ఇంజినీరింగ్‌ విద్యార్థుల నెత్తిన పిడుగు!

రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్రెడిట్‌ ఆధారిత డిటెన్షన్‌ విధానాన్ని జేఎన్‌టీయూ పునరుద్ధరించింది. దీని ప్రకారం ఏటా నిర్దేశిత క్రెడిట్స్‌ సాధించకపోతే విద్యార్థులు ఎగువ తరగతులకు (మరుసటి సంవత్సరానికి) ప్రమోట్‌ కాలేరు.

Updated : 07 Oct 2022 10:18 IST

డిటెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించిన జేఎన్‌టీయూ

నిర్దేశిత క్రెడిట్స్‌ లేకుంటే ఎగువ తరగతికి వెళ్లలేరు..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్రెడిట్‌ ఆధారిత డిటెన్షన్‌ విధానాన్ని జేఎన్‌టీయూ పునరుద్ధరించింది. దీని ప్రకారం ఏటా నిర్దేశిత క్రెడిట్స్‌ సాధించకపోతే విద్యార్థులు ఎగువ తరగతులకు (మరుసటి సంవత్సరానికి) ప్రమోట్‌ కాలేరు. ఈమేరకు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ తాజాగా ఆదేశాలు జారీచేశారు. ఇంజినీరింగ్‌లో 2022-23 విద్యా సంవత్సరం త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం 2, 3వ ఏడాది పూర్తి చేసిన విద్యార్థులు పై తరగతులకు వెళ్లాలంటే తప్పకుండా నిర్దేశిత క్రెడిట్స్‌ సాధించాలి. ఈ విద్యార్థులంతా కరోనా సమయంలో మొదటి, రెండో ఏడాదిలో ఉన్నవారే. అప్పట్లో తరగతులు సరిగా జరగక పరీక్షలు సరిగా రాయకపోవడంతో క్రెడిట్స్‌ తక్కువగా వచ్చాయని, ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయిలో క్రెడిట్స్‌ దక్కించుకోవాలంటే ఎలా సాధ్యమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

* ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులు ఏటా నిర్దేశిత క్రెడిట్స్‌ సాధించాలి.  గత రెండు విద్యా సంవత్సరాల్లో.. కరోనా ప్రభావం కారణంగా క్రెడిట్‌ ఆధారిత డిటెన్షన్‌ విధానాన్ని జేఎన్‌టీయూ రద్దు చేసింది.  ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో క్రెడిట్‌ ఆధారిత డిటెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు జేఎన్‌టీయూ ప్రకటించింది. దీనిప్రకారం ఇంజినీరింగ్‌ విద్యార్థులు మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదిలోకి వెళ్లాలంటే 18 క్రెడిట్స్‌, రెండు నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 47, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 73 క్రెడిట్స్‌ సాధించాలి. లేటరల్‌ ఎంట్రీలో ప్రవేశిస్తే రెండో ఏడాది నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 25 క్రెడిట్స్‌, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 51 క్రెడిట్స్‌ ఉండాలి. ఈమేరకు సాధించకుంటే మరుసటి ఏడాదిలోకి ప్రవేశించే వీలుండదు. ఈ ఆదేశాలపై విద్యార్థులుమండిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని