జ్వరానికి పోషకాహారమే మందు

ప్రస్తుతం రాష్ట్రమంతా సాధారణ ఫ్లూ జ్వరాలు మొదలుకొని డెంగీ, మలేరియా వంటివి కూడా ప్రబలుతున్నాయి. ఇక కొవిడ్‌ ఎలాగూ కొనసాగుతూనే ఉంది. పాతకాలంలో జలుబు చేస్తే బాగా తినాలని.. జ్వరం వస్తే ఉపవాసం ఉండాలని చెప్పేవారు.

Published : 15 Aug 2022 06:43 IST

ద్రవాలూ ఎక్కువగా తీసుకోవాలి

కోలుకునే దశలో ఇవన్నీ కీలకమంటున్న నిపుణులు

ఉపవాసంతో అనారోగ్యం పెరుగుతుందని హెచ్చరిక

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం రాష్ట్రమంతా సాధారణ ఫ్లూ జ్వరాలు మొదలుకొని డెంగీ, మలేరియా వంటివి కూడా ప్రబలుతున్నాయి. ఇక కొవిడ్‌ ఎలాగూ కొనసాగుతూనే ఉంది. పాతకాలంలో జలుబు చేస్తే బాగా తినాలని.. జ్వరం వస్తే ఉపవాసం ఉండాలని చెప్పేవారు. నిజానికి ఈ విధానం వల్ల అనారోగ్యం పెరుగుతుందే తప్ప.. తగ్గదని వైద్య నిపుణులు చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు నీరు తగినంతగా తాగడం ఎంత ముఖ్యమో.. పోషకాహారం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటివి ఎక్కువగా తినడం వల్ల వేగంగా కోలుకుంటారని చెబుతున్నారు.

పోషకాహారం అందకపోతే..

శరీరం ఇన్‌ఫెక్షన్ల బారినపడిప్పుడు.. వాటిని ఎదుర్కోవడంలో రోగ నిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. దానిని బలంగా ఉంచడంలో పౌష్టికాహారం దోహదపడుతుంది. పేగుల్లో మంచి, చెడు బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు ప్రొ ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్స్‌ పెరిగి మంచి బ్యాక్టీరియాను నాశనం చేసి, చెడ్డవాటిని పెంచుతుంది. దీనివల్ల మరింతగా ఆరోగ్యం క్షీణిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఒంట్లో నుంచి నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతుంటాయి. కొందరికి విరేచనాలు, వాంతులు కావడం వల్ల కూడా ఒంట్లోంచి నీరు, లవణాలు వెళ్లిపోతాయి. ఇలాంటి సమయాల్లో శరీరానికి తగినంత నీరు, లవణాలు, పోషకాహారాన్ని అందించలేకపోతే.. వీటి వల్ల ఇంకా శరీరం కుంగిపోయి రక్తపోటు పడిపోతుంది. బాగా నీరసం, లేవలేని పరిస్థితులు వస్తాయి.

రోగ నిరోధక శక్తి సమకూరేదిలా

పౌష్టికాహారాన్ని రెండు రకాలుగా చెబుతారు. 1. మైక్రో న్యూట్రియంట్స్‌ అంటే విటమిన్లు, ఖనిజాలు(మినరళ్లు) 2. మ్యాక్రో న్యూట్రియంట్స్‌ అంటే కార్బోహైడ్రేట్స్‌, మాంసకృత్తులు, కొవ్వులు(ప్రొటీన్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌). రోగ నిరోధక శక్తిని పెంపొందించాలంటే మ్యాక్రో న్యూట్రియంట్లతో పాటు మైక్రో న్యూట్రియంట్లు ఉండాల్సిందే. ప్రధానంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి. విటమిన్‌ ఏ, సీ, డీ, ఈ లు శ్వాస కోశ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

ఏ ఆహారాల్లో ఏముంటాయి?

విటమిన్‌ ఎ: యాంటీ జెన్‌, యాంటీబాడీస్‌ పనిచేయడంలో ఎక్కువగా ఉపయోగపడతుంది. నోరు, జీర్ణాశయం, పేగులు, శ్వాసకోశ వ్యవస్థలోని చర్మాన్ని, కణజాలాన్ని రక్షిస్తుంది. చిలగడదుంప(స్వీట్‌ పొటాటో), క్యారెట్‌, బీట్‌రూట్‌, కీరదోస, మామిడి, బొప్పాయి, ఆప్రికాట్స్‌, గుడ్లు, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తుల్లో అధికంగా లభిస్తాయి.

విటమిన్‌ సి: కణాల మరమ్మతుకు, పునరుత్పత్తికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. యాంటీబాడీస్‌ను ప్రేరేపిస్తుంది. ఆకుపచ్చని కూరగాయలు, దేశీయ జామ, పచ్చిమామిడి, దానిమ్మ, ద్రాక్ష, తదితర పుల్లని పండ్లు, బొప్పాయి, క్యాప్సికం, ఎర్రతోటకూర, స్ట్రాబెర్రీ, నిమ్మలో ఎక్కువగా లభిస్తుంది. త్రిఫల చూర్ణం(ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల పొడి) వాడటం మేలు చేస్తుంది. కరక్కాయ జీర్ణ వ్యవస్థపై, తానిక్కాయ ఊపిరితిత్తులు, గుండె పనితీరు మెరుగుపర్చడంపై బాగా పనిచేస్తాయి.

విటమిన్‌ డి: హానికారక అతి సూక్ష్మక్రిముల సంహారానికి, మేలు చేసే సూక్ష్మక్రిముల వృద్ధికి దోహదపడుతుంది.

పాల ఉత్పత్తుల్లో, ఫ్యాటీ ఫిష్‌, గుడ్లు, మాంసహారంలో కాలేయంలో ఎక్కువగా ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు సూర్యరశ్మి శరీరంలో 18 శాతం భాగాన్ని స్పృశించేలా చూసుకోవాలి.

విటమిన్‌ ఈ: కణం ఆకృతి చక్కగా రూపాంతరం చెందాలంటే చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్‌గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధుల్లో రోగ నిరోధకతను పెంపొందించడంలో పనిచేస్తుంది. పసుపు, శెనగలు, కరివేపాకు, ఎండుకొబ్బరి, పొద్దు తిరుగుడు, అవిసె గింజలు, బాదం, పిస్తాల్లో లభిస్తుంది.

విటమిన్‌ బి 12: రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. నరాలు, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పేగుల నుంచి రక్తనాళాలకు పోషకాలు చేరడంలో బీ 12 సహకరిస్తుంది. చేపలు, మాంసం, చికెన్‌, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, ఎండుద్రాక్షల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.

మాంసకృత్తులు: ఈ తరహా ఆహారాలు ఆరోగ్యవంతంగా ఉండేలా, త్వరగా కోలుకునేలా చేస్తాయి. సోయా ఉత్పత్తులు, ఉప్పు కలపని గింజలు, విత్తనాలు, బీన్స్‌, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్‌, మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తుల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి.


ఊబకాయులకు మరిన్ని జాగ్రత్తలు అవసరం

సన్నగా ఉన్న వారిలో కంటే ఊబకాయుల్లో సహజంగానే ప్రొ ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్స్‌ ఉత్పత్తి అవుతుంటాయి. దీనికి తోడు వారికి జ్వరం వస్తే సైటోకైన్స్‌ దాడి మరింతగా పెరుగుతుంది. సహజంగా ఉండే ఇన్‌ఫ్లమేషన్‌, జ్వరం వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ రెండూ కలిసి ముప్పు రెట్టింపు అవుతుంది. వీరు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. అందుకే వీరికి మరింత జాగ్రత్తగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తుండాలి. తీపి పదార్థాలు, నిల్వ ఆహార పదార్థాల(జంక్‌ఫుడ్‌)ను తిన్నప్పుడు మరింతగా ఇన్‌ఫ్లమేషన్‌ ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి జ్వరం ఉన్నప్పుడు జంక్‌, తీపి పదార్థాలు, నిల్వ ఆహారాలను తినకూడదు. పోషకాహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిని సహజ సిద్ధంగా తీసుకోలేని పరిస్థితుల్లో మాత్రల రూపంలోనూ ఇవ్వవచ్చు.

-డాక్టర్‌ రాకేశ్‌ కలపాల, సీనియర్‌ కన్సల్టెంట్‌, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌, ఏఐజీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు