వేదికపై ముగ్గురే..!

హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాన వేదికపై ముగ్గురు నాయకులు మాత్రమే ఆసీనులు కానునున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజ్యసభలో

Published : 02 Jul 2022 03:28 IST

మోదీ, జేపీ నడ్డా, పీయూష్‌ గోయల్‌
జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాన వేదికపై ముగ్గురు నాయకులు మాత్రమే ఆసీనులు కానునున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజ్యసభలో భాజపా పక్షనేత, కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌లు మాత్రమే వేదికపై కూర్చుంటారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు జాతీయ పార్టీ, అనుబంధ విభాగాలు, రాష్ట్రాల అధ్యక్షులు సహా ఇతర నేతలు కలిపి మొత్తం 345 మందికి అవకాశం లభించింది. కొవిడ్‌ బారిన పడటం, ఇతర సమస్యల కారణంగా పది, పదిహేను మంది రాకపోవచ్చని భాజపా వర్గాల సమాచారం. భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీమనోహర్‌ జోషిలు వయోభారం, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా హాజరు కావడం లేదని పార్టీ కీలక నేత ఒకరు తెలిపారు.

తెలంగాణ నుంచి 14 మంది.. ఏపీ నుంచి ఏడుగురు

కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణకు చెందిన 14 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, మధ్యప్రదేశ్‌ భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు, తమిళనాడు పార్టీ కో ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్‌, జి.వివేక్‌ వెంకటస్వామి, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి, శాసనసభాపక్ష నేత రాజాసింగ్‌, పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి హోదాలో కామర్సు బాలసుబ్రహ్మణ్యానికి అవకాశం లభించింది. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి పేరును మలి జాబితాలో చేర్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్‌, జాతీయ కార్యవర్గసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, మండలిలో భాజపా పక్షనేత పీవీఎన్‌ మాధవ్‌ పాల్గొననున్నారు. ఏపీకి చెందిన హరియాణా రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి జీఆర్‌ రవీంద్రరాజు కూడా హాజరుకానున్నారు.

ఆహ్వానితుల జాబితాలో హేమామాలిని, ఖుష్బూ..

వసుంధరరాజే సింధియా, డీకే అరుణ సహా 12 మంది జాతీయ ఉపాధ్యక్షులు..అరుణ్‌సింగ్‌, తరుణ్‌ఛుగ్‌ సహా ఎనిమిది మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు.. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, యోగి ఆదిత్యనాథ్‌ సహా 12 మంది ముఖ్యమంత్రులు..మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇతర నేతల పేర్లు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేవారి జాబితాలో ఉన్నాయి. నటి, ఎంపీ హేమామాలిని, మరోనటి ఖుష్బూల పేర్లూ ఉన్నాయి.

మోదీ సభలో వేదికపై 20-30 మంది?

జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత 3న సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో మోదీ సభలో ప్రధాన వేదికపై కూర్చునే నేతల సంఖ్యపై భాజపా కసరత్తు చేస్తోంది. 25-30 మంది నేతలకు వేదికపై అవకాశం కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అగ్రనేతలతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఉండేలా కూర్పు చేస్తున్నారు. శనివారానికి స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని