TSRTC: శ్రీవారి భక్తులకు శుభవార్త.. బస్‌ టికెట్‌తో పాటే దర్శనం టికెట్‌

తెలంగాణ నుంచి తిరుమల వెళ్లనున్న భక్తులకు టీఎస్‌ఆర్టీసీ తీపి కబురు అందించింది. తిరుమల వెళ్లేందుకు ఆర్టీసీ బస్‌ టికెట్‌తో పాటు వెంకటేశ్వరస్వామి దర్శనానికి టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని

Updated : 01 Jul 2022 08:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి తిరుమల వెళ్లనున్న భక్తులకు టీఎస్‌ఆర్టీసీ తీపి కబురు అందించింది. తిరుమల వెళ్లేందుకు ఆర్టీసీ బస్‌ టికెట్‌తో పాటు వెంకటేశ్వరస్వామి దర్శనానికి టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని శుక్రవారం నుంచి వినియోగించుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ప్రతిరోజూ వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ, తితిదే మధ్య అంగీకారం కుదిరిందని వివరించారు. తిరుమలకు బస్‌ టికెట్‌ రిజర్వు చేసుకునే సమయంలోనే దర్శనం టికెట్లు బుక్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆర్టీసీ వెబ్‌సైట్‌ లేదా అధీకృత డీలర్‌ ద్వారా రిజర్వు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌ లేదా టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లలో ప్యాకేజీ కోసం కనీసం వారం ముందుగా టికెట్లు బుక్‌ చేసుకోవాలని ఆయన సూచించారు.

ఇంటింటికీ పార్సిల్‌ సేవలపై ఒప్పందం

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో ఇంటింటికీ పార్సిళ్ల చేరవేతకు పోస్టల్‌ శాఖతో ఒప్పందం చేసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రెండు విభాగాల అధికారులతో గురువారం బస్‌భవన్‌లో ఈమేరకు సమావేశం జరిగినట్లు వెల్లడించారు. ‘‘హెచ్‌ఎండీఏ పరిధిలో 110 పిన్‌కోడ్‌ సెంటర్లు ఉన్నాయి. తొలిదశలో 27 ప్రాంతాల్లో హోం డెలివరీ పార్సిల్‌ సేవలను ప్రారంభిస్తాం. దశలవారీగా మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తాం. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల ద్వారా రోజుకు 18 వేలకు పైగా పార్సిళ్లను చేరవేస్తున్నాం’’ అని సజ్జనార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని