మన‘సారా’ తరిమేశారు

పచ్చని ఆ పల్లెలో మద్యం చిచ్చు రేపింది. కుటుంబాల్లో గొడవలు.. పంచాయితీలతో ప్రశాంతత చెదిరిపోయింది. ఈ పరిస్థితి గ్రామానికి చెందిన విద్యావంతులు, యువకుల్లో ఆలోచన రేపింది. ఊరు బాగుపడాలంటే మహమ్మారిని పారదోలాల్సిందేనని గట్టిగా

Updated : 05 Jul 2022 10:51 IST

ఊరి బాగుకు కదిలిన యువత
మూడేళ్లుగా మద్య నిషేధం
ఖమ్మం జిల్లా కొత్త కారాయిగూడెం స్ఫూర్తి
పెనుబల్లి - న్యూస్‌టుడే

చ్చని ఆ పల్లెలో మద్యం చిచ్చు రేపింది. కుటుంబాల్లో గొడవలు.. పంచాయితీలతో ప్రశాంతత చెదిరిపోయింది. ఈ పరిస్థితి గ్రామానికి చెందిన విద్యావంతులు, యువకుల్లో ఆలోచన రేపింది. ఊరు బాగుపడాలంటే మహమ్మారిని పారదోలాల్సిందేనని గట్టిగా నిర్ణయించుకున్నారు. సర్పంచి, పోలీసులు, గ్రామస్థుల సహకారంతో సమష్టిగా నిషేధానికి నడుంకట్టారు. మూడేళ్ల క్రితం నిర్ణయం తీసుకుని.. ఇప్పటికీ విజయవంతంగా అమలు చేస్తున్న కొత్త కారాయిగూడెం స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో మూడేళ్ల క్రితం సుమారు 10 మద్యం గొలుసు దుకాణాలు ఉండేవి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచీ మద్యం తాగేందుకు ఇక్కడికి పలువురు వచ్చేవారు. నిబంధనల ప్రకారం బడులు, గుడులకు దూరంగా మద్యం దుకాణాలు ఉండాలి. గ్రామంలో మాత్రం వాటిని ఆనుకొని గొలుసు దుకాణాలు ఉండేవి. కొంతమంది రాత్రిళ్లు బడిలో తాగి సీసాలు అక్కడే పడేసేవారు. గుడుల వద్దా అదే పరిస్థితి. తాగిన మైకంలో గొడవలు.. కుటుంబ కలహాలు చోటుచేసుకునేవి. కొందరు ఆత్మహత్యలకూ పాల్పడ్డారు. 18 ఏళ్లు నిండనివారూ మద్యం తాగేవారు. గ్రామంలో పరిస్థితి విద్యావంతులు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న గ్రామ యువకుల్ని కదిలించింది. ఊరు బాగుపడాలంటే మద్య నిషేధమే మార్గమని భావించారు. సర్పంచి దొడ్దపనేని శ్రీదేవితో చర్చించారు. యువతకు ఆమె అండగా నిలిచారు. మద్యనిషేధాన్ని అంగీకరిస్తూ తొలుత 300 మంది గ్రామస్థులు సంతకాలు చేశారు. తమ నిర్ణయం గురించి ఎస్సై తోట నాగరాజుకు తెలపగా.. సహకరించేందుకు ముందుకొచ్చారు. 2019 ఏప్రిల్‌ నుంచి గ్రామంలో మద్యం అమ్మడాన్ని, తాగడాన్ని నిషేధించారు. గ్రామస్థులందరితో మాట్లాడి గొలుసు దుకాణాలను మూసివేయించారు. ఎవరూ ఉల్లంఘించకుండా రాత్రివేళల్లో గస్తీ తిరిగారు. మొదట్లో కొంతమంది ఎదురుతిరిగినా యువత ఎదురొడ్డి నిలిచారు. విజయం సాధించారు. గ్రామంలో మూడేళ్లుగా మద్య నిషేధం విజయవంతంగా అమలవుతోంది. ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేకుండా గ్రామం ప్రశాంతంగా ఉందని.. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని గ్రామస్థుడు నూనె సోమయ్య సంతోషంతో పేర్కొన్నారు.


 


మంచి పనిలో భాగస్వామ్యం సంతోషంగా ఉంది
- దొడ్డపనేని అనీష్‌

నేను దుబాయ్‌లో ఉద్యోగం చేసేవాడిని. ఇంటికి వచ్చినప్పుడల్లా మద్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను చూసి బాధ కలిగేది. గ్రామంలోని యువకులతో మాట్లాడి నిషేధంపై నిర్ణయం తీసుకుని తీర్మానం చేశాం. మంచి పనిలో నా భాగస్వామ్యం ఉండటం సంతోషంగా ఉంది.


గ్రామం ప్రశాంతంగా ఉంది
- దొడ్డపనేని శ్రీదేవి, సర్పంచి

నేను సర్పంచిగా ఎన్నికైన సమయంలో తాగిన మైకంలో కొట్టుకోవడాలు, ఘర్షణలతో నిత్యం పంచాయితీలు జరుగుతుండేవి. మద్య నిషేధంపై తీర్మానిద్దామని గ్రామ యువత చెప్పడంతో సంతోషం వేసింది. వారికి పూర్తి సహకారం అందించాను. పోలీసులకు వినతిపత్రం ఇచ్చాం. ప్రతి గొలుసు దుకాణానికి యువత వెళ్లి మూసివేయాలని చెప్పారు. అప్పటి ఎస్సై తోట నాగరాజు దుకాణదారులను హెచ్చరించడంతో నిషేధం ఆరంభమైంది. మా ప్రయత్నాలకు ఎమ్మెల్యే  సహకరించడంతో గ్రామం ప్రశాంతంగా ఉంది.


మద్యం మానేశాక ఆరోగ్యం బాగుపడింది
- మేడా ప్రభాకర్‌రావు

నిత్యం మద్యం తాగడంతో నా ఆరోగ్యం పాడైంది. ఆసుపత్రికి వెళ్తే రూ.3 లక్షలు ఖర్చయింది. మద్యాన్ని మానేయడంతో ఆరోగ్యం బాగుపడింది. ప్రస్తుతం మామిడి తోటల వ్యాపారం చేస్తున్నాను.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు