యాసంగిలో ప్రయోగాత్మకంగా పత్తి సాగు

వచ్చే నెల ఒకటి నుంచి ప్రారంభం కానున్న యాసంగి సీజన్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు వ్యవసాయశాఖ విత్తన క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా పత్తి సాగు చేపట్టాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు.

Published : 28 Sep 2022 04:56 IST

మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే నెల ఒకటి నుంచి ప్రారంభం కానున్న యాసంగి సీజన్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు వ్యవసాయశాఖ విత్తన క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా పత్తి సాగు చేపట్టాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. యాసంగి పంటల సాగుకు సంబంధించి రైతువేదికల్లో నిర్వహించే కార్యక్రమాలపై నెలవారీ క్యాలెండర్‌ తయారు చేయాలన్నారు. మార్కెటింగ్‌ శాఖ పరిశోధన, విశ్లేషణ విభాగం ఇచ్చే సూచనల ప్రకారం మార్కెట్లో డిమాండ్‌ ఉండే పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. యాసంగి పంటల సాగుకు సమాయత్తం, వానాకాలం పంటల ఉత్పత్తుల అంచనాలపై మంగళవారం ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ధాన్యం మరపట్టినప్పుడు నూక శాతం తక్కువగా వచ్చే వరి విత్తన రకాలనే యాసంగిలో వేయాలి. వచ్చే మార్చి 31లోపు వరికోతలు పూర్తయ్యేలా పంటకాలాన్ని 15 నుంచి 30 రోజులు ముందుకు తెచ్చేలా రైతులను అధికారులు చైతన్యపరచాలి. మినుములు, పొద్దుతిరుగుడు, పప్పుసెనగ, వేరుసెనగ, నూనెగింజల సాగును ప్రోత్సహించాలి. కూరగాయల సాగుకు ప్రణాళిక సిద్ధం చేయాలి. యాసంగి సాగు సన్నద్ధతపై రోజుకు రెండు జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలి. మార్కెట్లలో వర్షాలకు పంటలు తడవకుండా టార్పాలిన్లను ఏర్పాటు చేసుకోవాలి. ఏటా తప్పనిసరిగా భూసార పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి’’ అని మంత్రి ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని