ప్రసవ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం

ప్రసవ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు వైకల్యంతో జన్మించడంతో... తల్లిదండ్రులకు రూ.60 లక్షల నష్టపరిహారం, రూ.20 వేలు ఖర్చులు చెల్లించాలని ఆసుపత్రిని ఆదేశిస్తూ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ తీర్పు వెలువరించింది.

Published : 29 Jun 2022 04:24 IST

రూ.60 లక్షలు పరిహారమివ్వాలని వినియోగదారుల కమిషన్‌ తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రసవ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు వైకల్యంతో జన్మించడంతో... తల్లిదండ్రులకు రూ.60 లక్షల నష్టపరిహారం, రూ.20 వేలు ఖర్చులు చెల్లించాలని ఆసుపత్రిని ఆదేశిస్తూ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ తీర్పు వెలువరించింది. నాగర్‌కర్నూల్‌ సమీపంలోని గ్రామానికి చెందిన పెద్దగళ్ల శిరీష గర్భధారణ అనంతరం 6వ నెల నుంచి హైదరాబాద్‌లోని ఫెర్నాండజ్‌ ఆసుపత్రికి వెళ్లారు. మొదటిసారి తనకు సిజేరియన్‌ జరిగినట్లు వారికి నివేదించారు. తాము సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తామని... అవసరమైన పరీక్షల తర్వాత నిర్ణయం తీసుకుంటామని వైద్యులు ఆమెకు తెలిపారు. ప్రసవం కోసం శిరీష 2019 ఫిబ్రవరి 14న ఉదయం ఆసుపత్రిలో రూ.50 వేలు అడ్వాన్స్‌గా చెల్లించి చేరారు. ప్రసవం సమయంలో ఉంటానని చెప్పిన వైద్యురాలు ఆ సమయంలో రాలేదు. ఇతర  వైద్యుల పర్యవేక్షణలో సాధారణ ప్రసవం కోసం ఇంజక్షన్ల సహాయంతో ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో 2019 ఫిబ్రవరి 15 తెల్లవారుజామున 3గంటలకు శిరీషకు అత్యవసరంగా సిజేరియన్‌ చేశారు. సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించిన సమయంలో మొదటిసారి కాన్పు సమయంలో వేసిన కుట్లు విడిపోయి విపరీతమైన వెన్నెముక నొప్పితో శిరీష బాధపడింది. ఆక్సిజన్‌ అందక బిడ్డ అనేక లోపాలతో జన్మించినట్లు వైద్య నివేదికలు స్పష్టం చేశాయి. వైద్యం కోసం నెలకు రూ.60వేల ఖర్చు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రసవ సమయంలో అందించిన చికిత్స, వివిధ వైద్య నివేదికలను, కోర్టు తీర్పులను పరిశీలించిన కమిషన్‌  వైద్యుల నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా ఉన్నట్లు తీర్పులో పేర్కొంది. రూ.60 లక్షల పరిహారం, ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని కమిషన్‌-2 అధ్యక్షులు వక్కంటి నర్సింహారావు, సభ్యుడు పారుపల్లి జవహర్‌బాబు తీర్పు వెలువరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని