Casino: రూపీని రూపాయిగా మార్చిందెలా?
నేపాల్లో క్యాసినో నిర్వహణతో తమ వలకు చిక్కిన ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, దాసరి మాధవరెడ్డిల దందాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లోతుగా ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంలో ఫెమా ఉల్లంఘన జరిగిందని, పెద్దఎత్తున
విదేశీ క్యాసినోల్లో ఆర్థిక లావాదేవీలపై ఆరా
ప్రవీణ్ హవాలా దందాపై ఈడీ దర్యాప్తు
సోమవారం విచారణకు రావాలని పిలుపు
సినీతారలనూ విచారించే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: నేపాల్లో క్యాసినో నిర్వహణతో తమ వలకు చిక్కిన ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, దాసరి మాధవరెడ్డిల దందాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లోతుగా ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంలో ఫెమా ఉల్లంఘన జరిగిందని, పెద్దఎత్తున సొమ్ము హవాలా మార్గంలో చేతులు మారిందని అనుమానిస్తున్న ఈడీ.. బుధవారం ఉదయం నుంచి రాత్రి ఒంటిగంట వరకు సోదాలు నిర్వహించి కీలక పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకొంది. నిందితుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలించే పనిలో నిమగ్నమైంది. ప్రవీణ్కు కడ్తాల్లో ఫామ్హౌస్, నగరంలో వాణిజ్య భవనాలు ఉన్నట్లు , మరికొన్ని ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలను గుర్తించింది. ఈక్రమంలోనే సోమవారం తమ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరవ్వాలని వీరికి నోటీసులు జారీ చేసింది.
నగదు లావాదేవీలపైనే దృష్టి
నేపాల్... జాపాలోని హోటల్ మేచీ క్రౌన్లో గత జూన్ 10 నుంచి 13 వరకు ‘క్యాసినో వెగాస్ బై బిగ్డాడీ’ పేరిట పెద్దఎత్తున జరిగిన గ్యాంబ్లింగ్లో నగదు ఎలా చేతులు మారిందనేది ప్రస్తుతం ఈడీ దర్యాప్తులో నిగ్గు తేలాల్సి ఉంది. క్యాసినోలో జరిగిన తీన్పత్తా, అందర్బాహర్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన పదుల సంఖ్యలో పంటర్లను హైదరాబాద్ నుంచి పశ్చిమబెంగాల్లోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్లారు. అక్కడి నుంచి జాపాకు రోడ్డుమార్గంలో తరలించి 4 రోజులపాటు హోటల్లో విడిది ఏర్పాటు చేయించారు. ఈ వ్యవహారానికి ప్రవీణ్తో పాటు మాధవరెడ్డి ఏజెంట్లుగా వ్యవహరించారు. ఇందుకు ఒక్కో పంటర్నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఈక్రమంలో రూ.కోట్లలో నగదును విదేశీమారకంగా మార్చిన అంశంపైనే దృష్టి సారించింది. తొలుత రూపాయలను నేపాల్ రూపీల్లోకి ఎలా మార్చారు? అక్కడ జూదం నిర్వహించేందుకు ఎంత విలువైన క్యాసినో కాయిన్లను కొన్నారు? పంటర్లు గెలుచుకున్న రూపీలను తిరిగి రూపాయల్లోకి ఎలా మార్చారనే వివరాలు రాబట్టనున్నారు. నేపాల్ ప్రభుత్వం నుంచీ వివరాలు సేకరించనున్నట్లు తెలిసింది.
అయిదేళ్లలో క్యాసినో క్యాంపులెన్ని?
గోవాలో బిగ్డాడీ క్యాసినోలో ప్రవీణ్ గతంలో జూదం నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. 2017 అక్టోబరులో హైదరాబాద్లోనే ఓ ప్రముఖ హోటల్లో క్యాసినో నిర్వహిస్తూ ప్రవీణ్ టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. ఈక్రమంలో అయిదేళ్లుగా అతడు ఈ దందాలో ఉన్నట్లు ఈడీ భావిస్తోంది. ఇటీవల గోవా, నేపాల్, బంగ్లాదేశ్, థాయ్లాండ్, ఇండోనేసియాల్లోనూ క్యాసినో నిర్వహణకు పాల్పడినట్లు అనుమానిస్తోంది. విదేశాలకు వెళ్లిన పంటర్ల ఆర్థిక లావాదేవీల గురించీ ఆరా తీస్తోంది.
బంగారం అక్రమ దిగుమతి కోణం?
చెన్నైలో ఓ ప్రముఖ హవాలా ఏజెంటుకు ప్రవీణ్తో సన్నిహిత సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హవాలా దందాలో కీలకంగా ఉన్న అతడి కనుసన్నల్లోనే ప్రవీణ్ పనిచేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ కోణంలోనూ ఈడీ విచారించనున్నట్లు తెలిసింది. దుబాయ్ నుంచి విమానాల్లో బంగారం అక్రమ దిగుమతిపై దర్యాప్తు సంస్థల నిఘా విస్తృతంగా ఉండటంతో స్మగ్లర్లు నేపాల్బాట పట్టారనే ప్రచారం దృష్ట్యా ఈడీ వర్గాలు ఆ కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
సామాజిక మాధ్యమ ఖాతాల విశ్లేషణ
ప్రవీణ్ తన కార్యకలాపాలకు సంబంధించిన వీడియోల్ని తరచూ సామాజిక మాధ్యమ ఖాతాల్లో అప్లోడ్ చేస్తూ వచ్చాడు. క్యాసినో నిర్వహణకు సంబంధించిన ప్రచారాలనూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈడీ వాటిని పరిశీలిస్తోంది. నేపాల్లో క్యాసినో నిర్వహణకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీతారలకు నోటీసులిచ్చే అవకాశముంది. క్యాసినోలో ప్రదర్శన ఇచ్చినందుకు వారికి భారీగా ముట్టజెప్పినట్లు అనుమానిస్తున్నారు. ఈక్రమంలో సినీతారల్నీ విచారించే అవకాశముంది.
చోద్యం చూస్తున్న అటవీశాఖ
ప్రవీణ్ విషయంలో అటవీశాఖ చోద్యం చూస్తోందన్న విమర్శలున్నాయి. కడ్తాల్లోని తన ఫాంహౌస్లో కొండచిలువలు, రామచిలుకలు, ఉడుములు వంటి వన్యప్రాణుల్ని బంధించినట్లు, వీటిని వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు సామాజిక మాధ్యమాల్లో అతనుపెట్టిన పోస్టింగ్లలో వెల్లడైంది. కడ్తాల్ ఆమన్గల్ అటవీ డివిజన్ పరిధిలోనిది. దీంతో అక్కడి ఎఫ్డీఓ జానకిరాంను ‘ఈనాడు’ వివరణ కోరగా తాను సెలవులో ఉన్నానని చెప్పారు. రాష్ట్ర అటవీశాఖ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డన్ స్వర్గం శ్రీనివాస్ను సంప్రదించగా.. ఈడీ నుంచి అటవీశాఖకు సమాచారం రావాల్సి ఉందని, అనంతరం శాఖాపరంగా స్పందన ఉంటుందన్నారు. ‘విదేశాల్లోనే ఉండే వన్యప్రాణులు ప్రవీణ్ దగ్గర ఉన్నట్లు తెలిసింది. వాటిని అనుమతితో తెచ్చుకోవచ్చు’ అని వార్డన్ వివరించారు.
ఈడీ విచారణకు హాజరవుతా: ప్రవీణ్
ఈడీ సోదాల అనంతరం ప్రవీణ్ ఐఎస్సదన్లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడాడు. ‘గోవా, నేపాల్లలో క్యాసినో చట్టబద్ధం. అక్కడ నేను లీగల్గానే వ్యాపారం చేశాను. క్యాసినో వ్యవహారంలోనే ఈడీ సోదాలు జరిగాయి. నోటీసిచ్చి సోమవారం రమ్మన్నారు. వారికి కొన్ని అనుమానాలున్నాయి. విచారణకు హాజరై వాటిగురించి వివరణ ఇస్తా’ అని చెప్పాడు.
ప్రముఖులతో సంబంధాలు!
తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మాజీ మంత్రి, ఏపీకి చెందిన మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే, తెలంగాణలోని ఓ ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్.., కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో ప్రవీణ్కు పరిచయాలున్నట్లు సమాచారం. కొందరు హవాలా ఏజెంట్లతోనూ సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడి మొబైల్లో వాట్సప్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్ని ఈడీ విశ్లేషిస్తోంది.
కారు స్టిక్కర్ను మూణ్నెల్ల కిందటే పారేశా: మంత్రి మల్లారెడ్డి
ఈనాడు, హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న మాధవరెడ్డి కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్కు, తనకు సంబంధం లేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ వద్ద గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆ కారుకు ఉన్న స్టిక్కర్ మార్చికి సంబంధించిందని చెప్పారు. దాని కాలపరిమితి ముగియడంతో మూణ్నెల్ల కిందటే తీసి బయట పారేశానని చెప్పారు. దాన్ని తీసుకుని ఎవరో కారుకు పెట్టుకుంటే తనకేం సంబంధమని మంత్రి ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోతున్న జల్పల్లి, ఉమ్దాసాగర్ చెరువులతోపాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
కోర్టు ఆవరణలో నిందితులకు సంకెళ్లపై వివరణ ఇవ్వండి
రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి జిల్లా కోర్టు ఆవరణలో నిందితులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
రేకుల డబ్బాలు కావు.. నివాస గృహాలే!
ఇక్కడ కనిపిస్తున్నవి రేకుల డబ్బాలు అనుకుంటే పొరపాటే. అవి నివాస గృహాలే. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని పేదలకు 2008లో అప్పటి ప్రభుత్వం పేదలకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.