Current Bill: సెల్‌ఫోన్‌తో కరెంటు బిల్లు

మీ ఇంట్లో వాడిన కరెంటుకు మీరే బిల్లు తీసుకోవచ్చు.. వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించనూవచ్చు..  ఈ సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు కసరత్తు చేస్తున్నాయి.

Updated : 03 Jul 2022 09:55 IST

తెలంగాణ వ్యాప్తంగా అమలుకు డిస్కంల యోచన

ఈనాడు, హైదరాబాద్‌ - భగత్‌నగర్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: మీ ఇంట్లో వాడిన కరెంటుకు మీరే బిల్లు తీసుకోవచ్చు.. వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించనూవచ్చు..  ఈ సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు కసరత్తు చేస్తున్నాయి. తొలుత హైదరాబాద్‌ కేంద్రంగా దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇప్పటివరకూ 10లక్షల మంది ఇలా సెల్‌ఫోన్‌ కెమెరాతో వారి ఇంట్లో కరెంటు మీటర్‌ రీడింగ్‌ను ఫొటో తీసి బిల్లు చెల్లించారు. నేటికీ చాలామందికి దీనిపై పూర్తిగా అవగాహన లేనట్లు చెప్పారు. గత జనవరిలో నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఈ విధానంపై అవగాహన కల్పించడానికి స్టాల్‌ ఏర్పాటుచేస్తే వేలమంది ఆసక్తి చూపారు.

యాప్‌ నిక్షిప్తం ఇలా..

స్మార్ట్‌ఫోన్‌లో ‘గూగుల్‌ ప్లే స్టోర్‌’లోకి వెళ్లి తొలుత మీరు ఏ డిస్కం పరిధిలో ఉంటే దాని యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవాలి. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణకు ‘టి.ఎస్‌.ఎన్‌.పి.డి.సి.ఎల్‌, దక్షిణ తెలంగాణకు టి.ఎస్‌.ఎస్‌.పి.డి.సి.ఎల్‌’ అనే డిస్కంల యాప్‌లున్నాయి. వీటిలో ఏదో ఒక ప్రాంతంలో మీ ఇంటి లేదా దుకాణం, పరిశ్రమ కరెంటు కనెక్షన్‌ ఉంటుంది. డిస్కం యాప్‌  డౌన్‌లోడ్‌ అయ్యాక, మళ్లీ గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘భారత్‌ స్మార్ట్‌ సర్వీసెస్‌’ అనే యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి. ఈ యాప్‌ను ఓపెన్‌ చేసి ‘సెల్ఫ్‌ బిల్లింగ్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో రాష్ట్రం అనేచోట తెలంగాణ, డిస్కం అనే చోట మీ కనెక్షన్‌ ఉన్న టి.ఎస్‌.ఎన్‌.పి.డి.సి.ఎల్‌. లేదా టి.ఎస్‌.ఎస్‌.పి.డి.సి.ఎల్‌.’ ఎంపిక చేసుకోవాలి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నల్లా నీటి కనెక్షన్‌ బిల్లు కోసమైతే ‘హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ’ అనేది ఎంపిక చేసుకోవాలి. ఆ తరవాత మీ కరెంటు కనెక్షన్‌ ‘యు.ఎస్‌.సి. లేదా నీటి కనెక్షన్‌కు అయితే సీఏఎన్‌ నెంబరును నమోదు చేయాలి. అక్కడ వినియోగదారుడి వివరాలు ప్రత్యక్షమవుతాయి. అప్పుడు మీటరు రీడింగ్‌ ఫొటో తీయాలి. అది సరిగా రాకపోతే రీడింగ్‌ అంకెలను నేరుగా నమోదు చేస్తే బిల్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. బిల్లు డౌన్‌లోడు చేసుకుని ఆన్‌లైన్‌లో పేమెంట్‌ ఆప్షన్‌లోకి వెళ్లి చెల్లిస్తే సరిపోతుంది.

ముందు తీయకుండా...

కరెంటు బిల్లు కచ్చితంగా 30 రోజుల తరవాతే తీసుకోవాలి. సొంతంగా ఫొటో తీసేవారు అంతకన్నా 2, 3 రోజుల ముందు బిల్లు తీసి చెల్లిస్తే.. 30 రోజులయ్యాక డిస్కం సిబ్బంది వచ్చి మళ్లీ బిల్లు తీసి ఇస్తున్నారు. దీనివల్ల ఒకే నెలకు రెండు బిల్లులు వస్తున్నాయి. ఈ సమస్య రాకుండా సెల్‌ఫోన్‌తో కరెంటు మీటరు రీడింగ్‌ ఫొటో తీసినప్పుడు కచ్చితంగా 30 రోజులు పూర్తయితేనే బిల్లు కనిపించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని దక్షిణ డిస్కం సీఎండీ జి.రఘుమారెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. ఇది పూర్తయ్యాక, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశాక అందరికీ సెల్ఫ్‌బిల్లింగుపై అవగాహన కల్పిస్తామన్నారు. అది పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాక వినియోగదారులకు రాయితీ ఇచ్చే అంశంపైనా నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో..

విద్యుత్తు బిల్లును సెల్‌ఫోన్‌లోని యాప్‌ సాయంతో సొంతంగానే తీసుకునే ప్రక్రియ టి.ఎస్‌.ఎన్‌.పి.డి.సి.ఎల్‌. పరిధిలో 2020 ఏప్రిల్‌లో మొదలైంది. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో సుమారు రెండు లక్షల మంది అక్కడ ఆ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు చెప్పారు. ప్రతినెలా ఆ సదుపాయాన్ని కొత్తగా వినియోగించుకుంటున్న వారి సంఖ్య 1500-2000 మధ్య నమోదవుతున్నట్లు వివరించారు. 10 కిలోవాట్లలోపు విద్యుత్తు సామర్థ్యం ఉన్న వినియోగదారుడు మీటర్‌ రీడింగ్‌ను స్మార్ట్‌ఫోన్‌లో తీసుకునే అవకాశాన్ని విద్యుత్తు సంస్థ కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు