతో వెనుదిరగక తప్పలేదామెకు. పెద్దపల్లి డీసీపీ పోస్టింగ్‌ వ్యవహారంలో చోటుచేసుకున్న ఈ పరిణామం పోలీస్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి డీసీపీ పోస్టు కొద్దిరోజుల క్రితం ఖాళీ అయింది. అంతకుముందు అక్కడ పనిచేసిన రవీందర్‌పై ఆరోపణలు రావడంతో డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. మంచిర్యాల ఇన్‌ఛార్జి డీసీపీగా ఉన్న అఖిల్‌ మహాజన్‌కు.. అక్కడ ఇన్‌ఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ స్థానంలో ఇంటెలిజెన్స్‌ విభాగంలో నాన్‌కేడర్‌ ఎస్పీగా ఉన్న సాయిశ్రీకి తాత్కాలికంగా అటాచ్‌మెంట్‌ పోస్టింగ్‌ ఇస్తూ శుక్రవారం రాత్రి డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు శనివారం ఆమె విధుల్లో చేరేందుకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. కరీంనగర్‌ చేరుకునే సమయంలో ఉన్నతాధికారి ఒకరు ఆమెకు ఫోన్‌చేసి, వెనక్కి వచ్చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆమె పెద్దపల్లి చేరుకోకుండానే హైదరాబాద్‌ తిరిగి వచ్చేసినట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లాకు చెందిన కొందరు కీలక ప్రజాప్రతినిధులు, నేతలు అభ్యంతరం వ్యక్తంచేయడమే దానికి కారణమని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని