వ్యవసాయ మోటార్లకు మీటర్లపై కేంద్రం వెనకడుగు

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలనే అంశం నుంచి కేంద్రం వెనక్కు తగ్గింది. గతేడాది విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ముసాయిదాలో పేర్కొన్న ఆ నిబంధనను తొలగించింది. సాగు మోటార్లకు కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద

Published : 07 Jul 2022 02:38 IST

డిస్కంల డీలైసెన్సింగ్‌పైనా..

రాష్ట్రాల వ్యతిరేకతతో కఠిన నిబంధనల తొలగింపు

బిల్లు ముసాయిదా సిద్ధం.. ఈ నెలలోనే పార్లమెంటుకు!

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలనే అంశం నుంచి కేంద్రం వెనక్కు తగ్గింది. గతేడాది విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ముసాయిదాలో పేర్కొన్న ఆ నిబంధనను తొలగించింది. సాగు మోటార్లకు కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టి వ్యవసాయానికిచ్చే కరెంటును లెక్కించాలని సూచించింది. అలానే ముసాయిదాలో పేర్కొన్న విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల డీలైసెన్సింగ్‌ నిబంధననూ పక్కన పెట్టింది. విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణ లక్ష్యంతో గతేడాది రూపొందించిన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లులో కేంద్రం తాజాగా పలు మార్పులు చేసింది. ఈ బిల్లు తొలి ముసాయిదాను తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ సహా పలు రాష్ట్రాల సీఎంలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. సవరించిన విద్యుత్‌ బిల్లును ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని కేంద్ర విద్యుత్‌శాఖ కసరత్తు చేస్తోంది.

ఇవీ మార్పులు..

* ఒకే ప్రాంతంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంస్థలకు విద్యుత్‌ పంపిణీకి లైసెన్సులిస్తే రాష్ట్ర ప్రభుత్వం ‘క్రాస్‌ సబ్సిడీ నిధి’ని ఏర్పాటుచేయాలి.

* ఇతర దేశాలకు కరెంటు అమ్ముకోవచ్చనే నిబంధనను సైతం ముసాయిదాలో తొలగించారు.

* హైకోర్టు న్యాయమూర్తి ఛైర్మన్‌గా ఒక సెలక్షన్‌ కమిటీని ఏర్పాటుచేసి రాష్ట్ర ఈఆర్‌సీ పాలకమండలిని నియమించాలనే నిబంధనను తొలగించారు. ఒకవేళ రాష్ట్ర ఈఆర్‌సీ పాలకమండలిలో ఛైర్మన్‌, సభ్యుల పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచితే ఆ రాష్ట్ర ఈఆర్‌సీ బాధ్యతలను పక్క రాష్ట్రాల ఈఆర్‌సీకి అప్పగించే అధికారం కేంద్రానికి కల్పిస్తూ నిబంధన పెట్టారు.

* ఏటా కరెంటు ఛార్జీల సవరణకు డిస్కంలు సకాలంలో ప్రతిపాదనలు ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా ఛార్జీలు సవరించే అధికారాన్ని ఈఆర్‌సీకి కల్పిస్తూ తొలుత పెట్టిన నిబంధనను తొలగించారు. ఛార్జీల పెంపును ఈఆర్‌సీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. రాష్ట్ర ఈఆర్‌సీకి సాధారణ సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి. 

మెగావాట్‌కు పైగా వాడేవారికి...

* రోజుకు మెగావాట్‌కు పైగా కరెంటు వాడుకునే వినియోగదారులు వారికి కనెక్షన్‌ ఇచ్చిన డిస్కం నుంచే కాకుండా బహిరంగ మార్కెట్‌లో, అవసరమైతే ఇతర రాష్ట్రాల విద్యుత్కేంద్రాల నుంచి సైతం కరెంటు కొనుక్కోవచ్చు. దాన్ని సరఫరా చేసినందుకు ఆ ఛార్జీలను మాత్రమే కనెక్షన్‌ ఇచ్చిన డిస్కం వసూలు చేయాలి. ఇలా బహిరంగ మార్కెట్‌లో కొనడాన్ని ‘ఓపెన్‌ యాక్సిస్‌’ అని పిలుస్తారు. ఇలా కొనేవారిని ఎవరూ అడ్డుకోకూడదు.

* ఒక ప్రాంతంలో ఒక డిస్కం కాకుండా పలు పంపిణీ సంస్థలు కరెంటు సరఫరా చేస్తుంటే ఛార్జీ ఎంత వసూలు చేయాలనే విషయంలో ‘గరిష్ఠ, కనిష్ఠ ఛార్జీ’లను రాష్ట్ర ఈఆర్‌సీ నిర్ణయించాలి. కరెంటు ఛార్జీలు పెంచాలని లేదా తగ్గించాలని డిస్కంలు ప్రతిపాదనలిస్తే వాటిపై ఈఆర్‌సీ విచారణ జరిపి తీర్పు చెప్పాల్సిన గడువును 120 నుంచి 90 రోజులకు తగ్గించాలని బిల్లులో ప్రతిపాదించారు.

* విద్యుత్‌ చౌర్యానికి పాల్పడే వారి నుంచి జరిమానా వసూలును తప్పనిసరి చేయాలి..

* జల విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు త్వరగా ఇవ్వాలి..సంప్రదాయేతర ఇంధనం (ఆర్‌ఈ) ఉత్పత్తికి ఎవరు ముందుకొచ్చినా ప్రోత్సహించాలి. 

* వినియోగదారుల హక్కులను డిస్కంలు కాపాడుతున్నాయా లేదో పర్యవేక్షించడానికి ప్రతి రాష్ట్ర ఈఆర్‌సీ తప్పక ఓ విభాగాన్ని ఏర్పాటుచేయాలి.

* ఇంటిపై లేదా సొంత అవసరాలకు సౌర విద్యుత్‌ వంటి ఆర్‌ఈని ఏర్పాటుచేసుకుని వాడుకోగా మిగిలిన కరెంటును విద్యుత్‌ గ్రిడ్‌కు సరఫరా చేసేవారిని ‘ప్రొస్యూమర్‌’ అని పిలుస్తారు. వీరి సమస్యలు, హక్కులను కాపాడేందుకు ఈఆర్‌సీ ప్రత్యేక విభాగం ఏర్పాటుచేయాలి.


విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల డీలైసెన్సింగ్‌ నిబంధనను కేంద్రం తొలగించింది. ఈ క్రమంలో ఒక డిస్కం పరిధిలో మరో ప్రైవేటు సంస్థకు లైసెన్స్‌ ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని రాష్ట్ర ఈఆర్‌సీ నిర్ణయిస్తుంది. ఒక ప్రాంతంలో కరెంటు పంపిణీకి ఒక డిస్కం ఉన్నా కొత్తగా లైసెన్సు పొందే సంస్థకు సొంతంగా ‘విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ’ ఉండాలనే నిబంధననూ కేంద్రం తాజాగా తొలగించింది. ఇప్పటికే ఉన్న ప్రైవేటు డిస్కంలు యథావిధిగా కొనసాగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని