రేపట్నుంచే ‘దోస్త్‌’

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సర ప్రవేశానికి జులై 1వ తేదీ నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. మూడు విడతలుగా ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. అక్టోబరు 1

Published : 30 Jun 2022 03:42 IST

1 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం

అక్టోబరు 1 నుంచి డిగ్రీ తరగతులు

కాల పట్టికను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి

తొలిసారిగా ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సర ప్రవేశానికి జులై 1వ తేదీ నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. మూడు విడతలుగా ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు మొదలవుతాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఉపాధ్యక్షుడు ఆచార్య వి.వెంకటరమణ తదితరులు దోస్త్‌ నోటిఫికేషన్‌, రిజిస్ట్రేషన్‌ కాల పట్టికను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, కొత్తగా ఏర్పాటైన మహిళా విశ్వవిద్యాలయంలోనూ బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లో సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 1080 కళాశాలలున్నాయని, గత ఏడాది 4.68 లక్షల సీట్లకుగానూ 2.55 లక్షలే నిండాయని తెలిపారు. ఈసారి గ్రూపుల మార్పుల కోసం 83 కళాశాలలు దరఖాస్తులు చేసుకున్నాయని, వాటిపై నిర్ణయం తీసుకున్న తర్వాత సీట్ల సంఖ్యపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు, కళాశాల విద్యాశాఖ ఆర్‌జేడీ జి.యాదగిరి, అకడమిక్‌ గైడెన్స్‌ అధికారి డి.తిరువెంగళ చారి, దోస్త్‌ సాంకేతిక సమన్వయకర్త గజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు...

* తొలిసారిగా తెలంగాణలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం కోటా అమలుచేస్తారు.

* కళాశాలల చిరునామాలను జీపీఎస్‌తో అనుసంధానిస్తారు. దానివల్ల తమ ఇంటి నుంచి కళాశాల ఎంత దూరం ఉందో తెలుసుకోవచ్చు.

* దోస్త్‌ జాబితాలోని కళాశాలలన్నీ తప్పనిసరిగా వెబ్‌సైట్లు రూపొందించుకోవాలి. న్యాక్‌ గ్రేడ్‌నూ  అప్‌లోడ్‌ చేయాలి.

* మూడో విడత వరకూ ఒక సెక్షన్‌లో 15 మందిలోపే చేరినట్లయితే దాన్ని రద్దు చేస్తారు. విద్యార్థుల ఐచ్ఛికాలను స్వీకరించి మరో కళాశాలలో చేరే అవకాశం ఇస్తారు.

* విద్యార్థులు సందేహాలను తీర్చుకునేందుకు ఈసారి కాల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నారు. త్వరలో నంబరు ప్రకటిస్తారు.

* మూడు విడతల ప్రవేశాల ప్రక్రియ ముగిసిన తర్వాత అక్టోబరు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తారు.


దోస్త్‌ కాలపట్టిక

* మొదటి విడత రిజిస్ట్రేషన్‌: జులై 1 నుంచి 30వ తేదీ వరకు

* రుసుం: రూ.200

* వెబ్‌ ఆప్షన్లు: జులై 6 నుంచి 30వరకు

* సీట్ల కేటాయింపు: ఆగస్టు 6న

* సీట్లు పొందిన వారు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: ఆగస్టు 7 నుంచి 18 వరకు

* రిజిస్ట్రేషన్‌ కోసం వెబ్‌సైట్‌: dost.cgg.gov.in

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని