TS High Court: ఆ భూమి రామానాయుడు కుటుంబానిదే.. తీర్పు వెలువరించిన హైకోర్టు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో దగ్గుబాటి రామానాయుడు కుటుంబం కొనుగోలు చేసిన భూములు తమవేనంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేస్తూ బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది.

Updated : 18 Aug 2022 08:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో దగ్గుబాటి రామానాయుడు కుటుంబం కొనుగోలు చేసిన భూములు తమవేనంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేస్తూ బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఖానామెట్‌లో 1996లో దగ్గుబాటి రామానాయుడు కుటుంబం కొనుగోలు చేసిన భూములతోపాటు సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, పి.గోవిందరెడ్డి తదితరులకు చెందిన 26.16 ఎకరాల భూమికి సంబంధించిన హక్కుల వివాదంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీళ్లు దాఖలు చేసింది.

వీటిపై సుదీర్ఘ వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌.నందలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. అన్ని అంశాలను పరిశీలించి.. ‘‘రామానాయుడు తదితరులు రికార్డును తారుమారు చేశారని, మోసపూరిత పత్రాలు సృష్టించారని ప్రభుత్వం ఎక్కడా ఆరోపణలు చేయలేదు. దీనికి సంబంధించి రికార్డుల్లో కూడా ఎలాంటి ఆరోపణలు లేవు. 1961లో అసైన్‌మెంట్‌ తప్పని చెబుతున్నారు.. 1963లో మాజీ సైనికులకు భూమి కేటాయింపు జీవో వచ్చినపుడు, గతంలో చేసిన అసైన్‌మెంట్‌ రద్దుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూమిని కేటాయించిన 5 దశాబ్దాల తరువాత, అనుబంధ సేత్వార్‌ జారీ చేసిన 15 ఏళ్ల తరువాత చర్యలు ప్రారంభించడం సరికాదు. అనుబంధ సేత్వార్‌ను రద్దు చేయడం చెల్లదు. ఆ భూముల స్వాధీనానికి ప్రయత్నించరాదంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించలేదు’’అంటూ ప్రభుత్వ అప్పీళ్లను ధర్మాసనం కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని