ఇంటర్నల్స్‌కూ ఇంప్రూవ్‌మెంట్‌

ఇంజినీరింగ్‌లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి చేరే విద్యార్థులకు జేఎన్‌టీయూ-హెచ్‌ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఆర్‌22 రెగ్యులేషన్స్‌ పేరిట కొత్త అకడమిక్‌ నిబంధనలను విడుదల చేసింది. గతంతో పోల్చితే ఎన్నో కొత్త విధానాలను

Published : 30 Sep 2022 04:09 IST

ఆర్‌22 మార్గదర్శకాలు తెచ్చిన జేఎన్‌టీయూ-హెచ్‌

ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి చేరే విద్యార్థులకు జేఎన్‌టీయూ-హెచ్‌ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఆర్‌22 రెగ్యులేషన్స్‌ పేరిట కొత్త అకడమిక్‌ నిబంధనలను విడుదల చేసింది. గతంతో పోల్చితే ఎన్నో కొత్త విధానాలను ప్రవేశపెట్టినట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి వివరించారు.

* ఒక కోర్సులో కనీసం 15 మంది విద్యార్థులు చేరితేనే దానికి అనుమతిస్తారు. సెమిస్టర్‌ మార్కులు థియరీకి 60 శాతం, ఇంటర్నల్స్‌కు 40 శాతంగా నిర్ణయించారు.

* సెమిస్టర్‌ ఆసాంతం ఇంటర్నల్స్‌ ఉంటాయి. మిడ్‌టర్మ్‌-1, 2 పరీక్షలకు కలిపి 25 మార్కులుంటాయి.

* అసైన్‌మెంట్స్‌కు 5, వైవా/పీపీటీ/పోస్టర్‌ ప్రజెంటేషన్‌కు 10 మార్కులు ఉంటాయి. మిడ్‌ టర్మ్‌ పరీక్షలకు అనుగుణంగా రెండుసార్లు అసైన్‌మెంట్స్‌, వైవాలు ఇవ్వాలి. ఈ రెండింటి సగటు తీసి తుది మార్కులు లెక్కిస్తారు.

* ఇంటర్నల్స్‌లో ఫెయిలవ్వడం లేదా అసైన్‌మెంట్‌, సబ్జెక్టు వైవా/పోస్టర్‌ ప్రజెంటేషన్‌ చేయలేకపోతే.. నాలుగు వారాల్లోపు ఇంటర్నల్స్‌కు మరోసారి రిజిస్టర్‌ చేసుకుని ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకునే వీలుంటుంది.

* విద్యార్థులు మూడో ఏడాదిలో పరిశ్రమల్లో శిక్షణ/ఇంటర్న్‌షిప్‌ / పరిశ్రమ ఆధారిత మినీ ప్రాజెక్టు / నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో ఏదో ఒకదాంట్లో భాగస్వాములవ్వాలి. నాలుగో ఏడాదిలో ప్రాజెక్టు తప్పనిసరి.

రెండేళ్ల తర్వాత మానేస్తే.. ఇక అంతే

* రెండేళ్ల తర్వాత విద్యార్థి ఎలాంటి బ్యాక్‌లాగ్స్‌ లేకుండా ఇంజినీరింగ్‌ చదవడం ఆపేయాలనుకుంటే యూజీ డిప్లొమా సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఇది అనుబంధ కళాశాలలకూ వర్తిస్తుంది. అలా మానేసిన విద్యార్థులు మళ్లీ ఇంజినీరింగ్‌లో చేరే వీలుండదు.

* ఎవరైనా విద్యార్థి ప్రాజెక్టు చేసేందుకు చదివే కళాశాల, యూనివర్సిటీ అనుమతితో ఏడాది బ్రేక్‌ తీసుకోవచ్చు. మళ్లీ వచ్చి అదే కళాశాలలో చేరి ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు.

హాజరు నిబంధనలు యథాతథం

కనీసం 75 శాతం హాజరు ఉండాలి. కండోనేషన్‌ ప్రాతిపదికన పది శాతం హాజరు మినహాయింపు ఉంటుంది. అంతకుమించి తగ్గితే సెమిస్టర్‌ పరీక్షలు రాసేందుకు వీల్లేకుండా డిటెయిన్‌ అవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని