కొత్త వారికి పింఛన్ల పంపిణీ షురూ

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేసింది. వీరితోపాటు పెండింగులో ఉన్న పింఛన్ల దరఖాస్తులను కూడా పరిష్కరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి పీడీలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు అందాయి.

Published : 16 Aug 2022 05:15 IST

కొన్ని చోట్ల లబ్ధిదారులకు అందజేత

వచ్చే నెల నుంచి బ్యాంకుల్లో జమ

57 ఏళ్లు నిండిన వారికి ‘ఆసరా’

ఈనాడు, హైదరాబాద్‌: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేసింది. వీరితోపాటు పెండింగులో ఉన్న పింఛన్ల దరఖాస్తులను కూడా పరిష్కరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి పీడీలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు అందాయి.

పింఛన్ల కోసం ఆన్‌లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం.. దరఖాస్తుదారుల ఆధార్‌, ఓటరు కార్డులు, తమవద్ద ఉన్న సమాచారం ఆధారంగా అర్హులను ఎంపిక చేసింది. దీనికోసం తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. దీని ఆధారంగా నకిలీ పింఛన్ల(డూప్లికేషన్ల)నూ తొలగించింది. అర్హులకు ప్రస్తుత ఆగస్టు నెలలో పింఛన్లు మంజూరు చేశామని, లబ్ధిదారులకు సెప్టెంబరు మొదటి వారంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం సోమవారం ప్రతి జిల్లాలో కొందరు లబ్ధిదారుల్ని ఎంపిక చేసి, వారికి ‘ఆసరా బహుమానాలు’ పంపిణీ చేసింది. పింఛను మంజూరు పత్రం, గుర్తింపు కార్డు, స్థానిక ఎమ్మెల్యే/మంత్రి రాసిన లేఖను జత చేసి అందించింది. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో వంద మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు 57 ఏళ్లు నిండిన లబ్ధిదారులు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం తాజాగా ఆసరా పింఛన్లు మంజూరు చేసి ఆ వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారులు, జిల్లా అధికారులకు పంపించింది. 

నెరవేరుతున్న సీఎం హామీ: ఎర్రబెల్లి

జనగామ, న్యూస్‌టుడే: తెలంగాణలో 57 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామంటూ పేదలకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నెరవేరుతోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 57 ఏళ్లు దాటిన లబ్ధిదారులకు మంత్రి ఈ సందర్భంగా పింఛను గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడారు.

నిరుపేదలకు సీఎం కేసీఆర్‌ అండ: ఎమ్మెల్సీ కవిత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 36 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందజేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.  మరో 10 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయడం ద్వారా సీఎం కేసీఆర్‌ మరోసారి నిరుపేదల ఆత్మబంధువు అని నిరూపించుకున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని