సంక్షిప్త వార్తలు

రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గురువారం నుంచి 3 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు తెలిపారు. పశ్చిమ భారత

Published : 30 Jun 2022 05:41 IST

మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గురువారం నుంచి 3 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు తెలిపారు. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంపై రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నందున వర్షాలు కాస్త తగ్గినట్లు ఆమె చెప్పారు. మధ్యప్రదేశ్‌ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితలద్రోణి కొనసాగుతోంది.  


బీఎస్సీలోనూ ఏఐ అండ్‌ ఎంఎల్‌ కోర్సు

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌(ఏఐ అండ్‌ ఎంఎల్‌) కోర్సు ఉండగా...ఈ విద్యా సంవత్సరం(2022-23) కొత్తగా రాష్ట్రంలో బీఎస్సీలో ఏఐ అండ్‌ ఎంఎల్‌ కోర్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. కళాశాల విద్యాశాఖ పరిధిలో మొత్తం 129 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా అందులో 11 కళాశాలలకు యూజీసీ నుంచి స్వయంప్రతిపత్తి హోదా ఉంది. వాటిల్లో ఈ కొత్త కోర్సును ప్రవేశపెట్టాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది. అంతేకాకుండా బీబీఏ లాజిస్టిక్‌, బీబీఏ, రిటైలింగ్‌, బీఎస్సీ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో 2020లో బీఎస్సీ డేటా సైన్స్‌ ప్రవేశపెట్టగా...గత ఏడాది బీఏ ఆనర్స్‌ను ఆరు కళాశాలల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరో వైపు ఈసారి సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని కొన్ని రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సు కూడా అందుబాటులోకి రానుంది.


సంతోష్‌బాబు సతీమణికి నగదు సాయం

ఈనాడు, హైదరాబాద్‌: గల్వాన్‌ ఘటనలో మరణించిన కర్నల్‌ సంతోష్‌బాబుకు మహావీరచక్ర పురస్కారం కింద రూ.1.25 కోట్ల నగదు సాయాన్ని ఆయన భార్య సంతోషికి మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.


ప్రవేశ గడువు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులు ఆయా పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సిన గడువు జులై 5వరకు పొడిగించినట్లు గురుకులసెట్‌ కన్వీనర్‌  రొనాల్డ్‌రాస్‌ తెలిపారు.


స్విట్జర్లాండ్‌కు నీటిపారుదలశాఖ బృందం

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు 1, 2 ప్యాకేజీ నిర్మాణాల్లో ఏర్పాటు చేయనున్న సామగ్రి నాణ్యత తనిఖీ, సాంకేతిక చర్చల కోసం నీటిపారుదలశాఖ ఉన్నతాధికారుల బృందం స్విట్జర్లాండ్‌ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఈఎన్‌సీలు సి.మురళీధర్‌, ఎన్‌.వెంకటేశ్వర్లు, హరిరాం, సలహాదారు కె.పెంటారెడ్డి, చీఫ్‌ ఇంజినీర్లు పి.బాలరాజు, ఎండీ అబ్దుల్‌ హమీద్‌ఖాన్‌, ఎస్‌ఈ బస్వరాజ్‌, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి జులై 3 నుంచి 14 వరకు స్విట్జర్లాండ్‌లో పర్యటించేందుకు అనుమతించింది.


రహదారుల అత్యవసర మరమ్మతులకు రూ.50 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత వర్షాకాలంలో రహదారుల అత్యవసర మరమ్మతుల కోసం రూ.50 కోట్లను కేటాయించాలని రాష్ట్ర రహదారులు- భవనాల శాఖ నిర్ణయించింది. భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిన్న పక్షంలో తక్షణ మరమ్మతులకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది.


కొత్తగా 485 కరోనా కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 485 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,00,476కు పెరిగింది. తాజాగా మరో 236 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 7,91,944 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 29న సాయంత్రం 5.30 వరకు నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు బుధవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,421 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో 257, సంగారెడ్డి జిల్లాలో 73, రంగారెడ్డిలో 58, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 37, ఖమ్మం జిల్లాలో 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని