తొలుత 3.3 లక్షల కొత్త పింఛన్లు!

రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరులో భాగంగా తొలుత మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ప్రాధాన్యం లభించనుంది. కొత్తగా 10 లక్షల పింఛన్ల మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో..

Published : 13 Aug 2022 04:14 IST

మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ప్రాధాన్యం
పరిశీలిస్తున్న ఎంపీడీఓలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరులో భాగంగా తొలుత మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ప్రాధాన్యం లభించనుంది. కొత్తగా 10 లక్షల పింఛన్ల మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. పెండింగ్‌లోని 3.3 లక్షల మందికి వెంటనే పింఛను మంజూరుకు కార్యాచరణ ప్రారంభించారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర కేటగిరీలకు చెందిన దాదాపు 3.3 లక్షల మంది దరఖాస్తుల పరిశీలన గతంలోనే పూర్తయింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో వితంతువుల దరఖాస్తులు దాదాపు 1.68 లక్షలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులవి 68 వేలు, దివ్యాంగుల దరఖాస్తులు 57 వేలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. ఎంపీడీవోలు పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి, పంచాయతీ కార్యదర్శులకు సూచనలు ఇస్తున్నారు. పుట్టిన తేదీ వివరాలు సరిగా ఉన్నాయా? ఆధార్‌ కార్డును అప్‌లోడ్‌ చేశారా? బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ తదితర వివరాల్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. లబ్ధిదారుడి కుటుంబంలో ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా? ఇప్పటికే పింఛను తీసుకుంటున్నారా? ఆదాయం, వ్యవసాయ భూములు తదితర వివరాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని ఆదేశిస్తున్నారు.

గతేడాది 8 లక్షల మంది దరఖాస్తు

గత ఏడాది వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించాక.. కొత్తగా అర్హత పొందిన 8 లక్షల మంది ప్రభుత్వ సూచన మేరకు మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలంటే క్షేత్రస్థాయిలో అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలి. ఇందుకోసం ఆయా దరఖాస్తులను క్షేత్రస్థాయి సిబ్బందికి అప్పగించి, పింఛన్ల జారీ విధివిధానాల మేరకు పరిశీలన చేసేందుకు ఆదేశాలు జారీ కావాల్సిఉంది. ఈ పరిశీలన తరువాత 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరయ్యే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని